దినకరన్ కు మరో షాక్! ఫెరా కేసులో అభియోగాలు ఖరారు
అన్నాడీఎంకే డిప్యూటీ ప్రధాన కార్యదర్శి టీటీవీ దినకరన్ కు మరో షాక్ తగిలింది. ఇప్పటికే అధికారిక గుర్తు కోసం ఎన్నికల సంఘానికి లంచం ఇవ్వజూపినట్లుగా కేసు ఎదుర్కొంటున్న ఆయనపై మరో కేసులో కూడా అభియోగాలు.
చెన్నై: అన్నాడీఎంకే డిప్యూటీ ప్రధాన కార్యదర్శి టీటీవీ దినకరన్ కు మరో షాక్ తగిలింది. ఇప్పటికే అధికారిక గుర్తు కోసం ఎన్నికల సంఘానికి లంచం ఇవ్వజూపినట్లుగా కేసు ఎదుర్కొంటున్న ఆయనపై మరో కేసులో కూడా అభియోగాలు ఖరారయ్యాయి.
2001లో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్(ఈడీ) నమోదు చేసిన కేసులో దినకరన్ పై ఎగ్మూరు అడిషనల్ చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టు అభియోగాలు ఖరారు చేసింది. విదేశీ మారక ద్రవ్య నియంత్రణ చట్టం(ఫెరా)లోని పలు నిబంధనలు ఆయన ఉల్లంఘించినట్లుగా ఈడీ కేసు నమోదు చేసింది.
ఈ కేసు విచారణకు గురువారం వ్యక్తిగతంగా హాజరైన దినకరన్.. న్యాయమూర్తి అభియోగాలు చదివి వినిపించగా వాటిని తిరస్కరించారు. ఆర్బీఐ అనుమతి లేకుండా 1.04,93,313 డాలర్ల అక్రమ లావాదేవీలను దినకరన్ నిర్వహించి, బ్రిటీష్ వర్జిన్ ఐల్యాండ్ లోని డిప్పర్ ఇన్వెస్ట్ మెంట్ లిమిటెడ్ లోకి తరలించినట్లు ఈడీ కేసు నమోదు చేసింది.
అంతేకాకుండా 36,36,000 డాలర్లు, 1,00,000 పౌండ్లు విదేశాల్లో అక్రమ లావాదేవీలు జరిపినట్లు మరో కేసు కూడా నమోదు చేసింది. ఈ రెండు కేసుల్లో విచారణను న్యాయస్థానం జూన్ 22కు వాయిదా వేసింది.