సీఎంకు తప్పిన పెనుముప్పు: హెలికాప్టర్ ఎమర్జెన్సీ ల్యాండింగ్!..
హెలికాప్టర్ గాల్లోకి ఎగిరిని కొద్దిసేపటికే ఓ పక్షి ఎదురుగా వచ్చి విమానాన్ని ఢీకొట్టింది. వెంటనే అప్రమత్తమైన పైలట్ బెంగుళూరులోని హెచ్ఏఎల్ విమానశ్రయంలో ల్యాండ్ చేశారు.
బెంగుళూరు: కర్ణాటక సీఎం సిద్దరామయ్యకు పెనుముప్పు తప్పింది. ఆయన ప్రయాణిస్తున్న విమానాన్ని ఓ పక్షి ఢీకొనడంతో అత్యవసరంగా ల్యాండింగ్ చేయాల్సి వచ్చింది. హెలికాప్టర్ సురక్షితంగా ల్యాండ్ అవడంతో సీఎం సహా అంతా ఊపిరి పీల్చుకున్నారు.
శ్రావణబెళగలలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించేందుకు సిద్దరామయ్య ఈరోజు హెలికాప్టర్ ద్వారా పయనమయ్యారు. ఆయనతో పాటు హోంమంత్రి పరమేశ్వర, మరో ముగ్గురు అధికారులు వెళ్లారు. అయితే హెలికాప్టర్ గాల్లోకి ఎగిరిని కొద్దిసేపటికే ఓ పక్షి ఎదురుగా వచ్చి విమానాన్ని ఢీకొట్టింది.
వెంటనే అప్రమత్తమైన పైలట్ బెంగుళూరులోని హెచ్ఏఎల్ విమానశ్రయంలో ల్యాండ్ చేశారు. హెలికాప్టర్ ను పక్షి ఢీకొందని, అయితే దీనివల్ల ఎలాంటి ప్రమాదం చోటు చేసుకోలేదని పైలట్ చెప్పారు. కొద్దిపాటి అంతరాయం తర్వాత సీఎం సిద్దరామయ్య తిరిగి అదే విమానంలో శ్రావణబెళగలకు పయనమయ్యారు.