కార్యకర్త చెంప పగులగొట్టిన సిద్ధు
బెంగళూరు: కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికల గడువు సమీపిస్తోంది. ఏప్రిల్ మొదటివారంలో ఎన్నికల నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉంది. మే 12వ తేదీన పోలింగ్ జరగొచ్చనే అంచనాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ప్రధాన పార్టీలన్నీ తమ ప్రచార కార్యక్రమాలను విస్తృతం చేస్తోన్నాయి. జిల్లాల్లో పర్యటిస్తోన్నాయి. అధికార భారతీయ జనతా పార్టీ, ప్రతిపక్ష కాంగ్రెస్, జనతాదళ్ (సెక్యులర్).. సీనియర్ నేతలు రాష్ట్రవ్యాప్తంగా సుడిగాలి పర్యటనలను నిర్వహిస్తోన్నారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇటీవలే కర్ణాటకలో పర్యటించారు. రెండువారాల వ్యవధిలో రెండుసార్లు వేర్వేరు జిల్లాలను సందర్శించారాయన. అదే బాటలో అఖిల భారత కాంగ్రెస్ కమిటీ మాజీ అధినేత రాహుల్ గాంధీ కర్ణాటకలో పర్యటించారు. బెళగావిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగించారు. ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గె సొంత రాష్ట్రం కావడం వల్ల ఈ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది కాంగ్రెస్. ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు డీకే శివకుమార్, ప్రతిపక్ష నాయకుడు సిద్ధరామయ్య.. ప్రచార కార్యక్రమాలను మరింత ముమ్మం చేస్తోన్నారు. తమ వ్యూహాల పదును పెడుతున్నారు.

ఇప్పటికే- తాము అధికారంలోకి వస్తే యువ నిధి పేరుతో కొత్త పథకాన్ని ప్రవేశపెడతామని ప్రకటించారు రాహుల్ గాంధీ. ఈ పథకం కింద నిరుద్యోగ యువకులకు ప్రతినెలా 3,000 రూపాయలు, డిప్లొమా గ్రాడ్యుయేట్ నిరుద్యోగులకు 1,500 రూపాయల ఆర్థిక సహాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఇదివరకే మూడు ప్రధానమైన హామీలు ఇచ్చింది కాంగ్రెస్. గృహజ్యోతి కింద గృహావసర విద్యుత్ వినియోగంలో ప్రతి ఇంటికీ 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ సరఫరా, గృహ లక్ష్మి పథకం కింద ప్రతి మహిళకూ ప్రతినెలా 2,000 రూపాయల చొప్పున నగదు బదిలీ, అన్న భాగ్య పథకంలో భాగంగా బీపీఎల్ కుటుంబంలోని ప్రతి మహిళకు 10 కేజీల బియ్యం ఉచితంగా అందిస్తామని తెలిపింది.

కాంగ్రెస్ లో చేరికల జోరు కూడా మొదలైంది. బీజేపీకి చెందిన పలువురు కొందరు సీనియర్ నాయకులు కాంగ్రెస్ లో చేరుతున్నారు. కళ్యాణ కర్ణాటకకు చెందిన బీజేపీ సీనియర్ నాయకుడు, ఎమ్మెల్సీ బాబూరావు చించనాసుర.. కాంగ్రెస్ లో చేరారు. తాజాగా కల్యాణ కర్ణాటక రీజియన్ కే చెందిన రెడ్డి లింగాయత్ సామాజిక వర్గానికి చెందిన బీజేపీ నాయకుడు మలకారెడ్డి.. పీసీసీ చీఫ్ డీకే శివకుమార్ తో భేటీ అయ్యారు.
#WATCH | LoP and former Karnataka CM Siddaramaiah slaps a supporter who came to meet him at his residence in Bengaluru earlier today. The supporter had come to him amid a huge crowd of visitors there. pic.twitter.com/968Ba1t9DB
— ANI (@ANI) March 24, 2023
మరోవంక- కాంగ్రెస్ సీనియర్ నాయకుల నివాసానికి అభిమానులు, కార్యకర్తల తాకిడి అధికమైంది. బెంగళూరులోని సిద్ధరామయ్య, డీకే శివకుమార్ నివాసాలతో పాటు కాంగ్రెస్ ప్రధాన కార్యాలయం మద్దతుదారులతో సందడిగా మారింది. వివిధ జిల్లాల నుంచి వచ్చిన కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున వారి నివాసానికి చేరుకుంటోన్నారు. ఇది కాస్తా సీనియర్ నేతల్లో అసహనానికి కూడా దారి తీస్తోంది. ఇవ్వాళ బెంగళూరులోని సిద్ధరామయ్య ఇంటికి భారీగా తరలివచ్చిన కార్యకర్తలు. వారిని పోలీసులు అదుపు చేయలేకపోయారు. దీనితో స్వల్పంగా తోపులాట చోటు చేసుకుంది. దీనితో సిద్ధరామయ్య అసహనానికి గురయ్యారు. ఓ కార్యకర్త చెంప పగులగొట్టారు. దీనికి సంబంధించిన వీడియో క్లిప్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.












Click it and Unblock the Notifications