భారత్ లో కరోనా పరేషాన్; 15వేలు దాటిన యాక్టివ్ కేసులు; పెరుగుతున్న కేసులు, మరణాలతో ఆందోళన
భారతదేశంలో కరోనా మహమ్మారి కేసులు పెరుగుతున్నాయి. గత కొద్ది రోజులుగా దేశంలో కరోనా కేసులు స్వల్పస్థాయిలో పెరుగుతూనే ఉన్నాయి. తాజా కరోనా కేసుల పెరుగుదలతో క్రియాశీల కేసులు పెరుగుతుండడం ప్రస్తుతం దేశాన్ని ఆందోళనకు గురి చేస్తుంది. ఇక ఇప్పటికే కరోనా మహమ్మారి పట్ల అప్రమత్తంగా ఉండాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలను హెచ్చరిస్తున్నాయి. బహిరంగ ప్రదేశాలలో తిరిగే వారికి మాస్కులను తప్పనిసరి చేశాయి. కరోనా నిబంధనలు పాటించాలని సూచిస్తున్నాయి.
గత 24 గంటల్లో 2,527 కొత్త కోవిడ్ -19 కేసులు, 33 మరణాలు
కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన తాజా గణాంకాల ప్రకారం, భారతదేశంలో గత 24 గంటల్లో 2,527 కొత్త కోవిడ్ -19 కేసులు మరియు 33 మరణాలు నమోదయ్యాయి. భారతదేశంలో 2,000 కంటే ఎక్కువ కరోనావైరస్ ఇన్ఫెక్షన్లను నమోదు చేయడం వరుసగా నాలుగో రోజు. శనివారం నాటి సంఖ్యతో, దేశంలో ఇప్పుడు యాక్టివ్ కేసుల సంఖ్య 15,079కి చేరుకుంది. ప్రస్తుతం క్రియాశీల కేసుల రేటు 0.04 శాతానికి పెరిగినట్లు గా తెలుస్తుంది.
తాజా కరోనా మృతుల సంఖ్య 33
రోజువారీ సానుకూలత రేటు 0.56 శాతంగా ఉంది. గత 24 గంటల్లో మొత్తం 1,656 మంది రోగులు కోలుకున్నారు, ఇది దేశవ్యాప్తంగా కోలుకున్న వారి సంఖ్య 4,25,17,724కి చేరుకుంది. శుక్రవారంనాడు 4.5 లక్షల మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. నిన్న నమోదైన 33 కరోనా మరణాలు కేరళలో నమోదయిన మృతుల సంఖ్య 31 కాగా మరో రెండు మరణాలు దేశ రాజధాని ఢిల్లీలో చోటుచేసుకున్నాయి. దీంతో ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 5.22 లక్షల మంది కరోనా మహమ్మారి కారణంగా ప్రాణాలు కోల్పోయారు.
రికవరీల కంటే కొత్త కేసులే ఎక్కువ
ఇక ఈ రోజు కూడా కొత్త కేసులు కంటే రికవరీలు తక్కువగా నమోదవడం ప్రధానంగా కనిపిస్తుంది. ఇక రికవరీ రేటు 98.75 శాతానికి చేరుకుంది. నిన్ను ఒక్క రోజే దేశంలో 19. 13 లక్షల మందికి కరోనా వ్యాక్సిన్లు ఇవ్వగా, ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 187 కోట్లకుపైగా వ్యాక్సిన్ డోసులు పంపిణీ అయ్యాయి.
ఇదిలా ఉంటే ఢిల్లీలో నిన్న 1,042 తాజా కోవిడ్ కేసులు నమోదయ్యాయి. ఫిబ్రవరి 10 తర్వాత అత్యధికంగా 4.64 శాతం పాజిటివిటీ రేటు నమోదైంది. నిన్న మరో ఇద్దరు కూడా ఇన్ఫెక్షన్ కారణంగా మరణించారని అధికారిక సమాచారం శుక్రవారం తెలిపింది. ఏది ఏమైనా పెరుగుతున్న కరోనా కేసులతో అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది.