మలుపు తిరిగిన స్కాం: కోర్టుకెక్కిన సీఎం
Siddaramaiah: కర్ణాటకలో రాజకీయ ప్రకంపనలను సృష్టిస్తోన్న మైసూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (MUDA scam)లో చోటు చేసుకున్నట్లుగా భావిస్తోన్న భారీ కుంభకోణం వ్యవహారం మరో మలుపు తిరిగింది. ఈ అంశం ఇప్పుడు ఆ రాష్ట్ర హైకోర్టుకు చేరింది.
ముడా కుంభకోణంలో తన పాత్రపై విచారణ చేయాలంటూ గవర్నర్ థావర్ చంద్ గెహ్లాట్.. లోకాయుక్తకు ఇచ్చిన ఆదేశాలకు వ్యతిరేకంగా న్యాయపోరాటానికి దిగారు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య. గవర్నర్ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు.

కొద్దిరోజులుగా ముడా కుంభకోణం.. కర్ణాటకలో రోజూ వార్తల్లో ఉంటూ వస్తోన్న విషయం తెలిసిందే. ఇందులో సిద్ధరామయ్య ప్రమేయం ఉందని, ఆయనకు పెద్ద ఎత్తున ముడుపులు ముట్టాయంటూ ఆరోపణలు వెల్లువెత్తుతూ వస్తోన్నాయి. ప్లాట్ల కేటాయింపులో అవినీతికి పాల్పడ్డారనే విమర్శలను ఎదుర్కొంటోన్నారు.
దాదాపుగా 55 కోట్ల రూపాయలు విలువ చేసే ప్లాట్లను తన భార్య పార్వతి పేరు మీద బదలాయించినట్లు ప్రతిపక్ష భారతీయ జనతా పార్టీ నాయకులు ఆరోపిస్తోన్నారు. ఈ అంశంపై గతంలో ప్రతిపక్ష బీజేపీ- జనతాదళ్ (సెక్యులర్) నాయకులు పలుమార్లు ఆందోళనలు సైతం చేపట్టారు.
ఈ వ్యవహారంలో సిద్ధరామయ్యను విచారించాల్సిన అవసరం ఉందనే డిమాండ్ వినిపించింది. దీనికి అనుగుణంగా- టీజే అబ్రహం, ప్రదీప్, స్నేహమయి కృష్ణ.. రాజ్భవన్ను ఆశ్రయించారు. సిద్ధరామయ్యను విచారించడానికి అనుమతులు ఇవ్వాలంటూ దరఖాస్తును దాఖలు చేసుకున్నారు. ముడా స్కాంకు సంబంధించిన్న కొన్ని కీలక డాక్యుమెంట్లను వాటికి జత చేశారు.
దీనిపై జులై 26వ తేదీన గవర్నర్ థావర్చంద్ గెహ్లాట్.. సిద్ధరామయ్యకు షోకాజ్ నోటీసును జారీ చేశారు. దీనికి వారం రోజుల్లోగా సంతృప్తికరమైన వివరణలు, సమాధానాలను ఇవ్వాలంటటూ ఆదేశించారు. దీన్ని తప్పు పట్టింది కర్ణాటక ప్రభుత్వం. దీనికి స్పందించాల్సిన అవసరం లేదంటూ ఆగస్టు 1వ తేదీన ఓ ప్రకటన విడుదల చేసింది. సిద్ధరామయ్య నుంచి సంతృప్తికర వివరణ అందకపోవడంతో విచారణకు ఆదేశించారు గవర్నర్.
దీన్ని సవాల్ చేస్తూ ఆయన ఈ ఉదయం హైకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. తాను ఎలాంటి అవినీతికి పాల్పడలేదని వివరించారు. 40 సంవత్సరాల రాజకీయ జీవితంలో ఎలాంటి తప్పులూ చేయలేదని అన్నారు. తనను రాజకీయంగా వేధించడానికే ముడా కుంభకోణాన్ని తెరపైకి తెచ్చారని విమర్శించారు. ఇందులో నుంచి తనకు ఊరట లభిస్తుందని నమ్ముతున్నట్లు చెప్పారు.












Click it and Unblock the Notifications