కరోనా వైరస్ కాలర్ ట్యూన్ త్వరలోనే బంద్: విజ్ఞప్తులతో కేంద్రం నిర్ణయం
న్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్ మహమ్మారి అదుపులోనే ఉన్న క్రమంలో కొవిడ్-19పై అవగాహన కోసం టెలికాం ఆపరేటర్లు ప్రవేశపెట్టిన ప్రీకాల్- ఆడియో ప్రకటనలు, కాలర్ ట్యూన్లు త్వరలో నిలిచిపోనున్నాయి. దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టడం వల్ల కొవిడ్ ప్రీకాల్ సందేశాలను నిలిపి వేసే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది.
ఈ ప్రీకాల్-ఆడియో ప్రకటనల కారణంగా అత్యవసర సమయాల్లో ఫోన్కాల్ మాట్లాడటం ఆలస్యమవుతోందని వచ్చిన విజ్ఞప్తుల మేరకు కేంద్ర ప్రభుత్వం ఆ దిశగా ఆలోచిస్తోంది. ఈ మేరకు ఇప్పటికే కేంద్ర ఆరోగ్య శాఖకు టెలీకమ్యూనికేషన్ల విభాగం లేఖ రాసింది.

భారత సెల్యులర్ ఆపరేటర్ల సంఘం, మొబైల్ వినియోగదారుల నుంచి ఈ మేరకు విజ్ఞప్తులు వచ్చినట్లు తెలిపింది. ఈ కొవిడ్ కాలర్ట్యూన్లను నిలిపివేసే అంశాన్ని కేంద్ర ఆరోగ్య శాఖ పరిశీలిస్తోంది. కొవిడ్ నేపథ్యంలో వ్యాక్సినేషన్, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించే విధంగా కేంద్రం ఈ కాలర్ ట్యూన్లను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే.
దేశంలో తగ్గుతున్న కరోనా కేసులు
దేశంలో కరోనా వైరస్ కేసులు భారీగా తగ్గాయి. శనివారం ఉదయం నుంచి ఆదివారం ఉదయం వరకు కొత్తగా 1,421 మందికి కరోనా వైరస్ సోకింది. 149 మంది వైరస్తో మరణించారు. 1,826 మంది వైరస్ను జయించారు. మరోవైపు దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ జోరుగా సాగుతోంది. శనివారం మరో 29,90,658 డోసులు పంపిణీ చేశారు. దీంతో మొత్తం పంపిణీ చేసిన టీకా డోసుల సంఖ్య 1,83,20,10,030 కు పెరిగింది.
మొత్తం కేసులు: 4,30,19,453
మొత్తం మరణాలు: 5,21,004
యాక్టివ్ కేసులు: 16,187
కోలుకున్నవారు: 4,24,82,262
మరోవైపు, ప్రపంచవ్యాప్తంగా కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. శనివారం కేసుల సంఖ్య భారీగా పెరిగింది. అన్ని దేశాల్లో కలిపి మరో 12,29,670 కొత్త కేసులు వెలుగుచూశాయి. 3,065 మరణాలు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 48,08,43,258కు చేరగా.. మృతుల సంఖ్య 61,45,501కు పెరిగింది. కరోనా ప్రభావం దక్షిణ కొరియాలో అత్యధికంగా ఉంది. అక్కడ కొత్తగా 3,35,479 లక్షలకు పైగా కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య కోటి దాటింది. చైనాలోనూ కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి.












Click it and Unblock the Notifications