లోక్సభ బరిలో రంగీలా బ్యూటీ
ముంబై : రంగీలా బ్యూటీ ఊర్మిళ మతోంద్కర్ లోక్సభ ఎన్నికల్లో పోటీకి సిద్ధమయ్యారు. ముంబై నార్త్ నియోజకవర్గం నుంచి బరిలో దిగనున్నారు. కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ ఆమె అభ్యర్థిత్వాన్ని ఓకే చెప్పడంతో పార్టీ అధిష్టానం ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది. ముంబై నార్త్ సిట్టింగ్ ఎంపీ గోపాల్ శెట్టితో ఆమె తలపడనున్నారు. ఊర్మిళ ఎంట్రీతో ముంబై నార్త్లో ఎన్నికల పోరు రసవత్తరంగా మారింది.
ప్రధాని మోడీ మద్దతుదారులపై ఈసీకి ఫిర్యాదు చేసిన నటి రమ్యా, ఫ్రీ గిఫ్ట్ లు, సోషల్ మీడియా
ముంబై నార్త్ నియోజకవర్గంపై బీజేపీకి గట్టి పట్టుంది.1989 నుంచి 2004 వరకు బీజేపీ నేత రామ్ నాయక్ ఎంపీగా ఎన్నికయ్యారు. 2004 సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి, బాలీవుడ్ హీరో గోవిందా రామ్ నాయక్ను ఓడించారు. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లోనూ కాంగ్రెస్ అభ్యర్థి సంజయ్ నిరుపమ్ విజయం సాధించారు. పదేళ్ల తర్వాత బీజేపీ మళ్లీ ఆ స్థానంలో పాగా వేయగలిగింది. 2014 సార్వత్రిక ఎన్నికల్లో సంజయ్ నిరుపమ్పై బీజేపీ నేత గోపాల్ శెట్టి ఘన విజయం సాధించడంతో ముంబై నార్త్ మళ్లీ బీజేపీ ఖాతాలో పడింది. ఈ నేపథ్యంలో ముంబై నార్త్ను తిరిగి చేజిక్కించుకోవాలని భావిస్తున్న కాంగ్రెస్.. ఊర్మిళను బరిలో దింపాలని నిర్ణయించింది.