పెట్రోల్ ధరల ఎఫెక్ట్ మరి: ఎలక్ట్రిక్ స్కూటర్పై మమతా ప్రయాణం: మెడలో బోర్డు
కోల్కత: దేశంలో రోజురోజుకూ పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగిపోతోన్నాయి. వంటగ్యాస్ సిలిండర్ ధరలు రేట్లు వాటితో పోటీ పడుతోన్నాయి. 10 రోజుల వ్యవధిలో వంటగ్యాస్ సిలిండర్ ధరలో పెరుగుదల చోటు చేసుకుంది. 25 రూపాయల మేర పెరిగింది. ఈ ఒక్కనెలలోనే 100 రూపాయల మేర పెరిగింది వంటగ్యాస్ సిలిండర్ రేటు. పెట్రోల్, డీజిల్ రేట్లు తక్కువేమీ కాదు. కొన్ని రాష్ట్రాల్లో పెట్రోల్ ధర లీటర్ ఒక్కింటికి వంద రూపాయల మార్క్ను దాటుకుంది.
పెట్రోల్ రేటు రూ.100 దాటినా డోన్ట్ కేర్: మోడీ-షా జోడీకే గుజరాతీయుల జై: కాంగ్రెస్ డీలా
పైగా కేంద్ర ప్రభుత్వం కొత్తగా సెస్ను విధించడం వల్ల ఏప్రిల్ 1వ తేదీ నుంచి ఇంధన ధరలు మరింత పెరిగే ప్రమాదం లేకపోలేదనే ఆందోళనలు వ్యక్తమౌతోన్నాయి. పెట్రోలు, డీజిల్ ధరల పెరుగుదలను నిరసిస్తూ శుక్రవారం భారత్ బంద్కు పిలుపునిచ్చాయి. ఈ పరిణామాల మధ్య పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ..వినూత్నంగా నిరసన తెలుపుతున్నారు. ఎలక్ట్రిక్ స్కూటర్పై ఆమె చక్కర్లు కొట్టారు. నిరసనను తెలిపారు. అంతకుముందు ఆమె పెట్రోల్, డీజిల్పై రాష్ట్ర ప్రభుత్వం విధిస్తోన్న విలువ ఆధారిత పన్ను (వ్యాట్) ఒక రూపాయిని తగ్గించారు.
అనంతరం ఈ నిరసన ప్రదర్శనల్లో పాల్గొన్నారు. పెట్రోల్, డీజిల్ పెంపుదలను నిరసిస్తూ గురువారం కోల్కతలో తృణమూల్ కాంగ్రెస్ చేపట్టిన నిరసన ప్రదర్శన సందర్భంగా ఆమె ఎలక్ట్రిక్ స్కూటర్పై ప్రయాణిస్తోన్న ఈ దృశ్యం కనిపించింది. తాను నివసిస్తోన్న హరీష్ ఛటర్జీ మార్గ్ నుంచి సచివాలయం ఉన్న నిబానా వరకు ఆమె ఎలక్ట్రిక్ స్కూటర్పై ప్రయాణించారు. పార్టీ సీనియర్ నాయకుడొకరు ఈ-బైక్ను నడిపిస్తోండగా.. ఆమె వెనుక కూర్చున్నారు. ఈ సందర్భంగా ఆమె మెడలో ఓ బోర్డు కనిపించింది.
నరేంద్ర మోడీ ప్రభుత్వం దేశాన్ని లూటీ చేస్తోందని మమతా బెనర్జీ మండిపడ్డారు. పెట్రోల్, డీజిల్ మాత్రమే కాకుండా.. పేదవాడికి అందుబాటులో ఉండే కిరోసిన్ ధరలను కూడా ప్రభుత్వం పెంచిందని ఆరోపించారు. దేశాన్ని అమ్మకానికి పెట్టేశారని నిప్పులు చెరిగారు. బీఎస్ఎన్ఎల్, సెయిల్, ఆర్ఐఎన్ఎల్ (విశాఖ ఉక్కు కర్మాగారం), కోల్ ఇండియా, ఓఎన్జీసీ, ఎల్ఐసీ వంటి ప్రభుత్వ రంగ సంస్థలను నడిపించడం మోడీ సర్కార్కు చేతకావట్లేదని ధ్వజమెత్తారు. దేశాభివృద్ధి పేరుతో మోడీ-అమిత్ షా జోడీ అన్నింటినీ అమ్మేస్తోందని విమర్శించారు.