అయ్యో పాపం: ఏడు నెలలుగా జీతం చెల్లించని ప్రభుత్వం... కూలీగా మారిన క్లర్కు
బీహార్ : గత ఏడునెలలుగా జీతాలు చెల్లించకపోవడంతో క్లర్కుగా పనిచేసే ఓ వ్యక్తి కుటుంబ పోషణకోసం కూలీ బాట పట్టాడు. ఈ ఘటన బీహార్లోని బాబువా పట్టణంలో చోటుచేసుకుంది. బీహార్లోని కైమూర్ జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో అభయ్ కుమార్ అనే వ్యక్తి ఆస్పత్రిలోని బ్లడ్ బ్యాంకులో క్లర్క్గా పనిచేస్తున్నాడు. అయితే గత ఏడు నెలలుగా జీతాలు చెల్లించకపోవడంతో కుటుంబ పోషణ భారమైపోయింది. దీంతో అభయ్ సెలవు పెట్టి కూలీ పనికి వెళుతున్నాడు. దాంతో వచ్చే డబ్బులతో కుటుంబాన్ని నెట్టకొస్తున్నట్లు చెప్పాడు.
జీతాలు ఇవ్వాల్సిందిగా హాస్పిటల్ సివిల్ సర్జన్ దృష్టికి తీసుకొచ్చినట్లు చెప్పిన అభయ్.. అతన్నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో కనీసం కూలి పనిచేసుకునేందుకైనా సెలవు ఇవ్వాలని కోరుతూ లేఖ రాశాడు. బీహార్ ప్రభుత్వ ఆస్పత్రుల్లో భర్తీ చేయాల్సిన పోస్టులు చాలా ఉండగా... ప్రస్తుతం ఉన్న సిబ్బందికే జీతాలు చెల్లించలేని దుర్భర పరిస్థితుల్లో ఆ రాష్ట్ర వైద్యఆరోగ్యశాఖ ఉంది. ఈ ఏడాది జనవరి నుంచి తనకు జీతాలు అందడం లేదని లేఖలో పేర్కొన్న అభయ్ కుమార్... నిధులు విడుదల చేసినప్పటికీ జీతాలు చెల్లించడం లేదని చెప్పారు.
ఇక జీతాలు లేక తన ఇంటికి పాలు పోసేవాడు పాలు పోయడం మానేశాడని, రేషన్ తీసుకోలేదని, తినేందుకు కూరగాయలు లేవని చెప్పిన అభయ్... వారందరికీ డబ్బులు చెల్లించకపోవడంతో వాటన్నిటినీ నిలిపివేశారని ఆవేదన వ్యక్తం చేశాడు. మరోవైపు ఏడవ తరగతి చదువుతున్న తన కొడుకు ఐదవ తరగతి చదువుతున్న తన కూతురి స్కూలు ఫీజు కట్టకపోవడంతో ఆ స్కూలు యాజమాన్యం మెమోలు పంపుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. తను మానసికంగా చాలా కృంగిపోతున్నట్లు చెప్పిన అభయ్.. అధికారులు స్పందించి వెంటనే జీతాలు చెల్లించకపోతే తాను ఆత్మహత్య చేసుకుంటానని లేఖలో పేర్కొన్నాడు. లేఖను చదివిని పై అధికారులు నిధులు విడుదల కాగానే ఏడు నెలల జీతాలు చెల్లిస్తామని హామీ ఇచ్చారు.