Coronavirus: ఐటీ రాజధానిలో 484 డేంజర్ జోన్లు, 8 పోలీస్ స్టేషన్లు సీల్ డౌన్, కానిస్టేబుల్ ఆత్మహత్య !
బెంగళూరు: ఐటీ, బీటీ సంస్థల దేశ రాజధాని సిలికాన్ సిటీ బెంగళూరు నగరంలో కరోనా వైరస్ (COVID 19) దెబ్బకు ప్రజలతో పాటు రాజకీయ నాయకులు, అధికారులు, ముఖ్యంగా పోలీసులు హడలిపోతున్నారు. బెంగళూరు సిటీలో 484 డేంజర్ జోన్లు గుర్తించిన అధికారులు ఆ ప్రాంతాలు పూర్తిగా సీల్ డౌన్ చేశారు. బెంగళూరు సిటీలో రోజురోజు కరోనా పాజిటివ్ కేసులు పెరిగిపోవడంతో BBMP అధికారులు అనేక చర్యలు తీసుకుని కరోనా వైరస్ కట్టడి చెయ్యాలని విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. ఇక ఒక్క బెంగళూరు సిటీలో మాత్రమే 8 పోలీస్ స్టేషన్లు పూర్తిగా సీల్ డౌన్ కావడంతో సిలికాన్ సిటి పరిస్థితి ఎలా ఉందో పూర్తిగా అర్థం అవుతోంది. కరోనా పాజిటివ్ వచ్చిందని తెలిసిన వెంటనే కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకోవడంతో పోలీసులు హడలిపోతున్నారు.

బీబీఎంపీ కమిషనర్ క్లారిటీ
బెంగళూరు సిటీలో కరోనా వైరస్ (COVID 19) లక్షణాలు ఉన్న వారు, వైరస్ సోకిన వారి సంఖ్య రోజురోజుకు ఎక్కువ అవుతోందని, ILI, SARI లక్షణాలు ఉన్న వారిలో (దాదాపు 32 %) ఉన్న వారికి కరోనా వైరస్ వ్యాధి సోకుతోందని అధికారుల విచారణలో వెలుగు చూసింది. బెంగళూరు సిటీలో కరోనా వైరస్ లక్షణాలు ఎక్కువగా వెలుగు చూస్తున్న ప్రాంతాలను పూర్తిగా సీల్ డౌన్ చేశామని బీబీఎంపీ కమిషనర్ అనీల్ కుమార్ చెప్పారు.

బెంగళూరు కరోనా లెక్కలు
బెంగళూరు సిటీలోని వివిధ ప్రాంతాల్లో కరోనా వైరస్ సోకిన వారి సంఖ్య 1, 405కు చేరుకుందని అధికారులు అంటున్నారు. బెంగళూరులో 965 కరోనా ఆక్టిక్ కేసులు ఉన్నాయి. ఇప్పటికే కరోనా వైరస్ వ్యాధితో 378 మంది కోలుకున్నారు. బెంగళూరు సిటీలో కరోనా వైరస్ కాటుకు ఇప్పటి వరకు 65 మంది మరణించారని అధికారికంగా ప్రభుత్వం వెళ్లడించింది.

5% పెరిగిపోయిన కరోనా కేసులు
బెంగళూరు సిటీలో ఒక్కసారిగా 5 % కరోనా పాజిటివ్ కేసులు పెరిగిపోవడంతో అధికారులతో పాటు ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏ ప్రాంతం నుంచి ఏ ప్రాంతానికి కరోనా వైరస్ వ్యాపిస్తుందో అర్థం కాకపోవడంతో ప్రజలు హడలిపోతున్నారు. బెంగళూరు సిటీలో కరోనా వైరస్ విషయంలో అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని, కరోనా వైరస్ వ్యాపించకుండా అన్ని చర్యలు తీసుకోవాలని కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్. యడియూరప్ప ఇప్పటికే అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. సీఎం ఆదేశాలతో ఇప్పటికే బెంగళూరులో 484 డేంజర్ జోన్లు గుర్తించిన అధికారులు ఆ ప్రాంతాలను పూర్తిగా సీల్ డౌన్ చేశారు.

పోలీసులకు హడల్
బెంగళూరు సిటీలో 24 గంటలు విధి నిర్వహణలో ఉంటున్న పోలీసులకు కరోనా వైరస్ దెబ్బ పడింది. బెంగళూరు సిటీలోని అనేక పోలీస్ స్టేషన్లలో పని చేస్తున్న పోలీసులకు కరోనా వైరస్ లక్షణాలు బయటపడ్డాయి. ఇప్పటి వరకు ఒక్క బెంగళూరు సిటీలో మాత్రమే మొత్తం 77 మంది పోలీసులకు కరోనా వైరస్ పాజిటివ్ అని వెలుగు చూసింది.

కరోనాతో కానిస్టేబుల్ ఆత్మహత్య
కేఎస్ఆర్ పీ 4వ బెటాలియన్ కు చెందిన 50 ఏళ్ల కానిస్టేబుల్ కు కరోనా వైరస్ పాజిటివ్ అని వెలుగు చూసింది. తనకు కరోనా వచ్చిందనే భయంతో ఆ కానిస్టేబుల్ మంగళవారం ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ దెబ్బతో పోలీసులతో పాటు వారి కుటుంబ సభ్యులు కరోనా వైరస్ దెబ్బకు హడలిపోతున్నారు.

8 పోలీస్ స్టేషన్లు సీల్ డౌన్
బెంగళూరు సిటీలోని పలు పోలీస్ స్టేషన్లలో ఉద్యోగాలు చేస్తున్న పోలీసులకు, ట్రాఫిక్ పోలీసులకు కరోనా పాజిటివ్ అని వెలుగు చూసింది. 24 గంటలు విధి నిర్వహణలో పోలీసులు బయటకు వెళ్లి మళ్లీ పోలీస్ స్టేషన్లకు తిరిగి వస్తున్నారు. ఈ దెబ్బతో ఒకరి నుంచి మరోకరికి కరోనా వైరస్ సోకుతోందని అధికారులు గుర్తించారు. బెంగళూరు సిటీలోని వీవీ పురం, కలాసిపాళ్య, కుమారస్వామి లేఔట్, కబ్బన్ పార్క్, హలసూరు గేట్ పోలీస్ స్టేషన్, మారతహళ్ళి, కోరమంగల, తిలక్ నగర్ పోలీస్ స్టేషన్లను పూర్తిగా సీల్ డౌన్ చేశారు.












Click it and Unblock the Notifications