సదానంద ఇంటి నేమ్ప్లేట్ తీసేసి, కాళ్లతో తొక్కారు
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలోని రైల్వే మంత్రి సదానంద గౌడ ఇంటిపై కాంగ్రెసు కార్యకర్తలు దాడి చేశారు. లోకసభలో ఆయన మంగళవారం రైల్వే బడ్జెట్ను ప్రవేశపెట్టిన తర్వాత ఈ సంఘటన చోటు చేసుకుంది. ఆయన నేమ్ప్లేట్ తొలగించి, కింద పడేసి కాళ్లతో తొక్కారు. ఇంట్లోకి రాకుండా మంత్రి కారును అడ్డుకున్నారు.
బడ్జెట్లో ఎఫ్డిఐలు, ప్రైవైట్ భాగస్వామ్యం ప్రస్తావనలతో రైల్వేలను ధనికులకు అనుకూలంగా మారుస్తున్నారని కాంగ్రెసు ఆరోపిస్తోంది. కాంగ్రెసు కార్యకర్తల దాడిని పరిణతి లేని ప్రతిపక్ష చర్యగా కేంద్ర మంత్రి పియూష్ గోయల్ వ్యాఖ్యానించారు.
శాంతియుతంగా నిరసన తెలియజేయాలని, రైల్వే మంత్రి నేమ్ప్లేట్ తొలగించడం, కారును అడ్డుకోవడం సరి కాదని కాంగ్రెసు సీనియర్ నేత అర్విందర్ సింగ్ లవ్లీ ఆ తర్వాత అన్నారు.
కాగా, సదానంద ప్రతిపాదించిన రైల్వే బడ్జెట్పై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పెదవి విరిచారు. తమ రాష్ట్రానికి మొండి చేయి చూపారని ఆమె విమర్సించారు. కొత్త ప్రభుత్వం ప్రతిపాదించిన రైల్వే బడ్జెట్లో తమ రాష్ట్రానికి కేటాయించింది ఏమీ లేదని ఆమె అన్నారు.