కర్ణాటక కేబినెట్పై జగన్ మార్క్ డెసిషన్
బెంగళూరు: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయాన్ని సాధించింది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన పూర్తి మెజారిటీని అందుకుంది. 135 స్థానాల్లో విజయఢంకా మోగించింది. 43 శాతానికి పైగా ఓట్ల షేర్ను సాధించింది కాంగ్రెస్. 1989 తరువాత ఈ స్థాయి ఓట్ షేర్ను కాంగ్రెస్ అందుకోవడం ఇదే తొలిసారి.
కొత్త నాయకుడిని ఎన్నుకోవడానికి ఇవ్వాళ కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ సమావేశం కానుంది. ఈ సాయంత్రం 5:30 గంటలకు అసెంబ్లీ ఆవరణలో ఈ భేటీ ఏర్పాటయింది. కాంగ్రెస్ పార్టీ ఘన విజయానికి ప్రధాన కారకులైన డీకే శివకుమార్, ప్రతిపక్ష నాయకుడు సిద్ధరామయ్యల్లో ఒకరిని ముఖ్యమంత్రి పదవి వరిస్తుందనే అంచనాలు వెలువడుతున్నాయి. ఏఐసీసీ అధినేత మల్లికార్జున ఖర్గే, సీనియర్ నేత రణ్దీప్ సింగ్ సుర్జేవాలా దీనికి హాజరు కానున్నారు.

అదే సమయంలో- మంత్రివర్గంలో అయిదుమంది ఉప ముఖ్యమంత్రులను తీసుకోవచ్చనే ప్రచారం కర్ణాటక రాజకీయాల్లో జోరుగా సాగుతోంది. ప్రస్తుతం ఈ తరహా వ్యవస్థ ఏపీలో ఉంది. ఏపీలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలో అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో అయిదుమంది ఉప ముఖ్యమంత్రులు కొనసాగుతున్న విషయం తెలిసిందే.
ఇదివరకు బసవరాజ్ బొమ్మై సారథ్యంలోని బీజేపీ ప్రభుత్వంలో కూడా ముగ్గురు ఉప ముఖ్యమంత్రులుగా పని చేశారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం దీన్ని మరింత విస్తరించడం ఖాయంగా కనిపిస్తోంది. ఏపీ తరహాలో అయిదుమంది ఉప ముఖ్యమంత్రులను మంత్రివర్గంలోకి తీసుకోవడానికి కసరత్తు సాగిస్తోంది. అన్ని సామాజిక వర్గాలకు సీనియర్ నేతలకు డిప్యూటీ సీఎం పదవులను కేటాయిస్తుందని అంటున్నారు.

ఈ ఎన్నికల్లో పార్టీకి అండగా ఉన్న ఆయా సామాజిక వర్గాల ఓటుబ్యాంక్కు మంత్రివర్గంలో సమాన ప్రాతినిథ్యాన్ని కల్పించాలనే ఉద్దేశంతో అయిదుమందికి ఉప ముఖ్యమంత్రులుగా నియమిస్తుందని చెబుతున్నారు. వక్కలిగ, లింగాయత్, దళితులు, గిరిజనులు, ముస్లిం సామాజిక వర్గాల సీనియర్ నాయకులకు డిప్యూటీ సీఎం పదవిని వరించే అవకాశం ఉంది. దళిత కోటాలో డాక్టర్ జీ పరమేశ్వరను తీసుకోవడం ఖాయమని తెలుస్తోంది.












Click it and Unblock the Notifications