Domestic Flights ban: బుధవారం నుంచి రాకపోకలు బంద్, సరకు రవాణా మాత్రం కంటిన్యూ: కేంద్రం..
కరోనా వైరస్ పాజిటివ్ కేసులు పెరగడంతో కేంద్రం మరింత పటిష్ట చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే 20 రాష్ట్రాలు లాక్ డౌన్ విధించిన సంగతి తెలిసిందే. విదేశాల నుంచి వచ్చేవారితో వైరస్ సోకుతుండటంతో గత వారం నుంచి అంతర్జాతీయ విమానాలను అనుమతించడం లేదు. ఆయా రాష్ట్రాల్లో కూడా వైరస్ వ్యాప్తి పెరగడంతో.. దేశీయంగా కూడా విమాన రాకపోకలపై నిషేధం విధిస్తామని కేంద్ర ప్రభుత్వం స్పష్టంచేసింది. బుధవారం నుంచి దేశంలో ఏ ప్రాంతానికి కూడా విమాన రాకపోకలు ఉండబోవని తేల్చిచెప్పింది.
ప్లైట్స్ బ్యాన్...
మంగళవారం అర్ధరాత్రి 11.59 గంటల వరకు ప్యాసెంజర్ ప్లైట్లను అనుమతిస్తామని పౌరవిమానయాన శాఖ తెలిపింది. సరుకులు రవాణా చేసే విమాన సేవలు మాత్రం యథాతథంగా కొనసాగుతాయని పేర్కొన్నది. ఇప్పటికే అంతర్జాతీయ విమానాలు రద్దు చేయడంతో.. విదేశీ సరిహద్దులను కూడా మూసివేశారు. ఆదివారం సాయంత్రం నుంచి రైళ్లు, మెట్రో రైళ్లు, అంతరాష్ట్ర బస్సులను కూడా నిలిపివేశారు.
కేజ్రీ చెబితే..
వైరస్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఢిల్లీలోకి ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే విమానాలను అనుమతించబోమని సీఎం అరవింద్ కేజ్రీవాల్ సూచించారు. కానీ అతని సూచనను కేంద్ర పౌరవిమానయాన శాఖ ఖతారు చేయలేదు. సోమవారం ఉదయం బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ప్రధాని మోడీకి లేఖ రాశారు. ఇతర ప్రాంతాల నుంచి బెంగాల్కు విమాన సేవలను నిలిపివేయాలని కోరారు. ఇప్పటికే బస్సులు, రైళ్లను నిలిపివేశామని.. విమానాలు నడపడంతో వైరస్ ప్రబలే అవకాశం ఉందని ఆందళన వ్యక్తం చేశారు. సీఎంల నుంచి ఒత్తిడి, వైరస్ వ్యాప్తి ఎక్కువవడంతో కేంద్రం దేశంలో విమానాల రాకపోకలపై నిషేధం విధించింది.
బీ అలర్ట్..
కరోనా వైరస్ సోకి చనిపోయిన వారి సంఖ్య ఎనిమిది మందికి చేరుకుంది. పాజిటివ్ కేసులు 415కి చేరుకోవడంతో భయాందోళన నెలకొంది. ప్రపంచంలో అత్యంత జనాభా కలిగిన రెండో దేశమైన భారత్లో కరోనా పాజిటివ్ కేసులు పెరగడం ఆందోళన కలిగిస్తోంది. లాక్ డౌన్ సహా కఠిన చర్యలు తీసుకోవాలని శాస్త్రవేత్తలు, నిపుణులు సూచిస్తున్నారు. లేదంటే వైరస్ బారినపడే వారి సంఖ్య మరింత పెరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు.