పేటీఎంకు కరోనా దెబ్బ.. 15 రోజులు బంద్
చైనాలో ప్రజలతోపాటు అక్కడి ఆర్థిక వ్యవస్థను కూడా దెబ్బతీసిన కరోనా వైరస్.. ఇప్పుడు యూరోపియన్, ఇండియన్ మార్కెట్లపైనా ప్రభావం చూపుతోంది. వైరస్ వ్యాప్తి కారణంగా ప్రఖ్యాత ఈ-కామర్స్ సంస్థ పేటీఎం తన ప్రధాన కార్యాలయాన్ని 15 రోజులపాటు మూసేయాలని నిర్ణయించుకుంది. గుర్గావ్ లోని పేటీఎం ఆఫీసులో ఓ ఉద్యోగికి కరోనా సోనినట్లు నిర్ధారణ కావడంతో యాజమాన్యం ఈమేరకు నిర్ణయం తీసుకుంది.
మొదట రెండ్రోజులు మాత్రమే కార్యాలయాన్ని మూసేయాలనుకున్నప్పటికీ.. ఢిల్లీ చుట్టుపక్కల వైరస్ విజృంభిస్తుండటంతో ఏకంగా 15 రోజులపాటు ఆఫీసు మూసేయాలనే నిర్ణయానికి వచ్చారు. పాజిటివ్ గా తేలిసిన పేటీఎం ఉద్యోగి.. ఈమధ్యే ఇటలీ నుంచి తిరిగొచ్చాడని తేలింది. నోయిడాలోని ఆఫీసును కూడా బుధవారమే మూసేసిన పేటీఎం.. సోమవారం నుంచి అక్కడ పని యధావిధిగా జరుగుతుందని చెప్పడం గమనార్హం.

దేశాన్ని గజగజలాడిస్తోన్న కొవిడ్-19(కరోనా వైరస్)పై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నాయి. ఢిల్లీలోని అన్ని ప్రైవేటు, ప్రభుత్వ, కేంద్రీయ స్కూళ్లలో ప్రైమరీ సెక్షన్లకు ఈనెల 31 వరకు సెలవులు ప్రకటించారు. ఘజియాబాద్ వ్యక్తికి వైరస్ నిర్ధారణ కావడంతో దేశంలో పాజిటివ్ కేసుల సంఖ్య 30కి పెరిగింది.
ఇండియాతోపాటు ప్రపంచ వ్యాప్తంగా 80 దేశాలకు కరోనా వైరస్ విస్తరించింది. గురువారం సౌతాఫ్రికాలో మొట్టమొదటి కరోనా కేసు నమోదైంది. దీంతో వైరస్ అన్ని ఖండాలకూ వ్యాపించినట్లయింది. ఇప్పటిదాకా కరోనా బారినపడి చనిపోయినవాళ్ల సంఖ్య 3,200కు పెరిగింది.












Click it and Unblock the Notifications