ఐటీ అధికారిణికి వార్నింగ్: తమిళనాడు మంత్రులపై కేసు: కొంప మునిగింది !
విజయభాస్కర్ ఇంటిలో ఐటీ దాడులు జరుగుతున్న సమయంలో మంత్రులు రాదాకృష్ణన్, కామరాజ్, ఢిల్లీలో తమిళనాడు ప్రభుత్వ ప్రతినిధి దళవాయి సుందరం ఒక మహిళా ఐటీ అధికారిణిని బెదిరించారని చెన్నై నగర పోలీసు కమిషనర్
చెన్నై: తమిళనాడు ఆరోగ్య శాఖా మంత్రి విజయభాస్కర్ ఇంట్లో ఆదాయపన్ను శాఖ అధికారులు దాడులు చేస్తున్న సమయంలో అధికారులను బెదిరించారని ఆరోపణలు ఎదుర్కోంటున్న ఇద్దరు మంత్రులపై చెన్నై నగర పోలీసు అధికారులు కేసు నమోదు చేశారని వెలుగు చూసింది.
మంత్రులపై నమోదు అయిన కేసు విచారణాధికారిగా చెన్నై నగర అదనపు పోలీసు కమిషనర్ శంకర్ ను నియమిస్తూ కమిషనర్ కరణ్ సిన్హా ఆదేశాలు జారీ చేశారు. ఆర్ కే నగర్ ఉప ఎన్నికల సందర్బంగా స్థానిక ఓటర్లను మభ్యపెట్టడానికి మంత్రి విజయభాస్కర్ ఇంటి నుంచి నేరుగా నగదు బట్వాడా సాగినట్లు ఎన్నికల కమిషన్ కు సమాచారం అందిన విషయం తెలిసిందే.
అధికార పార్టీ నేతలు లక్షంగా
అధికార పార్టీ నేతలు, వారి మద్దతుదారులే లక్షంగా ఈనెల 7వ తేదిన తమిళనాడు రాష్ట్రం నలుమూలలా ఐటీ శాఖ అధికారులు దాడులు చేశారు. ఆ సమయంలో కొందరు మంత్రులు విజయభాస్కర్ కు మద్దతుగా నిలిచారని ఆరోపణలు ఉన్నాయి.
మహిళా ఐటీ అధికారిణిని బెదిరించారని !
ఐటీ దాడులు జరుగుతున్న సమయంలో మంత్రులు రాదాకృష్ణన్, కామరాజ్, ఢిల్లీలో తమిళనాడు ప్రభుత్వ ప్రతినిధి దళవాయి సుందరం ఒక మహిళా ఐటీ అధికారిణిని బెదిరించారని చెన్నై నగర పోలీసు కమిషనర్ కు ఐటీ శాఖ అధికారులు ఫిర్యాదు చేశారు.
న్యాయనిపుణులతో సిటీ పోలీసు కమిషనర్
ఐటీ అధికారుల ఫిర్యాదుతో వెంటనే స్పందించిన చెన్నై నగర పోలీసు కమిషనర్ మంత్రులపై కేసు నమోదు చేసేందుకు న్యాయనిపుణులతో సంప్రదించారని తెలిసింది. న్యాయనిపుణులతో చర్చలు జరుపుతున్న సమయంలో మంత్రులపై వచ్చిన ఫిర్యాదును విచారణ జరిపేందుకు అదనపు పోలీసు కమిషనర్ శంకర్ నేతృత్వంలోని ప్రత్యేక బృందం ఏర్పాటు చేశారు.
మంత్రిగారికి మళ్లీ సమన్లు
ఐటీ అధికారులు మంత్రి విజయభాస్కర్ కు మళ్లీ సమన్లు పంపారు. ఈ సమన్లు ప్రకారం శుక్రవారం మంత్రి విజయభాస్కర్ విచారణకు మరో సారి ఆదాయపన్ను శాఖ అధికారుల ముందు హాజరుకావాల్సి ఉంది. అయితే వివిధ కారణాలు చూపిన మంత్రి విజయభాస్కర్ విచారణకు డుమ్మా కొట్టారు.
అనవసరంగా చిక్కుకున్నామా ?
మంత్రి విజయభాస్కర్ కు అండగా నిలిచి అనవసరంగా ఇబ్బందులు కొని తెచ్చుకున్నామా అంటూ మంత్రులు రాదాకృష్ణన్, కామరాజ్ తమ అనుచుల దగ్గర వాపోతున్నారని సమాచారం. అయితే ఇప్పటికే జరగరానిది జరిగిపోయిందని తెలుసుకుని అయోమయంలో పడిపోయారని తెలిసింది.
బహిరంగంగా మద్దతు ఇచ్చిన టీటీవీకి
తమిళనాడు ఆరోగ్య శాఖా మంత్రి విజయభాస్కర్ ఎలాంటి తప్పు చెయ్యలేదని, ఆయన మంత్రి పదవిలోనే కొనసాగుతారని బహిరంగంగా మీడియాకు చెప్పిన టీటీవీ దినకరన్ పరిస్థితి ఏమిటని శశికళ వర్గంలోని నాయకులు అంటున్నారు.
ఉచ్చుబిగుసుకుంటే
ఐటీ అధికారిణిని బెదిరించినట్లు వెలుగు చూస్తే ఆ ఇద్దరు మంత్రుల పదవి ఊడిపోవడంతో పాటు చట్టపరంగా కేసులు ఎదుర్కోవలసి వస్తోంది. అనవసరంగా ఐటీ అధికారులతో పెట్టుకుని లేనిపోని సమస్యలు తెచ్చుకున్నారని మంత్రులు రాదాకృష్ణన్, కామరాజ్ అనుచరులు వాపోతున్నారు.