లాక్డౌన్ పొడిగింపు: ప్రధాని మోడీని కలిసిన నిర్మలా సీతారామన్, కీలక చర్చలు
న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి కట్టడి కోసం దేశ వ్యాప్తంగా లాక్డౌన్ను మరోసారి పొడిగించిన నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గురువారం సాయంత్రం కలిశారు. ఈ సందర్భంగా భారత ఆర్థిక వ్యవస్థపై కరోనా ప్రభావాన్ని ప్రధాని మోడీ సమీక్షించారు.
సూక్ష్మ, మధ్య తరహా పరిశ్రమలు, విమానయాన రంగం, నిరుద్యోగం గురించి మంత్రి నిర్మలా సీతారామన్తో ప్రధాని మోడీ చర్చించినట్లు తెలిసింది. కాగా, కరోనా కారణంగా దెబ్బతిన్న రంగాల కోసం రెండో ఉద్దీపన పథకం ప్రకటించే అవకాశముందని వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో ఆర్థిక మంత్రి, ప్రధాని భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది.
లాక్డౌన్ కారణంగా ఇబ్బంది పడుతున్న పేదలు, మధ్య తరగతి వారి కోసం కేంద్ర ప్రభుత్వం ఇంతకుముందు రూ. 1.7 లక్షల కోట్లతో ఉద్ధీపన పథకాన్ని ప్రకటించింది. బియ్యం, పప్పులు, నగదు పంపిణీ చేసిన విషయం తెలిసిందే.
కాగా, కరోనా వైరస్ వ్యాప్తిని కట్టడి చేసేందుకు దేశ వ్యాప్తంగా ప్రధాని నరేంద్ర మోడీ లాక్డౌన్ను మే 3 వరకు పొడిగించిన విషయం తెలిసిందే. దాదాపు గత నెలరోజులుగా దేశ వ్యాప్తంగా అన్ని పరిశ్రమలు, సంస్థల కార్యకలాపాలు, రవాణా వ్యవస్థ స్తంభించిపోవడంతో ఆర్థికంగా భారీ నష్టం వాటిల్లిన విషయం తెలిసిందే.
భారత జీడీపీ వృద్ధి అంచనాలను కూడా ప్రముఖ సంస్థలు తగ్గించాయి. భారత ఆర్థిక వ్యవస్థ 1.5శాతం నుంచి 2.8శాతం వృద్ధి మాత్రమే నమోదు చేస్తుందని ప్రపంచ బ్యాంక్ ఇప్పటికే అంచనా వేసింది. ఇక ఐఎంఫ్ అయితే 2020లో భారత జీడీపీ వృద్ధి 1.9 శాతమే ఉండొచ్చని తెలిపింది. కాగా, ఆర్థిక వ్యవస్థను తిరిగి గాడిన పెట్టేందుకు, మళ్లీ వృద్ధిలోకి తీసుకొచ్చేందుకు ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి అతాను చక్రవర్తి నేతృత్వంలో ప్రభుత్వ ఒక సాధికార కమిటీని ఏర్పాటు చేసింది.