సెక్స్ చాట్.. ఆ పాప్-అప్ను క్లిక్ చేస్తే అంతే సంగతి.. ఇప్పటివరకు 350 మంది బలి..
అమ్మాయిల గొంతుతో అబ్బాయిలను ప్రలోభ పెడుతూ.. వారి వద్ద నుంచి బలవంతపు వసూళ్లు చేస్తోన్న ఓ వ్యక్తిని చెన్నై పోలీసులు అరెస్ట్ చేశారు. సెక్స్ చాట్ పేరుతో అమ్మాయిలా మాట్లాడుతూ అబ్బాయిలను ముగ్గులోకి దింపే ఆ వ్యక్తి.. ఆపై లైంగిక వేధింపుల పేరుతో రివర్స్ గేమ్ మొదలుపెడుతాడు. పోలీసులకు ఫిర్యాదు చేశానంటూ కంప్లైంట్ కాపీని కూడా పంపిస్తాడు. దీంతో భయపడిపోయి అతను అడిగినంత డబ్బులు ఇచ్చి చాలామంది మోసపోయారు. ఓ జాబ్స్ వెబ్సైట్లో పాప్-అప్ ప్రకటనల ద్వారా ఇతను మోసాలకు పాల్పడుతున్నాడు. ఆ పాప్-అప్ను క్లిక్ చేశారంటే ఇక అంతే సంగతి.
చెన్నై పోలీసులు కథనం ప్రకారం..
చెన్నై పోలీసుల కథనం ప్రకారం.. మదురవోయల్కి చెందిన పి.ఉదయ్ రాజ్ అనే వ్యక్తి ఫిర్యాదుతో ఈ వ్యవహారం వెలుగుచూసింది. ఉద్యోగ అన్వేషణలో ఉన్న తాను ఫిబ్రవరి 16న లొకాంటో యాప్ను డౌన్లోడ్ చేసుకున్నట్టు పోలీసులకు చెప్పాడు. అందులో ఉద్యోగ ప్రకటనల కోసం సెర్చ్ చేస్తుండగా.. అతని సెల్ఫోన్ స్క్రీన్పై సెక్స్ చాట్ పేరుతో ఓ పాప్-అప్ వచ్చింది.
సెక్స్ సర్వీస్ పేరుతో మోసాలు..
ఉదయ్ రాజ్ ఆ పాప్-అప్ని క్లిక్ చేయడంతో నేరుగా ఓ చాట్ బాక్స్ ఓపెన్ అయింది. అందులో కొద్దిసేపు చాట్ చేశాక ప్రియ అనే అమ్మాయి పేరుతో ఓ ఫోన్ కాల్ వచ్చింది. తాము కస్టమర్లకు సెక్స్ సర్వీస్ అందిస్తామని అతనితో చెప్పింది. ఆమె చెప్పిన ప్రకారం ఉదయ్ రాజ్.. రూ.100 ఆన్లైన్ ద్వారా పంపించడంతో ఒక న్యూడ్ ఫోటోను పంపించింది. ఆ తర్వాత రూ.1500 ఇస్తే వీడియో కూడా పంపిస్తానని మెసేజ్ చేసింది. అయితే ఉదయ్ రాజ్కు ఎక్కడో తేడా కొట్టి.. ఆ నంబర్ను బ్లాక్ చేశాడు.
పోలీసులను ఆశ్రయించిన ఉదయ్ రాజ్..
కాసేపటికే ఉదయ్ రాజ్ ఫోన్కు కాల్స్ మీద కాల్స్ రావడం మొదలైంది. ఉదయ్ రాజ్ వాటికి స్పందించలేదు. ఆ తర్వాత కొద్దిసేపటికే మరో కొత్త నంబర్ నుంచి అతని ఫోన్కు లైంగిక వేధింపుల ఫిర్యాదుకు సంబంధించిన కంప్లైంట్ కాపీ వచ్చింది. దీంతో ఉదయ్ రాజ్ నేరుగా పోలీసులను ఆశ్రయించాడు. జరిగిందంతా వారికి చెప్పాడు. ఉదయ్ రాజ్ సెల్ఫోన్కు వచ్చిన కాల్స్ ఆధారంగా పోలీసులు ఎట్టకేలకు నిందితుడిని పట్టుకున్నారు.
Recommended Video
ఎట్టకేలకు నిందితుడి అరెస్ట్..
ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ అయిన వల్లల్ రాజ్కుమార్ రీగన్ అనే వ్యక్తి ఇదంతా చేస్తున్నాడని పోలీసులు గుర్తించారు. అతన్ని అదుపులోకి తీసుకుని విచారించగా పలు విషయాలు వెల్లడించాడు. 2017 నుంచి తాను ఈ రకమైన మోసాలకు పాల్పడుతున్నానని,ఇప్పటివరకు 350 మంది పురుషుల నుంచి బలవంతంగా డబ్బులు వసూలు చేశానని చెప్పాడు. పోలీసులు అతనిపై సెక్షన్ 384,506ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అతని వలలో చిక్కుకుని చాలామంది మోసాలకు గురైనప్పటికీ.. పరువు పోతుందన్న భయంతో ఏ వ్యక్తీ ఇప్పటివరకు ఫిర్యాదు చేయలేదని పోలీసులు తెలిపారు.