ప్రభుత్వ ఉద్యోగాలు కావాలా?: ఐదేళ్లు మిలటరీ సర్వీస్ తప్పదు!
న్యూఢిల్లీ: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలు చేయాలని అనుకునేవారికి ఐదేళ్ల పాటు మిలిటరీ సర్వీస్ తప్పని సరి చేయాలని పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సిఫార్సు చేసింది. ఈ విషయంపై ప్రతిపాదనలు రూపొందింంచి కేంద్రానికి సమర్పించడానికి అవసరమైన చర్యలు ప్రధాని ఆధ్వరంలోని పర్సనల్, ట్రైనింగ్ డిపార్టుమెంటు చేపట్టాలని కూడా కోరింది.
ప్రభుత్వోద్యోగాలను కోరుకునేవారికి మిలిటరీ సర్వీసును తప్పనిసరి చేయడం వల్ల సాయుధ బలగాల్లోని సిబ్బంది కొరతను నివారించవచ్చునని కమిటీ అభిప్రాయపడింది. పర్సనల్, ట్రైనింగ్ డిపార్టుమెంట్ (డిఓపిటి) ప్రభుత్వ ఉద్యోగుల కోసం విధానాన్ని రూపొందించి, అమలు చేస్తుంది.
భారత సైన్యంలో 7 వేల మంది అధికారులు 20 వేల మంది సిబ్బంది కొరత ఉన్నట్లు రక్షణ మంత్రిత్వ శాఖ లెక్కలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఆ సిఫార్సు చేసింది.
భారత వైమానిక దళంలో 150 మంది అధికారులు, 15 వేల మంది సిబ్బంది కొరత ఉంది. భారత నావికా దళంలో 150 అధికారులు,, 15 వేల మంది సిబ్బంది కొరత ఉంది.
భారత ప్రభుత్వానికి సంబంధించి భారత రైల్వేలోనే 30 లక్షల మంది ఉద్యోగాలు ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వాల ఉద్యోగులు మరో రెండు కోట్ల మంది ఉంటారు.
సాయుధ బలగాల్లో ఏళ్ల తరబడిగా ఉన్న కొరతను, ప్రమాదకర పరిస్థితుల్లో ఎదురవుతున్న కొరతను నివారించడానికి ఈ చర్య పనికి వస్తుందనే అవగాహనతో పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఈ సిఫార్సు చేసినట్లు కనిపిస్తోంది.
అదే సమయంలో క్రమశిక్షణ గల అధికారులు, సిబ్బంది వల్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలసేవల్లో కూడా గుణాత్మకమైన మార్పు వస్తుందని భావిస్తున్నారు.
ఈ అతి ప్రధానమైన సిఫార్సు పట్ల రక్షణ మంత్రిత్వ శాఖ నిర్లక్ష్యం వహించడం పట్ల కమిటీ అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పుడు డివోపిటీని వేలెత్తి చూపుతున్నట్లు సమాచారం. నేరుగా జాతీయ భద్రతకు సంబంధించింది కావడంతో అధికారుల కొరత సమస్యను తీర్చడానికి ప్రాధాన్యం ఇవ్వాలని కమిటీ భావిస్తోంది.
పర్సనల్, ట్రైనింగ్ డిపార్టుమెంటులోని అత్యున్నత స్థాయి దృష్టికి ఈ విషయాన్ని తీసుకుని వెళ్లి డిమాండ్ను నెరవేర్చడానికి ఒప్పించడానికి రక్షణ మంత్రిత్వ శాఖ ప్రయత్నించాల్సి ఉంది.ఈ చర్చల ఫలితాలను తమకు రక్ణణ మంత్రిత్వ శాఖ తెలియజేయాలని కమిటీ కోరుకుంటోంది.