జగన్! ఏం చేస్తున్నావ్: సిఎం, కాంగ్రెస్పై అజిత్సింగ్ డౌట్
న్యూఢిల్లీ: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఢిల్లీకొచ్చి ఏం చేస్తున్నారో చెప్పాలని సీమాంధ్ర తెలుగుదేశం పార్టీ పార్లమెంటు సభ్యులు సిఎం రమేష్ బుధవారం అన్నారు. సీమాంధ్ర టిడిపి ఎంపిలు ఢిల్లీలో విలేకరులతో మాట్లాడారు. జగన్ ఢిల్లీకొచ్చి ఏం చేస్తున్నారో చెప్పాలన్నారు. ఆయన సీమాంధ్ర ద్రోహి అని మండిపడ్డారు. జగన్ ఢిల్లీలో విభజనకు అనుకూలంగా లాబీయింగ్ చేస్తున్నారని ఆరోపించారు.
విభజన త్వరగా జరగాలని జగన్ కోరుకుంటున్నారని విమర్శించారు. విభజన జరిగితే తమ పార్టీకి ఎక్కువ స్థానాలు వస్తాయని జాతీయ పార్టీ నాయకులకు వైయస్ జగన్ చెప్పడం లేదా అని ప్రశ్నించారు. విభజనలో కేంద్రం సంప్రదాయాలు పాటించడం లేదని కొణకళ్ల నారాయణ అన్నారు.
భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ ఓ భాగం కాదా అని సుజనా చౌదరి ప్రశ్నించారు. తెలంగాణ ముసాయిదా బిల్లును దొడ్డిదారిన ప్రవేశ పెట్టాలని కేంద్రం చూస్తోందని, తెలంగాణ ఏర్పాటులో విధివిధానాలు పాటించడం లేదని ఆరోపించారు. రాజ్యాంగ విధానాలు తుంగలో తొక్కారన్నారు. రాజకీయ లబ్ధి కోసమే విభజన చేస్తున్నారని తాము మొదటి నుండి చెబుతున్నామన్నారు.
తొలి గెలుపు: పయ్యావుల
తెలంగాణ ముసాయిదా బిల్లు రాజ్యసభకు రాకుండా తెలుగుదేశం పార్టీ తొలి విజయం సాధించిందని సీమాంధ్ర టిడిపి నేత పయ్యావుల కేశవ్ వేరుగా అన్నారు. ప్రధాన ప్రతిపక్షం భారతీయ జనతా పార్టీ కూడా విభజనలో సంప్రదాయాలు లేవని చెబుతోందని, బిల్లుకు ఆ పార్టీ మద్దతివ్వదని తాము ఆశిస్తున్నామన్నారు. రేపటి ఎపిఎన్జీవో బందుకు మద్దతిస్తున్నట్లు తెలిపారు.
బిల్లు ప్రవేశ పెడితే బంద్: అశోక్ బాబు
రేపు లోకసభలో తెలంగాణ ముసాయిదా బిల్లు ప్రవేశ పెడితే సీమాంధ్ర బందుకు పిలుపునిస్తున్నామని ఎపిఎన్జీవో అధ్యక్షులు అశోక్ బాబు అన్నారు. బిల్లు పెడితే సభను సభ్యులు స్తంభింప చేయాలని సూచించారు. కేంద్రం విభజన తీరుపై బిజెపి కూడా అభ్యంతరం వ్యక్తం చేస్తోందన్నారు.
రాహుల్ గాంధీని కలిసిన ఎపి జర్నలిస్టుల ఫోరం
ఏఐసిసి ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీని ఆంధ్రప్రదేశ్ జర్నలిస్టుల ఫోరం సంఘం కలిసింది. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేలా చూడాలని వారు కోరారు. అనంతరం వారు కేంద్రమంత్రి జైరామ్ రమేష్తో భేటీ అయ్యారు.
కాంగ్రెస్పై అజిత్ సింగ్ డౌట్
తెలంగాణ రాజకీయ ఐక్యకార్యాచరణ సమితి నాయకులు అజిత్ సింగ్ను కలిశారు. ఈ సమయంలో అజిత్ కాంగ్రెసు పార్టీ పైనే తన అనుమానాన్ని వ్యక్తం చేసినట్లుగా తెలుస్తోంది. బిల్లు పైన కాంగ్రెసు పార్టీనే తిరకాసు పెట్టేలా కనిపిస్తోందని ఆయన వ్యాఖ్యానించారు.
కిరణ్ రాజీనామా అవసరం లేదు: జగ్గారెడ్డి
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఇప్పుడు రాజీనామా చేయాల్సిన అవసరం లేదని ప్రభుత్వ విప్ జగ్గా రెడ్డి హైదరాబాదులో అన్నారు. పార్లమెంటులో విభజన అంశం తేలే వరకు రాజీనామా చేయాల్సిన అవసరం లేదన్నారు. పదవిలో ఉండి సమైక్యాంధ్ర కోసం ప్రయత్నాలు చేయాలన్నారు.
కిరణ్ కొత్త పార్టీపై గంటా
కిరణ్ కుమార్ రెడ్డి కొత్త పార్టీ పెడతారా లేదా అన్నది ముఖ్యం కాదని మంత్రి గంటా శ్రీనివాస రావు విశాఖలో అన్నారు. తాము అందరం సమైక్యాంధ్ర కోసం పోరాడుతున్నామని చెప్పారు.