ఒంటరిగానే ఎల్జేపీ పోటీ: 143 చోట్ల బరిలోకి, ఆయా చోట్ల పోటీకి దూరంగా బీజేపీ, నితీశ్పై గుర్రు..
బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ మిత్రపక్షం లోక్ జనశక్తి పార్టీ ఒంటరిగా బరిలోకి దిగుతోంది. గురువారం బీజేపీ చీఫ్ జేపీ నడ్డా, హోం మంత్రి అమిత్ షాతో ఎల్జేపీ నేత చిరాగ్ పాశ్వాన్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పొత్తులపై చర్చించారు. ఎన్డీఏతో జేడీయూ కూడా స్నేహహస్తం ఇవ్వడాన్ని ఎల్జేపీ జీర్ణించుకోలేకపోతోంది. ఈ క్రమంలో ఒంటరిగా పోటీ చేస్తామని ప్రకటించింది. బీహార్ అసెంబ్లీలో మొత్తం 243 సీట్లు ఉండగా.. ఎల్జేపీ మాత్రం 143 చోట్ల పోటీ చేయబోతుంది. కానీ ఈ చోట్ల బీజేపీ తమ అభ్యర్థులను రంగంలోకి దింపదు.
ఎల్జేపీ నినాదం ఇదే..
ఎన్నికల్లో ఎల్జేపీ కొత్త నినాదం అందుకుంది. తమకు మోడీ శత్రుత్వం లేదు.. కానీ జేడీయూతో మిత్రుత్వం లేదు అని ఎన్నికలకు వెళుతుంది. ఎన్నికల్లో బీజేపీ మెజార్టీ సీట్లు సాధిస్తే.. సీఎం అభ్యర్థిని ప్రతిపాదిస్తే మద్దతిస్తామని ఎల్జేపీ తెలిపినట్టు ‘ద హిందూ' రిపోర్ట్ చేసింది. దీంతో శనివారం ఎల్జేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం అవుతోంది. ఎన్నికలకు అనుసరించాల్సిన వ్యుహాంపై చర్చిస్తారు. అయితే ఎల్జేపీ బరిలోకి దింపే అభ్యర్థులు అందరూ జేడీయూకు వ్యతిరేకంగా ఉంటాయని సన్నిహిత వర్గాల ద్వారా తెలుస్తోంది.
కూటమిలో ఉంటూనే.. ఒంటరిగా బరిలోకి..
ఎన్డీఏ కూటమిలో ఎల్జేపీ భాగస్వామిగా ఉంటుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. తాము ఎప్పటికీ బీజేపీతో సఖ్యంగానే ఉంటామని తెలిపింది. కానీ స్థానికంగా ఉన్న సమస్యలతోనే జేడీయూతో పొసగడం లేదన్నారు. కూటమితో జేడీయూ కూడా సఖ్యంగా ఉండటంతో.. ఒంటరిగా పోటీ చేయడం తప్పడం లేదన్నారు. అయితే ఇందులో కూడా ఒక అంచనా ఉందని తెలుస్తోంది. నితీశ్ వ్యతిరేక ఓట్లు, మోడీ అనుకూల ఓట్లు తమకు వస్తాయని భావిస్తోంది. దీంతో ఓటు బ్యాంకు తమకు అనుకూలంగా మారుతుందని భావిస్తోంది.
Recommended Video
143 చోట్ల పోటీ..
సీట్లపై ఇదివరకే క్లారిటీ రాగా.. 143 మంది అభ్యర్థుల జాబితాను ఇప్పటికే సిద్దం చేశారు. బలమైన అభ్యర్థులను బరిలోకి దింపి.. మెజార్టీ సీట్లను సాధించాలనే ధీమాతో ఉంది. అయితే కరోనా వైరస్, వరదలు, ఉపాధి కల్పనపై ఎల్జేపీ ఫోకస్ చేసే అవకాశం ఉంది. అయితే బీహర్ ప్రగతి కోసం ప్రధాని మోడీ కృత నిశ్చయంతో ఉన్నారని.. అందుకే నిధులు విడుదల చేస్తున్నారని ఎల్జేపీ ప్రచారంలో చెప్పే అవకాశం ఉంది.