ఈ నెల 17న కోర్టుకు హాజరు కానున్న సీఎం..!
Lok Sabha elections 2024: దేశంలో క్రమంగా సార్వత్రిక ఎన్నికల కోలాహలం నెలకొంటోంది. ఇంకో నెల- నెలన్నర రోజుల్లో లోక్సభ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడే అవకాశాలు ఉన్నాయి. మే చివరి వారం నాటికి కేంద్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు కావడం ఖాయంగా కనిపిస్తోంది.
ఈ ఎన్నికలను ప్రతిష్ఠాత్మంగా తీసుకుంటోన్నాయి అన్ని పార్టీలు. వరుసగా మూడోసారి అధికారంలోకి రావడానికి భారతీయ జనతా పార్టీ సారథ్యంలో ఎన్డీఏ.. ఈ సారి గద్దెనెక్కడానికి ప్రతిపక్షాల ఉమ్మడి కూటమి ఇండియా సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. దీనికి అనుగుణంగా వ్యూహ, ప్రతివ్యూహాలను రూపొందించుకుంటోన్నాయి.

ఈ ఎన్నికలను సమర్థవంతంగా ఎదుర్కొనడానికి ఆమ్ ఆద్మీ పార్టీ సన్నద్ధమౌతోంది. ఢిల్లీ, పంజాబ్లల్లో అధికారంలో ఉన్న ఆప్.. అత్యధిక లోక్సభ నియోజకవర్గాలను గెలుచుకోవడంపై దృష్టి సారించింది. ఆ దిశగా అవసరమైన చర్యలు తీసుకుంటోంది. ముమ్మర కసరత్తు మొదలుపెట్టింది.
ఎన్నికల వ్యూహాలపై కసరత్తు సాగిస్తోన్న వేళ.. ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ చుట్టూ ఉచ్చు బిగుసుకుంటోంది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు ఆయన చుట్టూ వల పన్నుతున్నారు. ఢిల్లీ మద్యం పాలసీ కుంభకోణంలో ఆయనను విచారించడానికి రంగం సిద్ధం చేశారు.
గతంలో ఇదే కేసు విషయంలో ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా అరెస్టయిన విషయం తెలిసిందే. ఏడాది దాటిపోయినప్పటికీ.. ఆయనకు బెయిల్ కూడా దొరకట్లేదు. అనారోగ్యంతో ఉన్న భార్యను పరామర్శించడానికి మానవతా దృక్పథంతో సిసోడియాకు పెరోల్ను జారీ చేసింది కోర్టు.

మద్యం పాలసీ స్కామ్లో విచారణకు హాజరు కావాలంటూ గతంలో పలుమార్లు ఈడీ అధికారులు అరవింద్ కేజ్రీవాల్కు సమన్లను జారీ చేశారు. అయినప్పటికీ.. ఆయన విచారణకు హాజరు కాలేదు. నోటీసులను అందుకున్నారే తప్ప విచారణకు వెళ్లట్లేదు. దీనిపై ఈడీ అధికారులు ఢిల్లీ రోజ్ అవెన్యూ కోర్టును ఆశ్రయించారు. విచారణకు కేజ్రీవాల్ సహకరించట్లేదని ఫిర్యాదు చేశారు.
దీనిపై స్పందించిన రోజ్ అవెన్యూ కోర్టు.. తాజాగా కేజ్రీవాల్కు సమన్లను జారీ చేసింది. ఈ నెల 17వ తేదీన విచారణకు హాజరు కావాలంటూ ఆదేశాలను జారీ చేసింది. ఈ మేరకు అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ జస్టిస్ దివ్య మల్హోత్ర.. కొద్దిసేపటి కిందటే ఈ సమన్లను జారీ చేశారు.












Click it and Unblock the Notifications