కరోనావైరస్ చికిత్సకు ట్రంప్ చెప్పిందే సూచించింది ICMR,ఆ మెడిసినే విరుగుడట..!
న్యూఢిల్లీ: దేశంలో కరోనా విజృంభిస్తోంది. ఇప్పటికే ప్రభుత్వం పలు జాగ్రత్తలు తీసుకుంది. అయితే స్వీయ నిర్బంధంలో ఉండటం ద్వారానే ఈ మహమ్మారిని పారదోలచ్చని వైద్యులు చెబుతున్నారు. ప్రతి ఒక్కరం కొన్ని జాగ్రత్తలు పాటిస్తే కచ్చితంగా కరోనావైరస్ మహమ్మారిపై విజయం సాధించొచ్చని చెబుతున్నారు. అయితే ఇప్పటి వరకు కరోనావైరస్కు వ్యాక్సిన్ కనుగొనలేదు. ప్రస్తుతం కరోనావైరస్కు వ్యాక్సిన్ కనుగొనేందుకు క్లినికల్ ట్రయల్స్ ప్రారంభించింది అమెరికాతో పాటు ఇతర దేశాలు. అయితే దీన్ని తీసుకొచ్చేందుకు కనీసమంటే ఏడాదిన్నర సమయం తీసుకుంటుంది.
తాజాగా కరోనావైరస్ చికిత్స కోసం హైడ్రాక్సిక్లోరోక్విన్ను సూచించింది కోవిడ్ 19 పై ఏర్పాటు చేసిన నేషనల్ టాస్క్ ఫోర్స్. ఈ టాస్క్ఫోర్స్ను ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ఏర్పాటు చేసింది. కోవిడ్-19 తీవ్రత ఉన్న వారికి హైడ్రాక్సి క్లోరోక్విన్ను వినియోగించొచ్చని సూచించింది. ఇక ఇదే మెడిసిన్ను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా సూచించారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న మెడిసిన్స్తోనే కరోనావైరస్కు చెక్ పెట్టొచ్చని అగ్రదేశపు అధినేత చెప్పారు.
మలేరియా చికిత్సలో ఈ హైడ్రాక్సి క్లోరోక్విన్ను వినియోగిస్తారు. ఇది కొన్ని దశాబ్దాలుగా వినియోగిస్తున్నారు. కరోనావైరస్ను జయించేందుకు చికిత్సలోభాగంగా ఒక యాంటీబయటిక్తో కలిపి హైడ్రాక్సి క్లోరోక్విన్ను తీసుకుంటే దీన్ని నివారించొచ్చని ఈ మధ్యే ఓ ఫ్రెంచ్ స్టడీ వెల్లడించింది. ఇక కరోనావైరస్ కోసం వ్యాక్సిన్ కనుగొనేందుకు చైనాలో ఏడు క్లినికల్ ట్రయల్స్ ప్రారంభమయ్యాయి. హైడ్రాక్సి క్లోరోక్విన్ పేషెంట్లపై ప్రయోగిస్తున్నారు. ఇక యూనివర్శిటీ ఆఫ్ మిన్నెసోటా కూడా ఈ వారం ట్రయల్స్ను ప్రారంభించింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా ఈ డ్రగ్కు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం విశేషం. యాంటిబయాటిక్ అజిత్రోమైసిన్తో పాటు హైడ్రాక్సిక్లోరోక్విన్ను కలిపి ఇస్తే కోవిడ్ 19 నుంచి బయటపడొచ్చని ట్రంప్ ట్వీట్ చేశారు.