ఇక వర్క్ ఫ్రం హోమే: కంపెనీల ఆలోచన.. ఇద్దరికీ మేలే
కరోనా వైరస్ తర్వాత పరిస్థితులు మారిపోయాయి, చాలా సంస్థలు ఉద్యోగులకు తప్పనిసరి పరిస్థితుల్లో 'ఇంటి నుంచి పని' చేసే వెసులుబాటు కల్పించారు. అదే విధానాన్ని శాశ్వతంగా కొనసాగించాలని 87 శాతం సంస్థలు యోచిస్తున్నాయని బీసీజీ, జూమ్ కలిసి నిర్వహించిన సర్వేలో తేలింది. కరోనా సమయంలో ఇప్పటి వరకు ఇంటి నుంచి పనిచేసే వారి సంఖ్య దాదాపు నాలుగు రెట్లు ఎక్కువైనట్లు సర్వే తేల్చింది.

కరోనా వల్ల ఏర్పడిన ప్రపంచ ఆర్థిక సంక్షోభ కాలంలో వర్క్ ఫ్రమ్ హోమ్ కారణంగా కంపెనీలపై పడిన ఆర్థిక ప్రభావం, పనితీరు గురించి అంచనా వేయడానికి బీసీజీతో కలిసి జూమ్ ఈ సర్వే నిర్వహించింది. భారత్ సహా అమెరికా, యూకే, జపాన్, ఫ్రాన్స్, జర్మనీ దేశాల్లో సర్వే నిర్వహించారు. మేనేజర్ స్థాయి ఉద్యోగుల్లో 70 శాతం మంది ఇంటి నుంచి పనికి అనుకూలంగా ఓటేశారు. చిన్న చిన్న సమస్యలు తప్ప, కరోనా మహమ్మారి ముందుకంటే ఇప్పుడు పనితీరు బాగా మెరుగైనట్లు సంస్థలు కూడా చెప్పడం గమనార్హం.
కరోనా సమయంలో వర్క్ ఫ్రమ్ హోమ్ కారణంగా కంపెనీలకు పెద్ద మొత్తంలో డబ్బు ఆదా అయినట్లు తెలిసింది. చాలా మంది ఉద్యోగాలు కూడా నిలబడ్డాయి. ఒక్క యూరప్లోనే వర్క్ ఫ్రమ్ హోమ్ కారణంగా 22.8 లక్షల ఉద్యోగాలు నిలిచినట్లు తెలిసింది. దీంతో కంపెనీలకు ఆదాయం, యువతకు ఉపాధి దొరికినట్టు అయ్యింది. మాంద్యం పేరుతో ఉద్యోగాలు తీసి వేసే పరిస్థితి లేకుండా పోయింది.












Click it and Unblock the Notifications