కేంద్రం గుడ్న్యూస్- వచ్చే ఏడాది ఆరంభంలో కరోనా వ్యాక్సిన్- రాజ్యసభలో ప్రకటన...
దేశవ్యాప్తంగా కరోనా కల్లోలం రేపుతోంది. ప్రతీ రోజూ దాదాపు లక్ష కేసులు నమోదవుతున్నాయి. సగానికి పైగా రాష్ట్రాల్లో ఇప్పటికీ పరిస్ధితులు కుదుటపడలేదని కేంద్రం అంచనా వేస్తోంది. దీంతో కరోనాకు అడ్డుకట్ట వేసే వ్యాక్సిన్ కోసం బాధితుల ఎదురుచూపులు పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో కరోనా మహమ్మారితో అల్లాడుతున్న దేశ ప్రజలకు కేంద్రం ఇవాళ శుభవార్త చెప్పింది. కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి తెచ్చేందుకు ద్రం తీవ్రంగా ప్రయత్నిస్తోందని, వచ్చే ఏడాది ఆరంభంలో వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చే అవకాశముందని ఆరోగ్యమంత్రి హర్షవర్ధన్ రాజ్యసభలో ప్రకటించారు.
కొనసాగుతున్న కల్లోలం...
కరోనా మహమ్మారి దేశంలోకి ప్రవేశించి ఏడు నెలలు దాటిపోయినా ఇంకా దాని ప్రభావం ఏమాత్రం తగ్గకపోగా పెరుగుతున్న పరిస్ధితులు కనిపిస్తున్నాయి. ప్రతీ రోజూ దాదాపు లక్ష కొత్త కేసులు నమోదవుతుండగా.. ఇప్పటివరకూ నమోదైన కేసుల సంఖ్య 51 లక్షల మార్కు దాటిపోయింది. మృతుల సంఖ్య కూడా లక్షకు సమీపిస్తోంది. గత 24 గంటల్లో 97 వేల కొత్త కేసులు, వెయ్యికి పైగా మరణాలు చోటు చేసుకున్నాయి. దీంతో కేంద్రం కూడా ఎప్పటికప్పుడు పరిస్ధితిని నిశితంగా గమనిస్తోంది. ఐసీఎంఆర్ మార్గదర్శకాలను అమలు చేస్తూనే మరోవైపు వ్యాక్సిన్ కోసం ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది. రష్యా వ్యాక్సిన్ స్పుత్నిక్ను భారత్లోకి అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నాయి.
వ్యాక్సిన్ పై కేంద్రం శుభవార్త...
దేశవ్యాప్తంగా కల్లోలం రేపుతున్న కరోనా మహమ్మారి తాజా పరిస్ధితిపై కేంద్రం తాజాగా రాజ్యసభలో ప్రకటన చేసింది. కరోనా నియంత్రణకు తీసుకుంటున్న చర్యలను ఏకరువు పెడుతూనే వ్యాక్సిన్కు సంబంధించి ఓ గుడ్ న్యూస్ చెప్పింది. దేశంలో ప్రస్తుతం కరోనా వ్యాప్తి తీవ్రంగానే ఉందని అంగీకరించిన కేంద్రం.. వచ్చే ఏడాది ఆరంభంలో వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుందని అంచనా వేస్తున్నట్లు చెప్పింది. కరోనా తాజా పరిస్ధితిపై రాజ్యసభలో మాట్లాడిన కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్ ... ఒకప్పుడు మాస్కులు, పీపీఈ కిట్లు లేవనే విమర్శలు వచ్చాయని, కానీ ఇప్పుడు ప్రజలు అంతకు మించిన సమస్యలు ఎదుర్కొనే పరిస్ధితులు ఉన్నాయని స్పష్టం చేశారు. ఇలాంటి పరిస్ధితుల్లో కరోనా వ్యాక్సిన్ వచ్చే ఏడాది ప్రధమార్దంలో అందుబాటులోకి వస్తుందని భావిస్తున్నామన్నారు.
రెడ్డీస్ ల్యాబ్తో ఒప్పందం...
రష్యా డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ (ఆర్డీఐఎఫ్) అభివృద్ధి చేస్తున్న స్పుత్నిక్ వీ క్యాండిడేట్ వ్యాక్సిన్ను భారత్లో సరఫరా చేసేందుకు హైదరాబాద్కు చెందిన రెడ్డీస్ ల్యాబ్తో ఒప్పందం చేసుకుంది. దీని ప్రకారం వచ్చే ఏడాది కల్లా వంద మిలియన్ డోసుల స్పుత్నిక్ వ్యాక్సిన్ అందుబాటులోకి రానుంది. దీన్ని భారత్లో డీసీజీఐ ఆమోదించాల్సి ఉంది. ప్రస్తుతం మూడో దశ ట్రయల్స్ను రష్యా కొనసాగిస్తోంది. ఈ నేపథ్యంలో రష్యా వ్యాక్సిన్ను దృష్టిలో ఉంచుకునే కేంద్రం వచ్చే ఏడాది ఆరంభంలో వ్యాక్సిన్ అందుబాటులోకి రావొచ్చని అంచనా వేసినట్లు తెలుస్తోంది.
Recommended Video
తొందరపాటు వద్దొన్న విపక్షాలు...
భారత్లో కరోనా వ్యాక్సిన్ వచ్చే ఏడాది ఆరంభంలో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని కేంద్ర ఆరోగ్యమంత్రి హర్షవర్ధన్ చేసిన ప్రకటనపై స్పందిస్తూ దీనిపై తొందరపాటు అవసరం లేదని, ఏమాత్రం తేడా వచ్చినా యువకుల జనాభా అధికంగా ఉన్న భారత్పై దాని ప్రభావం ఎక్కువగా ఉంటుందని రాజ్యసభలో విపక్ష నేత గులాం నబీ ఆజాద్ స్పష్టం చేశారు. భారత్కు తక్కువ ధరలో వ్యాక్సిన్ అందుబాటులోకి తీసుకొచ్చే సత్తా ఉందన్నారు. కరోనాను కట్టడి చేసే అంశంపై జరిగిన చర్చల్లో పాల్గొన్న ఆజాద్.. కేంద్రం విలువైన సమయాన్ని వృధా చేసిందని, గతేడాది డిసెంబర్లో ప్రపంచ ఆరోగ్యసంస్ధ హెచ్చరికలను పట్టించుకుని ఉంటే ఇలాంటి పరిస్ధితి వచ్చేది కాదన్నారు.