Chandrayaan 3: డీకే శివకుమార్ తగ్గట్లేదుగా- ఇస్రో సైంటిస్టులకు ఘన సన్మానం..!!
బెంగళూరు: కోట్లాదిమంది భారతీయుల నిరీక్షణ ఫలించింది. చందమామ చేతికి అందింది. జాబిల్లిపై త్రివర్ణ పతాకం సగర్వంగా ఎగిరింది. భారత్.. నింగిని జయించింది. ఇస్రో చేపట్టిన చంద్ర మండల యాత్ర- విజయ తీరాలకు చేరింది. ఇస్రో ప్రయోగించిన చంద్రయాన్ 3 ల్యాండర్ మాడ్యుల్ ఈ సాయంత్రం 6:04 నిమిషాలకు జాబిల్లి మీద అడుగు మోపింది.
చంద్రుడి ఆర్బిటర్ నుంచి ఒక్కో దశలో కిందికి దిగింది చంద్రయాన్ 3 ల్యాండర్ మాడ్యుల్ విక్రమ్. అవరోహణ క్రమంలో కిందికి దిగుతూ వచ్చింది. అప్పటివరకు అండాకారంలో పరిభ్రమిస్తూ వచ్చిన విక్రమ్ ల్యాండర్.. చంద్రుడి ఉపరితలానికి సమీపించిన వెంటనే వర్టికల్గా మారింది. నిట్టనిలువుకు చేరుకుంది. అక్కడే సగం విజయం సాధించినట్టయింది.

అనంతరం ఒక్కో దశను అధిగమిస్తూ క్రమంగా చంద్రుడి ఉపరితలంపై ల్యాండ్ అయింది. దీనితో చంద్రుడిపై సాఫ్ట్ ల్యాండింగ్ చేసిన నాలుగో దేశంగా ఆవిర్భవించింది భారత్. ఇంతకుముందు- రష్యా (సోవియట్ యూనియన్), అమెరికా, చైనా ఈ ఘనతను సాధించాయి. దక్షిణ ధృవంపై ల్యాండింగ్ చేసిన తొలి దేశం.. భారత్.
ఈ మిషన్ విజయవంతమైన కొద్దిసేపటికే కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ బెంగళూరులోని ఇస్రో కార్యాలయానికి బయలుదేరి వెళ్లారు. అప్పటికప్పుడు ఇస్రో ఛైర్మన్ సోమ్నాథ్ అపాయింట్మెంట్ తీసుకున్నారు. సాయంత్రం 7:30 గంటల సమయంలో ఆయన ఇస్రో ప్రధాన కార్యాలయానికి చేరుకున్నారు. సైంటిస్టులను సన్మానించారు.

సోమ్నాథ్, చంద్రయాన్ 3 ప్రాజెక్ట్ డైరెక్టర్ డాక్టర్ పీ వీరముత్తువేల్, ప్రాజెక్ట్ అసోసియేట్ డైరెక్టర్ కే కల్పన, మిషన్ ఆపరేషన్స్ డైరెక్టర్ ఎం శ్రీకాంత్, ఇతర సైంటిస్టులను ఘనంగా సన్మానించారు. కన్నడ సంప్రదాయబద్ధమైన తలపాగాను ధరింపజేసి, చందనంతో చేసిన మాలను వేశారు. శాలువా కప్పారు.

చంద్రుడిపై విక్రమ్ ల్యాండర్ను విజయవంతంగా దింపినందుకు ఇస్రో శాస్త్రవేత్తలు ఎనలేని కృషి చేశారని అభినందించారు. ఈ ప్రాజెక్టు కోసం పని చేసిన ఇస్రో శాస్త్రవేత్తలు, సిబ్బంది సేవలను దేశం ఇప్పట్లో విస్మరించలేదని అన్నారు. అసాధ్యాన్ని సుసాధ్యం చేసి చూపారంటూ కితాబిచ్చారు. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications