జయతో మొదలై.. ట్విస్టులతో జైలుకు చేరిన శశికళ జర్నీ..
సీఎం కుర్చీపై ఫోకస్ చేసిన శశికళ తనపై ఉన్న అక్రమాస్తుల కేసును అంతగా పట్టించుకోలేదని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.
చెన్నై: తమిళ దివంగత సీఎం అమ్మ మరణం తర్వాత తమిళ రాజకీయాల్లో ఎంతటి నాటకీయత చొరబడిందో కళ్లముందు కనిపిస్తూనే ఉంది. అమ్మకు విధేయుడైన పన్నీర్.. ఆమె నెచ్చెలి శశికళ మధ్య ఆధిపత్య పోరుకు తెరలేవడం.. అనూహ్యంగా పన్నీర్ తిరుగుబాటు చేయడం.. మధ్యలో సుప్రీం తీర్పుతో శశికళ ఊహలన్ని తలకిందులైపోవడం జరిగిపోయాయి.
చిన్నమ్మ లైఫ్ జర్నీ: సినిమాను మించిన మలుపులతో సీఎం దాకా..
ఒక్కసారి ఈ పరిణామాలన్నింటిని నిశితంగా పరిశీలిస్తే.. సీఎం కుర్చీపై ఫోకస్ చేసిన శశికళ తనపై ఉన్న అక్రమాస్తుల కేసును అంతగా పట్టించుకోలేదని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. అదే సమయంలో తిరుగుబాటు బావుటా ఎగరేసిన పన్నీర్ సెల్వంకు ఇదే అంశం కలిసొచ్చింది. అన్ని కలిసి రోజుకో మలుపు తిరిగిన తమిళ పాలిటిక్స్ ప్రస్తుతం సుప్రీం తీర్పు వద్ద స్థిరపడ్డాయి.
అమ్మ మరణంతో శశికళ రంగంలోకి:
అమ్మ చనిపోయిన తర్వాత నెల రోజుల పాటు పన్నీర్ సెల్వం సీఎంగా కొనసాగారు. ఆపై అధికారం కోసం అడుగులు వేసిన శశికళ.. తొలుత పార్టీ పగ్గాలను చేజిక్కించుకున్నారు.పార్టీ పగ్గాలు, ప్రభుత్వ పగ్గాలు ఒక్కరి వద్దే ఉండాలన్న పార్టీ సాంప్రదాయాన్ని ఆసరాగా చేసుకుని సీఎం కుర్చీ కోసం పావులు కదిపారు.ఇదే క్రమంలో శాసనసభాపక్ష నేతగా శశికళ ఎన్నికవడం.. ఆ తర్వాత సీఎం పదవికి పన్నీర్ సెల్వం రాజీనామా చేయడం జరిగిపోయాయి.
అనూహ్యంగా 'అక్రమాస్తుల కేసు'.. పన్నీర్ తిరుగుబాటు:
గతేడాది జూలై నుంచి ప్రస్తావనే లేని అక్రమాస్తుల కేసు అనూహ్యంగా తెరపైకి రావడం గమనార్హం. పన్నీర్ సెల్వంకు కూడా ఇదే కలిసొచ్చింది. ఫిబ్రవరి 6న అర్థరాత్రి అమ్మ సమాధి వద్దకు వెళ్లి మౌనదీక్ష చేసిన పన్నీర్ సెల్వం అక్కడినుంచే శశికళపై తిరుగుబాటు చేశారు.తన రెండు నెలల పాలనకు ప్రజల నుంచి మంచి స్పందన రావడం ఓర్వలేకనే శశికళ తనచేత బలవంతంగా రాజీనామా చేయించారని పన్నీర్ ఆరోపించారు. జయ మరణం వెనక శశికళ హస్తం ఉందని కూడా కూడా ఆరోపించారు.
గోల్డెన్ బే రిసార్టుకు ఎమ్మెల్యేలు, గవర్నర్ పై అసహనం:
పన్నీర్ తిరుగుబాటుతో తనకు మద్దతుగా ఉన్న ఎమ్మెల్యేలు జారిపోకుండా ఉండటానికి వారందరిని గోల్డెన్ బే రిసార్టుకు శశికళ తరలించారు. ఇదే క్రమంలో గవర్నర్ విద్యాసాగర్ రావుకు శశికళ రెండుసార్లు లేఖ రాయడం.. ఒకసారి నేరుగా కలవడం జరిగింది.ఎమ్మెల్యేల మద్దతుతో కూడిన పత్రాలను గవర్నర్ కు శశికళ సమర్పించగా.. అవి ఫోర్జరీనా? అసలైనవా? ధ్రువీకరించుకునేందుకు ఆయన గడువు కోరారు. గవర్నర్ జాప్యంతో మొత్తం వ్యవహారంలో బీజేపీ హస్తముందన్న ఆరోపణలు బలంగా వినిపించాయి.
