తగ్గినట్టే తగ్గి మళ్ళీ భారీగా .. భారత్ లో కరోనా ఆందోళన .. తాజా కేసుల స్థితి ఇదే !!
భారతదేశంలో కరోనా వ్యాప్తికి కొనసాగుతూనే ఉంది. నిన్న కాస్త తగ్గినట్టు అనిపించినా కేసులు మళ్లీ ఈరోజు ఒక్కసారిగా పెరిగిపోయాయి. నిన్నటి గణాంకాల కంటే ఈ రోజు 40 శాతం అధికంగా కరోనా కేసులు నమోదయ్యాయి. దేశంలో తాజాగా గత 24 గంటల్లో 42,625 కరోనా కొత్త కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో 562 మంది కరోనా కారణంగా మృత్యువాతపడ్డారు. దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకు కరోనా కారణంగా మరణించిన వారి సంఖ్య 4,25, 757 కి చేరింది.
కరోనా థర్డ్ వేవ్ ; పిల్లలకు ప్రమాదం ఉండదు, ఆగస్ట్ చివరిలోనే ఆరంభం : మిచిగాన్ వర్సిటీ అధ్యయనం
42 వేలకు పైగా పెరిగిన రోజువారీ కేసులు
రోజువారీ కరోనా కేసులు సానుకూలత 2.3% గా ఉండగా, రికవరీ రేటు 97.37 శాతంగా నమోదైంది. నిన్న 30 ,549 కరోనా కేసులు నమోదు కాగా ఈ రోజు ఒక్క సారిగా 42 వేలకు పైగా కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తుంది. ఇక మృతుల సంఖ్య లో కూడా పెరుగుదల కనిపిస్తోంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా మొత్తం కరోనా కేసుల సంఖ్య 3.17 కోట్లకు చేరుకుంది. ఇటీవల క్రియాశీల కేసులు మళ్లీ నాలుగు లక్షల మార్కును దాటటం ఆందోళన కలిగిస్తుంది. ప్రస్తుతం దేశంలో 4,10,353 యాక్టివ్ కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం క్రియాశీల కేసుల రేటు 1.29 శాతానికి పెరిగింది.
కరోనా నుండి నిన్న కోలుకుంది 36,668 మంది
తాజాగా కరోనా మహమ్మారి బారినుండి 36,668 మంది కోలుకున్నారు. మొత్తం రికవరీలు 3.09 కోట్లకు చేరుకున్నాయి. నిన్న 18,47,518 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలను నిర్వహించారు. దీంతో ఇప్పటి వరకు 47 కోట్లకుపైగా పరీక్షలు నిర్వహించినట్లు ఐసీఎంఆర్ వెల్లడించింది. ఇదిలా ఉంటే గత 24 గంటల్లో 62.53 లక్షలకు పైగా వ్యాక్సిన్ మోతాదులు ఇవ్వబడ్డాయి. కరోనా సెకండ్ వేవ్ ఇంకా కొనసాగుతుందని, మహమ్మారి అంతం జరగలేదని పదేపదే హెచ్చరికలు జారీ చేస్తుంది కేంద్రం. మరోవైపు ఈ నెలలోనే కరోనా థర్డ్ వేవ్ కూడా ముంచుకొస్తుందని మన అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి.
కేరళలో కొనసాగుతున్న కరోనా వ్యాప్తి , టాప్ 5 రాష్ట్రాలు దక్షిణాదిలోనే
అప్రమత్తంగా ఉండాల్సిన అవసరాన్ని సూచిస్తున్న కేంద్ర ప్రభుత్వం, కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్న రాష్ట్రాలపై ప్రధానంగా దృష్టి సారించింది. భారతదేశంలో కేరళలో కరోనా విజృంభణ కొనసాగుతుంది . కేరళలో నిన్న 13,984 కరోనా కేసులు నమోదయ్యాయి. ఆ తరువాత అత్యధిక సంఖ్యలో కరోనావైరస్ కేసులు ఉన్న మహారాష్ట్రలో 6,005 కొత్త ఇన్ఫెక్షన్లు నమోదయ్యాయి. తమిళనాడు 1,908 తాజా కోవిడ్-19 కేసులను నమోదు చేసింది. ఇది మునుపటి రోజు కంటే 2.6% తక్కువ. మహారాష్ట్ర, కేరళ, కర్ణాటక, తమిళనాడు మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో ఎక్కువగా కరోనా కేసులు నమోదవుతున్నాయి.
Recommended Video
దేశ వ్యాప్తంగా 8 రాష్ట్రాల్లో ఆర్ కారకం పెరుగుదల ... అలెర్ట్ అంటున్న కేంద్రం
దేశవ్యాప్తంగా ఎనిమిది రాష్ట్రాలు ఆర్ - కారకం పెరుగుదలను చూపించాయి. ప్రభుత్వం దీనిని "ముఖ్యమైన సమస్య" అని పేర్కొంది. 44 జిల్లాలు అధిక కేస్ పాజిటివిటీని నివేదించాయి . డెల్టా వేరియంట్ విజృంభించిన రెండవ వేవ్ ఇంకా ముగియలేదు అని ప్రభుత్వ కోవిడ్ టాస్క్ ఫోర్స్కు నాయకత్వం వహిస్తున్న వికె పాల్ హెచ్చరించారు. ప్రభుత్వం ప్రకారం, గత నాలుగు వారాల్లో పద్దెనిమిది జిల్లాలు కేసులలో పెరుగుతున్న ధోరణిని చూపించాయి. ఏదిఏమైనా అప్రమత్తంగా ఉండాల్సిన సమయమని ప్రభుత్వం పదే పదే హెచ్చరికలు జారీ చేస్తుంది. ఇదే సమయంలో వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని యుద్ధ ప్రాతిపదికన నిర్వహించటానికి ప్రయత్నిస్తోంది.