సీఎంగా కుమారస్వామి ది బెస్ట్.. కన్నడిగుల తీర్పిదే సుమీ! సీఎం సిద్దూకు మూడో స్థానం
Recommended Video
బెంగళూరు: మార్చి, ఏప్రిల్ నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న కర్ణాటకలో రాజకీయం ఇప్పుడిప్పుడే వేడెక్కుతున్నది. అధికార కాంగ్రెస్, ప్రధాన ప్రతిపక్ష బీజేపీ మధ్య నువ్వా? నేనా? అన్నట్లు వాగ్భాణాలు సంధించుకుంటున్నాయి. మరోసారి మెజారిటీ సామాజిక వర్గంగా ఉన్న హిందువులను ఆకట్టుకునే లక్ష్యంతో ఇరుపక్షాలు భావోద్వేగపూరిత వ్యాఖ్యలకు దిగుతున్న వేళ.. అధికార కాంగ్రెస్ పార్టీ మూడో పక్షం 'సీహెచ్ఎస్' ఆధ్వర్యంలో నిర్వహించిన సర్వే రాజకీయ పండితులనే అచ్చెరువొందిస్తున్నది. ఒకనాడు కన్నడ నేలపై మాజీ ప్రధాని హెచ్ డీ దేవెగౌడ సారథ్యంలో కీలక భూమిక పోషించిన సెక్యులర్ జనతాదళ్ నాయకుడు, మాజీ సీఎం హెచ్ డీ కుమారస్వామినే తమ సీఎం అభ్యర్థిగా ఎక్కువగా ఎంచుకుంటున్నారని తేలింది.
జనతాదళ్ (ఎస్) 65 సీట్లు గెలిచే చాన్స్
ఇక తదుపరి సీఎం తానేనని అంచనాల్లో ఉన్న మాజీ సీఎం - బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడు బీఎస్ యెడ్యూరప్ప స్థానంలో ఉన్నారు. సరైన సీఎం అభ్యర్థిగా తదుపరి దశలో ప్రస్తుత సీఎం సిద్దరామయ్యకు కన్నడిగులు మూడో ప్రాథాన్యం ఇస్తున్నారు. ఇక జనతాదళ్ (ఎస్) 65 సీట్లు గెలుచుకుంటుందని సర్వే అంచనా వేసింది.
50కి లోపే కాంగ్రెస్ పార్టీ పరిస్థితి.. 80 స్థానాల్లో బీజేపీ గెలుపు?
అధికార కాంగ్రెస్ పార్టీ 2013తో పోలిస్తే పలు సీట్లు కోల్పోయి 40 - 50 సీట్లకు మాత్రమే పరిమితం అవుతుందని తెలుస్తున్నది. కాకపోతే ఎన్నికలకు ముందే సీఎం అభ్యర్థిగా దళిత నేతను ప్రకటిస్తే కాంగ్రెస్ పార్టీకి గణనీయ స్థాయిలో ఓట్లు తెచ్చి పెడతాయని నిర్ధారణ అయ్యింది. ఇక కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయం అని భావిస్తున్న బీజేపీ 73 నుంచి 76 అసెంబ్లీ స్థానాల్లో విజయం లభిస్తుందని సర్వే తేల్చిన సారాంశం.
సర్వే నిజమైతే కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీకి నైతికంగా దెబ్బే
గమ్మత్తేమిటంటే గతనెలలో రాష్ట్రమంతటా పరివర్తన యాత్ర పేరిట సీఎం సిద్దరామయ్య పర్యటిస్తున్న సమయంలోనే ఈ సర్వే సాగడం ఆసక్తికర అంశం. సర్వేపై కాంగ్రెస్ ప్రదేశ్ కమిటీ అధ్యక్షుడు డాక్టర్ జీ పరమేశ్వర్ స్పందిస్తూ ఇది తమ పార్టీ ముగింపునకు మార్గం సుముఖం చేస్తున్నదన్నారు. ఇక రెండు జాతీయ పార్టీల కంటే ఒక ప్రాంతీయ పార్టీ నాయకుడికి ప్రాధాన్యం లభించడం పరిస్థితుల్లో మార్పును తెలియ జేస్తున్నది. సర్వే సారాంశం కాంగ్రెస్ పార్టీకి సత్ఫలితాన్ని ఇవ్వలేదని జేడీఎస్ సీనియర్ నేత హెచ్ డీ కుమారస్వామి వ్యాఖ్యానించారు. ఇక సిద్దరామయ్య సారథ్యంలోని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ పనితీరుపై తీవ్రమైన ప్రజా వ్యతిరేకత వెల్లువెత్తుతున్నదని సర్వే తేల్చి చెప్పింది. ఒకవేళ సర్వే నిజమైతే కాంగ్రెస్ పార్టీ తీవ్ర పరాజయంతోపాటు నైతికంగా దెబ్బతినే పరిస్థితి ఉంటుందని రాజకీయ విమర్శకులు అభిప్రాయ పడుతున్నారు.
ఉపాధి కల్పించనందుకు సర్కార్పై యువతలో వ్యతిరేకత
సీఎం సిద్దరామయ్య ఆహంకారం కూడా కాంగ్రెస్ పార్టీ పరిస్థితి మరింత దిగజారడానికి కారణమన్న విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. సిద్దరామయ్య ప్రభుత్వం అమలుచేస్తున్న ‘భాగ్య' సిరీస్ పథకాలకు ప్రజల నుంచి సానుకూల స్పందన లభిస్తున్నా, ఉపాధి కల్పించడంలో పూర్తిగా విఫలమైందన్న అభిప్రాయం ఉన్నదని కేపీసీసీ అధ్యక్షుడు డాక్టర్ జీ పరమేశ్వర.. కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానానికి సమర్పించిన నివేదికలో పేర్కొన్నట్లు తెలుస్తున్నది. ఉద్యోగావకాశాలు కల్పించడంలో విఫలం అయినందుకు ప్రభుత్వంపై యువకులు వ్యతిరేకంగా ఉన్నారని కేపీసీసీ చీఫ్ పరమేశ్వర స్పష్టం చేశారు.
కాంగ్రెస్ పార్టీకి ఇలా గట్టి ఎదురు దెబ్బ తగులుతుందన్న అంచనా
అంతేకాదు కావేరి, మహాదాయి నదుల వివాదాలను రాష్ట్ర ప్రయోజనాలకు అనుగుణంగా పరిష్కరించడంలో ప్రభుత్వం నిస్సహాయంగా నిలిచిపోయిందని సర్వే హెచ్చరించింది. ఇది కూడా అధికార కాంగ్రెస్ పార్టీకి గట్టి ఎదురు దెబ్బ అని భావిస్తున్నారు. ‘సీహెచ్ఎస్' సర్వే మరో విషయం గుర్తు చేసింది. 2013 ఎన్నికల్లో మాదిరిగా సిద్దరామయ్య ‘అహిందా' విధానాలు కూడా కాంగ్రెస్ పార్టీని విజయ తీరాలకు చేర్చబోదని తేల్చేసింది.