ప్రజల మేలు కోసమే కెసిఆర్తో కలిశా: చంద్రబాబు
హైదరాబాద్: ప్రజల కోసమే తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావుతో కలిసి పనిచేయాలని నిర్ణయించుకున్నట్లు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. రెండు రాష్ట్రాలు ఘర్షణ పడితే ప్రజలు తీవ్రంగా నష్టపోతారని ఆయన సోమవారం ఢిల్లీలో మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు.
రెండు రాష్ట్రాల మధ్య సఖ్యతను కొనసాగించేందుకు కెసిఆర్ అంగీకరించినట్లు ఆయన తెలిపారు. పరస్పరం గొడవ పడుతుంటే సమస్యలు పరిష్కారం కావని ఆయన అభిప్రాయపడ్డారు. విభజన జరిగి చాలా కాలమైనా ఐపియస్, ఐఎఎస్ అధికారుల పంపిణీ జరగలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

సోమవారం సాయంత్రం ప్రధాని నరేంద్ర మోడీతో చంద్రబాబు భేటీ అయ్యారు. రాష్ట్ర విభజన తర్వాత తలెత్తిన సమస్యలు, విభజన చట్టంలో ఇచ్చిన హామీల అమలుపై బాబు ప్రధానితో చర్చించారు. ఏపీకి ప్రత్యేక హోదాపై మోడీ హామీ ఇచ్చినట్లు తెలియవచ్చింది. త్వరలోనే దీనిపై నిర్ణయం ప్రకటిస్తామని, బడ్జెట్ లోటు భర్తీ చేయడంతోపాటు పోలవరం ప్రాజెక్టుకు నిధులు విడుదల చేస్తామని ప్రధాని హామీ ఇచ్చారు. ఇద్దరిమధ్య సుమారు గంటన్నర పాటు ఈ సమావేశం జరిగింది.
ఏపీకు ప్రత్యేక హోదాపై త్వరగా నిర్ణయం తీసుకుంటే పనులు త్వరగా జరుగుతాయని, దీని కోసం పరిశ్రమలు కూడా ఎదురుచూస్తున్నాయని చంద్రబాబు ప్రధాని మోడీతో చెప్పారు. దీనిపై స్పందించిన మోడీ కచ్చితంగా నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చినట్లుగా తెలియవచ్చింది. లోటు బడ్జెట్ కూడా ఈ ఏడాదిలోగా పూర్తి చేస్తామని చెప్పినట్లు సమాచారం.
ఈ లోటు బడ్జెటే కాకుండా వచ్చే ఐదేళ్ళలో ఈ లోటు బడ్జెట్ను పూడ్చాలని కూడా చంద్రబాబు మోడీని కోరినట్లుగా సమాచారం. ప్రస్తుతానికి ఈ ఏడాది వరకు మోడీ హామీ ఇచ్చినట్లుగా తెలియవచ్చింది.












Click it and Unblock the Notifications