Coronavirus: కర్ణాటక కొంప ముంచిన మహారాష్ట్ర ట్రావెల్ హిస్టరీ, తాడోపేడో తేలుస్తాం, ములాజు !
బెంగళూరు: కరోనా వైరస్ తో పోరాటం చెయ్యడానికి తాము ఎంత వరకు అయినా సిద్దమే అని, కన్నడిగుల ప్రాణాలు కాపాడుకోవడానికి మహారాష్ట్రతో తాడోపేడో తేల్చుకుంటామని, ఆ విషయంలో కఠిన చర్యలు తీసుకుంటామని కర్ణాటక ప్రభుత్వం అంటోంది. కరోనా వైరస్ ను అరికట్టే విషయంలో మహారాష్ట్రతో చాలా జాగ్రత్తగా ఉండాలని, ఆ రాష్ట్రంతో పాటు ముంబైకి చెందిన ఏ ఒక్కరిని కర్ణాటకలో అడుగుపెట్టకుండా చూడాలని కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్. యడియూరప్ప అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. మహారాష్ట్రలో కరోనా వైరస్ తగిలించుకుని ఇక్కడికి నుంచి వస్తున్న వారే కర్ణాటక కొంప ముంచారని అధికారులు ముఖ్యమంత్రి బీఎస్. యడియూరప్పకు సమాచారం ఇచ్చారు. మహారాష్ట్ర నుంచి వచ్చిన వారి దెబ్బకు మరో 56 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడంతో కర్ణాటక ప్రభుత్వం హడలిపోయింది.
Coronavirus: గుజరాత్ VS తమిళనాడు, కరోనా కేసులు ఒక్కటే, మరణాల్లో 90 % తేడా, మోదీ !
ఇంత దారుణమా ?
సోమవారం (మే 18వ తేదీ) మధ్యాహ్నం వరకు కర్ణాటకలో 1,231 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనాయి. ఒక్కరోజులో కర్ణాటకలో 84 కేసులు నమోదైనాయి. కొత్తగా నమోదైన 84 కరోనా పాజిటివ్ కేసుల్లో 56 కేసులు ఒక్క మహారాష్ట్రలోని వివిద ప్రాంతాలు, ముంబై నుంచి వచ్చిన వారి నుంచే వ్యాపించాయని అధికారుల విచారణలో వెలుగు చూసింది. మహారాష్ట్ర నుంచి వచ్చే వారి నుంచి ఇంత దారుణంగా కరోనా వైరస్ వ్యాధి కేసులు నమోదు అవుతున్నాయని తెలుసుకున్న కర్ణాటక ప్రభుత్వం అలర్ట్ అయ్యింది.
మహారాష్ట్ర ట్రావెల్ హిస్టరీతో హడల్
మహారాష్ట్రలోని ముంబై, ఆ రాష్ట్రంలోని ఇతర జిల్లాల్లో సంచరించిన వారు కర్ణాటకలో అడుగుపెట్టారని అధికారులు గుర్తించారు. ఒక్కరోజులో నమోదైన 84 కేసుల్లో 56 కేసులు ఒక్క మహారాష్ట్ర నుంచి వచ్చిన వారే అని అధికారుల విచారణలో వెలుగు చూసింది. మహారాష్ట్ర ట్రావెల్ హిస్టరీ ఉన్న వారి వలనే 56 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయని గుర్తించిన అధికారులు ఆ రాష్ట్రం నుంచి ఒక్కరు కూడా కర్ణాటకలో అడుగుపెట్టకుండా అనేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
సీఎం సొంత జిల్లాకు కరోనా దెబ్బ
కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్. యడియూరప్ప సొంత జిల్లా అయిన శివమొగ్గ, హాసన్, మండ్య తదితర జిల్లాల్లో కొత్తగా నమోదు అవుతున్న కరోనా పాజిటివ్ కేసులకు ముంబై, మహారాష్ట్రకు లింక్ ఉందని కర్ణాటక ప్రభుత్వం గట్టిగా చెబుతోంది. అందువలన కరోనా వైరస్ కట్టడి చేసే విషయంలో, కన్నడిగుల ప్రాణాలు కాపాడే విషయంలో మహారాష్ట్రతో తాము ఎంత వరకైనా పోరాటం చేస్తామని, ఆ విషయంలో వెనక్కి తగ్గమని కర్ణాటక ప్రభుత్వం చెబుతోంది.
కరోనా హాట్ స్పాట్
దేశంలో మహారాష్ట్ర కరోనా వైరస్ కు హాట్ స్పాట్ అయ్యింది. ఒక్క మహారాష్ట్రలో 33,053 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనాయి. కరోనా వైరస్ దెబ్బకు ఒక్క మహారాష్ట్రలో 1,198 మంది మరణించారు. దేశంలో కరోనా వైరస్ మరణాల సంఖ్యలో అగ్రస్థానంలో ఉన్న మహారాష్ట్ర విషయంలో, అక్కడి ప్రజలు కర్ణాటకు వచ్చే విషయంలో చూసిచూడనట్లు వ్యవహరిస్తే మొదటికే మోసం వస్తోందని, అలా జరగడానికి వీలులేదని కర్ణాటక ప్రభుత్వం సంబంధిత అధికారులకు కట్టుదిట్టమైన ఆదేశాలు జారీ చేసింది.
బెళగావి జిల్లాలో హై అలర్ట్
కర్ణాటకలోని బెళగావి జిల్లాలో హై అలర్ట్ ప్రకటించారు. బెళగావి జిల్లాలో కన్నడిగుల కంటే ఎక్కువ శాతం మరాఠీలు ఉండటంతో ఆ జిల్లాలో ఎక్కువ నిఘా వెయ్యాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. బెళగావి జిల్లాకు చెందిన వారితో పాటు మరాఠీలు కర్ణాటకలోకి అక్రమంగా చొరబడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కర్ణాటక ప్రభుత్వం బెళగావి జిల్లా అధికారులకు ఆదేశాలు జారీ చేసింది.