గర్భిణుల్లోనూ కరోనా ప్రభావం ఎక్కువే: ఐసీఎంఆర్ తాజా అధ్యయనంలో వెల్లడి
న్యూఢిల్లీ: భారత వైద్య పరిశోధన మండలి(ఐసీఎంఆర్) తన తాజా అధ్యయనంలో కీలక విషయాలను వెల్లడించింది. కరోనావైరస్ సోకిన గర్భిణుల్లో ఇన్ఫెక్షన్ ముప్పు ఎక్కువేనని, ఈ క్రమంలో వారికి తక్షణ వైద్య పర్యవేక్షణ అవసరమని పేర్కొంది. గర్భిణుల్లో కరోనా ప్రతికూల ఫలితాలపై ఎక్కువ కేసులు నమోదైన మహారాష్ట్రలో ఈ అధ్యయనం జరిపింది.
మహారాష్ట్రలోని పలు ఇన్సిస్టిట్యూట్లు, ఆస్పత్రుల సహకారంతో ఐసీఎంఆర్ మొదటిసారిగా సమగ్ర అధ్యయనం జరిపింది. మహారాష్ట్రలో కరోనా సోకిన గర్భిణులు, బాలింతలపై సేకరించిన సమాచారంతో ఐసీఎంఆర్ అధ్యయనం చేసింది. 2020 మార్చి నుంచి 2021 జనవరి వరకు మహారాష్ట్ర వ్యాప్తంగా 4203 మంది కరోనా సోకిన గర్భిణుల నుంచి సేకరించిన సమాచారాన్ని విశ్లేషించగా.. 3213 జననాలు, 77 గర్భస్త్రాలు నమోదయ్యాయని తేలింది. మొత్తం 528 మందికి ముందస్తు ప్రసవం జరిగింది. 328 మందిలో రక్తపోటు సమస్యలు తలెత్తాయి. పిండ విచ్చిత్తి, మృత శిశివుల జననం నిష్పత్తి ఆరు శాతంగా ఉంది.
మొత్తం గర్భిణుల్లో 534 మంది సింప్లమెటిక్గా గుర్తించారు. వీరిలో 382 మందిలో తేలికపాటి, 112 మందిలో మధ్యస్థ, 40 మందిలో తీవ్రమైన లక్షణాలున్నాయి. మొత్తంగా 158 మంది గర్భిణులు, బాలింతలకు ఇంటెన్సివ్ కేర్ వైద్యం అవసరమైంది. వీరిలో 152 మందికి కరోనా సంబంధిత సమస్యలు కారణమయ్యాయి. మొత్తం మరణాల రేటు 0.8 శాతం(34/4203)గా నమోదైంది. పుణెలో 1.1 శాతం(9/531), మరఠ్వాడాలో 1.1శాతం(4/351) అధిక మరణాలు సంభవించాయి. గర్భిణుల్లో లక్షణాలు కనిపించినప్పుడు.. అవి తీవ్రమయ్యే అవకాశాలు ఎక్కువ. అందుకే కరోనా సోకిన గర్భిణులకు తక్షణ వైద్య సహాయం అవసరమని ఐసీఎంఆర్ స్పష్టం చేసింది. కరోనా దరిచేరకుండా మాస్కులు ధరించడం లాంటి జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.
ఇది ఇలావుండగా, దేశంలో కరోనావైరస్ మహమ్మారి వ్యాప్తి స్థిరంగా కొనసాగుతోంది. అత్యధికంగా కరోనా కేసులు నమోదవుతున్న కేరళలోనూ కాస్త తగ్గుముఖం పట్టింది. అయితే, పండగల సీజన్ కావడంతో రానున్న రెండు మూడు నెలలు ప్రజలు మరింత జాగ్రత్తగా ఉండాలని కేంద్ర ప్రభుత్వం హెచ్చరించింది. సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించింది.
దేశంలో కరోనా పరిస్థితిపై కేంద్ర ఆరోగ్య ఉన్నతాధికారులు గురువారం మీడియాతో మాట్లాడారు. ఇప్పటి వరకు కరోనా కట్టడిలో సాధించిన ఫలితాలున మరింత మెరుగుపరుచుకుందామన్నారు. దేశ వ్యాప్తంగా యువజనాభాలో ఇప్పటి వరకు 20 శాతం మందికి రెండు డోసులు పంపిణీ పూర్తయిందని, అలాగే 62 శాతం మందికి కనీసం ఒక్కడోసు అందినట్లు నీతి ఆయోగ్ సభ్యుడు(ఆరోగ్యం) వీకే పాల్ తెలిపారు.
దేశంలో 34 జిల్లాల్లో వీక్లీ పాజిటివిటీ రేటు 10 శాతం కన్నా అధికంగా ఉండగా, 32 జిల్లాల్లో మాత్రం 5 నుంచి 10 శాతంగా ఉన్నట్లు తెలిపారు. పాజిటివిటీ రేటు ఎక్కువగా ఉన్న ఆయా జిల్లాల్లో మరింత కఠినంగా వ్యవహరించాలన్నారు. గత వారంలో దేశ వ్యాప్తంగా నమోదైన మొత్తం కేసుల్లో దాదాపు 67.79 శాతం కేసులు కేరళలోనే వచ్చాయని, ప్రస్తుతం ఆ రాష్ట్రంలో 1.99 లక్షల యాక్టివ్ కేసులున్నాయని తెలిపారు.
మిజోరం, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్రలలో 10వేలు కన్నా ఎక్కువగా యాక్టివ్ కేసులున్నాయని కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్ తెలిపారు. మిజోరం పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నప్పటికీ.. వ్యాక్సినేషన్ వేగంగా జరిగి, తగిన చర్యలు తీసుకోవడం ద్వారా మెరుగుపడుతుందని భావిస్తున్నామన్నారు.
ఐసీఎంఆర్ డైరెక్టర్ జనరల్ బలరాం భార్గవ మాట్లాడుతూ.. వచ్చేది పండగల సీజన్ వస్తుండటంతో వ్యాక్సిన్ తీసుకోవడం, కరోనా నిబంధనలు పాటించడం, అనవసర ప్రయాణాలు తగ్గించుకోవడం వంటి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు. కేరళలో కరోనా వైరస్ వ్యాప్తి తగ్గుముఖం పడుతున్నాయన్నారు. ఇతర రాష్ట్రాల్లో కూడా అదే పరిస్థితి కొనసాగుతోందని తెలిపారు. పండగల సీజన్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే మరోసారి కరోనావైరస్ విజృంభించే అవకాశం ఉందని హెచ్చరించారు.