పొంచి ఉన్న ముప్పు.. అక్టోబర్లోనే థర్డ్ వేవ్..? వైద్య నిపుణుల వార్నింగ్..
కరోనా సెకండ్ వేవ్ నుంచి భారత్ కోలుకుంటోంది. రోజువారీ కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. ఈ క్రమం థర్డ్ వేవ్ ముప్పు సాధ్యాసాధ్యాలపై ప్రముఖ అంతర్జాతీయ వార్తా సంస్థ రాయిటర్స్ ఓ సర్వే నిర్వహించింది. జూన్ 3-17 మధ్య జరిగిన ఈ సర్వేలో వైద్యులు, ఆరోగ్యసంరక్షణా నిపుణులు, శాస్త్రవేత్తలు, వైరాలజిస్టులు, ప్రొఫెసర్లు మొత్తం 40 మంది ప్రముఖులు పాల్గొన్నారు.

థర్డ్ వేవ్ ముప్పు..
భారత్లో అక్టోబరు నాటికి కరోనా థర్డ్ వేవ్ వస్తుందని 21 మంది నిపుణులు హెచ్చరించారు. మరో ముగ్గురు ఆగస్టు నాటికి.. మరో 12 మంది సెప్టెంబరు కల్లా భారత్లో మరోసారి కరోనా విజృంభించొచ్చని అంచనా వేశారు. ఇక మిగిలిన ముగ్గురు నవంబరు-డిసెంబరు మధ్య థర్డ్ వేవ్ ముప్పు పొంచి ఉందని తెలిపారు. రెండో దశ కరోనాతో పోలిస్తే థర్డ్ వేవ్ను నియంత్రించగలిగే అవకాశాలు మెండుగా ఉన్నాయని 34 మందిలో 24 మంది అభిప్రాయపడ్డారు.

మెరుగైన వసతులు
వ్యాక్సిన్లు, ఆక్సిజన్, ఆసుపత్రుల్లో పడకలు వంటి వసతులు మెరుగుపడ్డాయని, లేదంటే థర్డ్ వేవ్ ప్రభావం ఘోరంగా ఉండేదని అభిప్రాయపడ్డారు. విస్తృత స్థాయిలో వ్యాక్సినేషన్ అందుబాటులోకి రావడం, రెండో దశ ఉద్ధృతి వల్ల వచ్చిన సహజ రోగనిరోధక వ్యవస్థ వంటి అంశాలు థర్డ్ వేవ్ను నియంత్రణలో ఉంచనున్నాయని ఎయిమ్స్ డైరెక్టర్ రణ్దీప్ గులేరియా వెల్లడించారు.

అందరికీ టీకాలు
వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతం కానున్నట్లు అత్యధిక మంది ఆరోగ్యసంరక్షణా నిపుణులు తెలిపారు. అలాగే కొన్ని రాష్ట్రాలు కరోనా కట్టడి కోసం విధించిన ఆంక్షల్ని సరళతరం చేయడాన్ని నిపుణులు హెచ్చరించారు. ఇక మూడో దశ ముప్పు పిల్లలపై అధిక ప్రభావం చూపనుందా? అన్న ప్రశ్నకు 40లో 26 మంది అవుననే తెలిపారు. వారికి ఇప్పటి వరకు వ్యాక్సిన్ అందుబాటులో లేకపోవడమే అందుకు కారణమని నిపుణులు అభిప్రాయపడ్డారు.

అలర్ట్.. అలర్ట్...
పిల్లలు భారీ సంఖ్యలో కరోనా బారిన పడితే ప్రభావం ఘోరంగా ఉండే అవకాశం ఉందని నారాయణ హెల్త్కు చెందిన ప్రముఖ కార్డియాలజిస్టు డాక్టర్ దేవి శెట్టి తెలిపారు. పిల్లలకు సంబంధించిన ఐసీయూలు, ఇతర ఆరోగ్య సంరక్షణా వసతులు తక్కువగా ఉండడమే అందుకు కారణమని వెల్లడించారు. కానీ 14 మంది నిపుణులు మాత్రం పిల్లలకు ఎలాంటి ముప్పు ఉండబోదని తెలిపారు.












Click it and Unblock the Notifications