భారత్ లో 2 లక్షలకు చేరువగా కరోనా యాక్టివ్ కేసులు.. పండుగ ఎఫెక్ట్, తగ్గిన పరీక్షలు; తాజా లెక్కలివే !!
భారతదేశంలో కరోనావైరస్ మహమ్మారి యొక్క యాక్టివ్ కేసులు తాజాగా 2,00,000 మార్క్ కు చేరుకుంటున్నాయి. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం, యాక్టివ్ కేసుల సంఖ్య శనివారం 201,632 గా ఉంది, ఇది 217 రోజుల్లో అత్యల్పంగా ఉందని తెలుస్తుంది. గత 24 గంటల్లో యాక్టివ్ కోవిడ్ -19 కేసుల సంఖ్యలో 2,046 కేసుల తగ్గుదల నమోదైంది.
భారత్ లో మళ్ళీ పెరిగిన కరోనా కేసులు: తాజాగా 18,987 కొత్త కేసులు; 246 మరణాలు!!
భారతదేశంలో గత 24 గంటల్లో 15,981 కొత్త కరోనావైరస్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కోవిడ్ -19 కేసుల సంఖ్య 34,053,573 కి చేరుకుంది. గత 24 గంటల్లో 166 తాజా మరణాలు నమోదయ్యాయి. దీంతో కరోనా కారణంగా మరణించిన వారి సంఖ్య 451,980 కి చేరుకుంది. మరణాల రేటు 1.33 శాతంగా నమోదైంది.యాక్టివ్ కేసులు మొత్తం ఇన్ఫెక్షన్లలో 0.59 శాతం ఉన్నాయి. మార్చి 2020 తర్వాత అతి తక్కువగా నమోదవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. జాతీయ కోవిడ్ -19 రికవరీ రేటు 98.07 శాతంగా నమోదైంది. ఇప్పటివరకు కరోనా మహమ్మారి నుండి కోలుకున్న వారి సంఖ్య 333,99,961 కి పెరిగింది.
శుక్రవారం నాటికి 9,23,003 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించబడ్డాయి. దేశంలో కోవిడ్ -19 ను గుర్తించడానికి ఇప్పటివరకు నిర్వహించిన మొత్తం 58,98,35,258 కరోనా నిర్ధారణ పరీక్షలను నిర్వహించినట్లు తెలుస్తోంది. శుక్రవారం దసరా పండుగ కావడంతో, చాలామంది కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకోలేదని తెలుస్తుంది. ఈ క్రమంలోనే కరోనా కేసుల సంఖ్య తగ్గినట్లుగా కనిపిస్తుంది. దసరా పండుగ కారణంగా సెలవు రోజు కావడంతో నిన్న వ్యాక్సిన్ కార్యక్రమం కూడా చాలా తక్కువగా నమోదయింది.
నిన్న దేశవ్యాప్తంగా 8.36 లక్షల మందికి మాత్రమే కరోనా వ్యాక్సినేషన్ నిర్వహించినట్లు తెలుస్తోంది. దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు మొత్తం పంపిణీ అయిన వ్యాక్సిన్ డోసుల సంఖ్య 97,23,77,045 అని చెప్పొచ్చు. గత 24 గంటల్లో కేరళ రాష్ట్రంలో 8,867 కొత్త కేసులు నమోదు కాగా, 67 మంది కరోనా మహమ్మారి కారణంగా మరణించారు. కరోనా కారణంగా తీవ్రంగా దెబ్బతిన్న మహారాష్ట్రలో గత 24 గంటల్లో 2149 కొత్త కేసులు నమోదు కాగా 29 మంది మృత్యువాత పడ్డారు. రోజువారీ కేసుల్లో అత్యధిక కేసులు నమోదు చేస్తున్న తమిళనాడు రాష్ట్రంలో గత 24 గంటల్లో 1245 కొత్త కేసులు నమోదు కాగా 16 మంది మరణించారు.
అత్యధిక కేసులను నమోదు చేస్తున్న ఈశాన్య రాష్ట్రమైన మిజోరాంలో గత 24 గంటల్లో 901 కేసులు నమోదు కాగా ముగ్గురు మృత్యువాత పడ్డారు. ఆ తర్వాత గత 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎక్కువ కేసులు నమోదు చేసింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 586 తాజా కేసులు నమోదు కాగా తొమ్మిది మంది మరణించారు. శుక్రవారం నాడు దేశ వ్యాప్తంగా దసరా పండుగ వేడుకలు జరిగాయి. కరోనా మహమ్మారి ప్రారంభం నుండి దసరాకు దూరంగా ఉన్న ప్రజలు, దేశంలో కరోనా క్షీణించటంతో, దసరా ఉత్సవాలలో పాల్గొన్నారు. మరి దసరా ఎఫెక్ట్ కరోనా విషయంలో దేశంపై ఏ విధంగా ఉండబోతుందట అనేది రాబోయే రోజుల్లో తెలియనుంది.