covid-19, మరో ముప్పు!ఈనెల 16న జగన్ సహా 6రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ భేటీ-దక్షిణాదిలో కేసీఆర్ తప్ప
దేశంలో కరోనా మహమ్మారి విలయానికి సంబంధించి మరిన్ని ప్రమాద సంకేతాలు వెలువడుతున్నాయి. కరోనా రెండో వేవ్ ఉధృతి పూర్తిగా తగ్గక ముందే మూడో వేవ్ తప్పదని ఇండియన్ మెడికల్ అసోసియేషన్(ఐఎంఏ) హెచ్చరించడం, ఉత్తరాదిలోని పర్యాటక ప్రాంతాలపై ఆంక్షలకు కేంద్రం ఆదేశాలివ్వడం తెలిసిందే. నిజానికి దేశంలో జులై 4నే మూడో వేవ్ మొదలైందనీ ప్రముఖ సైంటిస్టులు చెబుతున్నారు. ఈ పరిణామాల నడుమ ప్రధాని నరేంద్ర మోదీ వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వరుసగా భేటీ అవుతూ, కరోనా పరిస్థితులను సమీక్షిస్తున్నారు..

వేరియంట్లపై మోదీ నిర్దేశం
దేశంలో మూడో వేవ్ భయాలకుతోడు రెండో వేవ్ చివర్లో వ్యాప్తి చెందిన కొవిడ్ కొత్త వేరియంట్లపై, మ్యూటేషన్లపై ప్రధాని నరేంద్ర మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. కొత్త వేరియంట్లను ట్రాక్ చేయడంతో పాటు వైరస్ మ్యుటేషన్పై కఠిన పర్యవేక్షణ తప్పనిసరని ఆయన సూచించారు. ఈశాన్య రాష్ట్రాల్లో కరోనా పరిస్థితిపై ఆ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని మోదీ మంగళవారం సమీక్ష జరిపారు. పర్యాటకం, వ్యాపారాలపై కోవిడ్ ప్రభావం ఉన్న విషయాన్ని ప్రధాని అంగీకరిస్తూనే, తగిన ముందస్తు జాగ్రత్తలు తీసుకోకుండా హిల్ స్టేషన్లలో జనం గుమిగూడవద్దని మోదీ హెచ్చరించారు. ఈశాన్య రాష్ట్రాల సీఎంలతో భేటీ తర్వాత ప్రధాని..

మరో 6 రాష్ట్రాల సీఎంలతో ప్రధాని
ఈశాన్య రాష్ట్రాల సీఎంలతో మంగళవారం నాటి సమీక్ష తర్వాత ప్రధానమంత్రి కార్యాలయం నుంచి మరో ప్రకటన వెలువడింది. ఈనెల 16న(శుక్రవారం నాడు) ప్రధాని మోదీ మరో ఆరు రాష్ట్రాల సీఎంలతో వర్చువల్ గా భేటీ కానున్నారని, శుక్రవారం ఉదయం 11 గంటలకు ఆ సమావేశం ప్రారంభమవుతుందని పీఎంవో తెలిపింది. ప్రధానితో కొవిడ్ సమీక్షలో పాల్గొనాల్సిన ఆరు రాష్ట్రాల సీఎంలకు ఇప్పటికే సమాచారం అందినట్లు తెలుస్తోంది. ఆ రాష్ట్రాలు ఏవంటే..

కేసీఆర్ తప్ప దక్షణాదిలో అంతా
ఈనెల 16న ప్రధాని మోదీ.. కేరళ, కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిశా ముఖ్యమంత్రులతో కొవిడ్ పరిస్థితిపై సమీక్ష జరుపుతారు. ఈ ఆరు రాష్ట్రాల్లోనూ కరోనా కేసులు, మరణాలు అధికంగా ఉండటం తెలిసిందే. కొవిడ్ బాధిత రాష్ట్రాల జాబితాలో మహారాష్ట్ర టాప్ లో ఉండగా, కేరళ, కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ లు తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ఒడిశాలో ఇటీవలే కేసులు భారీగా వస్తున్నాయి. కాగా, శుక్రవారం నాటి సమీక్షలో మోదీ.. ఒక్క తెలంగాణ సీఎం కేసీఆర్ తప్ప దక్షిణాదిలోని అందరు సీఎంలతో భేటీ అవుతారు. తెలంగాణలో కేసులు, మరణాలు తక్కువస్థాయిలో ఉన్నందున, ఆ కేటగిరీలోని రాష్ట్రాలతో మాట్లాడినప్పుడు కేసీఆర్ కు కూడా పిలుపు రావొచ్చని తెలుస్తోంది.












Click it and Unblock the Notifications