కోవిషీల్డ్, కోవాగ్జిన్ మార్కెట్ ధరలు దాదాపు ఖరారు: రూ. 275 ఉండే అవకాశం
న్యూఢిల్లీ: భారతదేశంలో అభివృద్ధి చేసిన కోవాగ్జిన్, కోవిషీల్డ్ టీకాలు త్వరలో బహిరంగ మార్కెట్లోకి రానుండటంతో వాటి ధరలు దాదాపు ఖరారైనట్లు తెలిసింది. సామాన్యులకు ధరలు అందుబాటులో ఉంచాలని నేషనల్ ఫార్మాస్యూటికల్ ప్రైసింగ్ అథారిటీ(ఎన్పీపీఏ) భావిస్తోంది.
కోవిషీల్డ్, కోవాగ్జిన్ మార్కెట్ ధరలు ఇవే?
కాగా, భారత్లో తయారయ్యే కోవాగ్జిన్, కోవిషీల్డ్ టీకాలను బహిరంగ మార్కెట్లోకి విడుదల చేసుకునేందుకు అనుమతి ఇవ్వాలంటూ తయారీ సంస్థలు భారత డ్రగ్ నియంత్రణ సంస్థ (డీసీజీఐ) అనుమతి కోరాయి. అయితే బహిరంగ మార్కెట్లో వీటి విలువ ఎంత ఉండాలన్న అంశంపై ఒక నివేదిక ఇవ్వాలంటూ డీసీజీఐ.. నేషనల్ ఫార్మాస్యూటికల్ ప్రైసింగ్ అథారిటీ (ఎన్పీపీఏ)ను కోరింది. ఈ క్రమంలో ఒక్కో వ్యాక్సిన్ డోసు ధరను రూ. 275కు పరిమితం చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. దీనికి అదనంగా సర్వీసు ఛార్జీ కింద మరో రూ. 150 చెల్లించాల్సి ఉంటుందని అధికార వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం ప్రైవేటు ఆస్పత్రుల్లో కోవాగ్జిన్ డోసు ధర రూ. 1200 ఉండగా, కోవిషీల్డ్ డోసు ధర రూ. 780గా ఉంది. దీనికి రూ. 150 సర్వీసు ఛార్జీ అదనంగా ఉండనుంది.
బహిరంగ మార్కెట్లోకి కోవిషీల్డ్, కోవాగ్జిన్ టీకాలు
ప్రస్తుతం ఈ రెండు వ్యాక్సిన్లకు దేశంలో అత్యవసర వినియోగ అనుమతులు మాత్రమే ఉన్నాయి. అయితే, కొన్ని షరతులకు లోబడి కోవిషీల్డ్, కోవాగ్జిన్ టీకాలను బహిరంగ విపణిలోకి అనుమతించేందుకు కేంద్ర ఔషధ ప్రమాణాల నియంత్రణ సంస్థ(సీడీఎష్సీఓ)కు చెందిన నిపుణుల కమిటీ జనవరి 19న సిఫార్సు చేసింది. తమ టీకాలను బహిరంగ మార్కట్లోకి అందుబాటులో తీసుకొచ్చేందుకు అనుమతించాల్సిందిగా కోవిషీల్డ్ తయారీదారైన సీఐఐ, కోవాగ్జిన్ను అభివృద్ధి పర్చిన భారత్ బయోటెక్ సంస్థలు విడివిడిగా డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియాకు దరఖాస్తు చేసుకున్నాయి.
Recommended Video
దేశంలో ఇప్పటి వరకు 160 కోట్ల మందికిపైగా వ్యాక్సిన్ పూర్తి
ఈ రెండు సంస్థల నుంచి అందిన సమాచారాన్ని సమగ్రంగా విశ్లేషించిన అనంతరం సీడీఎస్సీఓకు చెందిన నిపుణుల కమిటీ ఈ టీకాలకు బహిరంగ మార్కెట్లో అనుమతులను జారీ చేయవచ్చని నిర్ణయించినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. జనవరి 3, 2022లో ఈ రెండు వ్యాక్సిన్లకు కేంద్ర అత్యవసర వినియోగ అనుమతులు మంజూరు చేసిన విషయం తెలిసిందే. ఇది ఇలావుండగా, జనవరి 26 సాయంత్రం వరకు దేశ వ్యాప్తంగా 163.58కోట్ల కరోనా వాక్సిన్లు పంపిణీచేశారు. ఈ ప్రకారం దేశ జనాభాలో ఒక్కొక్కరు కనీసం ఒక్కసారైనా టీకా తీసుకున్నారు. బూస్టర్ డోసులు కూడా ఇస్తున్నారు.