అమర్ జ్యోతి విలీనంతో విదేశాల్లో పరువుపోయింది-రాజ్యసభలో కాంగ్రెస్ ఎంపీ ఆనంద్ శర్మ
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ఇవాళ ఉభయసభల్లో చర్చ జరుగుతోంది. ఇందులో రాజ్యసభలో జరుగుతున్న చర్చలో కాంగ్రెస్ ఎంపీ ఆనంద్ శర్మ ఎన్డీయే సర్కార్ అమర్ జ్యోతి విలీనంపై తీసుకున్న నిర్ణయాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. ఎన్డీయే సర్కార్ జాతీయ వాదాన్ని ఆయన సూటిగా ప్రశ్నించారు.
నాడు బంగ్లాదేశ్ యుద్ధంలో అమరులైన సైనికులకు అమర్ జవాన్ జ్యోతి అంకితం చేశారని, కానీ దాన్ని ఇప్పుడు ఎన్డీయే సర్కార్ అమర వీరుల స్ధూపంలో విలీనం చేసిందని రాజ్యసభలో కాంగ్రెస్ ఎంపీ ఆనంద్ శర్మ విమర్శించారు. తానూ హిందువునే అని మంటను విలీనం చేయలేమని తనకూ తెలుసని ఎన్డీయ సర్కార్ కు ఆయన చురకలు అంటించారు. ఇండియా గేట్ వలస వారసత్వం అని చెప్పారని, కానీ దీనిపై ఉన్న సైనికులు కిరాయి సైనికులు కాదని ఆనంద్ శర్మ గుర్తుచేశారు.
ఎన్డీయే సర్కార్ చర్యలు ద్వేషపూరిత ప్రసంగాన్ని గుర్తు చేస్తున్నాయని కాంగ్రెస్ ఎంపీ ఆనంద్ శర్మ ఆరోపించారు. ప్రస్తుతం ప్రపంచ దేశాలు పరస్పరం అనుసంధానమై ఉన్నాయని, భారత్ వంటి దేశాల్లో ఇలాంటి చర్యలు జరగొచ్చా అని ప్రపంచ దేశాల్ని మనల్ని ప్రశ్నిస్తున్నాయని ఆనంద్ శర్మ రాజ్యసభలో ఎన్డీయే సర్కార్ కు తెలిపారు. ఈ దేశం అందరిదన్నారు.భారతీయ సంతతి ప్రజలు ప్రతిచోటా ఉన్నారని, కమలా హారిస్, ప్రీతి పటేల్, రిషి సునక్, సుందర్ పిచాయ్ లను ఆనంద్ శర్మ గుర్తుచేశారు. కేంద్రం తీసుకుంటున్న నిర్ణయాలను చూసి వారు ఏమనుకుంటారని ఆనంద్ శర్మ ప్రశ్నించారు.
నిన్న దేశం దివంగత లతా మంగేష్కర్ కు నివాళులర్పించిందని, తాను కూడా ఆమె పాట విన్నామంటూ ఏ మేరే వతన్ కే లోగోన్ పాటను ఆనంద్ శర్మ గుర్తుచేసుకున్నారు. .దేశ ప్రతిష్టను దెబ్బతీయవద్దని కేంద్రానికి సూచించారు. ఈ దేశం అందరికీ చెందుతుందని, మనమంతా కలిసి ముందుకు సాగాలని ఆయన కోరారు. యువకుల మనసుల్లో విద్వేష గీతలు గీయొద్దన్నారు. అది దేశ మనస్సాక్షిని దెబ్బతీస్తుందన్నారు.