చిన్నమ్మకు షాక్ ల మీద షాక్ లు:
క్రమక్రమంగా పన్నీర్ కు అటు ప్రజల్లో, ఇటు నేతల్లో భారీగా మద్దతు పెరగడం మొదలైంది.మరోవైపు పన్నీర్ సెల్వం తిరుగుబాటు నుంచి, ఎమ్మెల్యేలు జారిపోవడం లాంటి పరిణామాలతో చిన్నమ్మ శశికళకు అంతకంతకు షాక్ లు తగులుతూనే వచ్చాయి.ఫిబ్రవరి 11న తీవ్ర అసహనంతో శశికళ గవర్నర్ కు లేఖ రాయగా.. ఆయన నుంచి మాత్రం ఎలాంటి స్పందన రాలేదు.మెజారిటీ ఎంపీలు పన్నీర్ చెంతన చేరడంతో.. ఎమ్మెల్యేలను కాపాడుకోవడం కోసం శశికళే స్వయంగా గోల్డెన్ బే రిసార్టులో అడుగుపెట్టారు.అక్కడినుంచి రాష్ట్రపతి భవన్ కు వెళ్లి ఎమ్మెల్యేలతో పరేడ్ నిర్వహించి గవర్నర్ తీరుకు నిరసన తెలుపుతారని వార్తలు వచ్చాయి.
సుప్రీం తీర్పుతో మారిన సీన్:
మంగళవారం ఉదయం 10.30గం.కు శశికళ అక్రమాస్తుల కేసులో తుది తీర్పు వెలువరిస్తామని కోర్టు ప్రకటించడంతో మొత్తం సీన్ మారిపోయింది.క్షణం, క్షణం ఉత్కంఠతో గోల్డెన్ బే రిసార్టులో సోమవారం నిద్రలేని రాత్రి గడిపిన శశికళ.. సుప్రీం తీర్పుపై ఎమ్మెల్యేలతో మంతనాలు జరిపారు.తీర్పు అనుకూలంగా వస్తే ఏం చేయాలి? ప్రతికూలంగా వస్తే ఏం చేయాలి? వంటి అంశాలను ఎమ్మెల్యేలతో శశికళ చర్చించారు.సోమవారం సుప్రీంకోర్టు శశికళను దోషిగా ప్రకటించడంతో ఆమె ఆశలన్ని ఆవిరైపోయాయి. నాలుగేళ్ల పాటు జైలు శిక్ష విధిస్తూ నాలుగు వారాల్లోగా పోలీసుల ఎదుట లొంగిపోవాలని కోర్టు తీర్పు చెప్పింది.
తీర్పు తర్వాత గోల్డెన్ బే రిసార్టులో పరిణామాలు:
కోర్టు తీర్పుతో తీవ్ర ఆవేదనకు లోనైన శశికళ గోల్డెన్ బే రిసార్టులోనే అన్నాడీఎంకె నేతలకు దిశా నిర్దేశం చేయడం మొదలుపెట్టారు. తాను జైలుకు వెళ్లడం ఇక తప్పదు కాబట్టి.. పళనిస్వామి, సెంగొట్టయన్, తంబిదురైలలో ఒకరిని సీఎం అభ్యర్థిగా ప్రకటించాలనుకున్నారు.జయలలిత మేనల్లుడు దీపక్ ను ఆగమేఘాల మీద రిసార్టుకు పిలిపించడంతో సీఎం అభ్యర్థిగా దీపక్ ను ప్రకటిస్తారా? అన్న సందేహాలు తలెత్తాయి.పోలీసులు గోల్డెన్ బే రిసార్టును చుట్టుముట్టి పరిసర ప్రాంతాలను అదుపులోకి తీసుకున్నారు. 35 వాహనాల్లో ఎస్పీ, డీఎస్పీ స్థాయి పోలీసు అధికారులు, గోల్డెన్ బే రిసార్టును చుట్టుముట్టారు.
పన్నీర్ ఇంట సంబరం.. సీఎం అభ్యర్థిగా పళనిస్వామి
శశికళకు ప్రతికూలంగా సుప్రీం తీర్పు వెలువరించడంతో పన్నీర్ సెల్వం వర్గం ఆనందోత్సాహాలతో సంబరాలు జరుపుకోవడం మొదలుపెట్టారు. తాను సీఎం అవుతానన్న ధీమా పన్నీర్ లో ఉన్నా.. ఆయనకు మెజారిటీ ఎమ్మెల్యేల బలం లేదన్న వాదనలు బలంగా వినిపిస్తున్నాయి.మరోవైపు అన్నాడీఎంకెలో పన్నీర్ సెల్వంకు ఎట్టి పరిస్థితుల్లోను తావివ్వద్దని శశికళ నిర్ణయించుకున్నారు. ఇదే యోచనలో పళనిస్వామిని సీఎం అభ్యర్థిగా ప్రకటించారు.
గవర్నర్ నిర్ణయంపై ఉత్కంఠ
గవర్నర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది ఇంకా తేలాల్సి ఉంది. ప్రస్తుతం ఆయన ముందు ముందు రెండు ఆప్షన్లు కనిపిస్తున్నాయి. అందులో ఒకటి ఆపద్దర్మ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వంను బల నిరూపణకు ఆహ్వానించడం.. మరొకటి అసెంబ్లీని ఏర్పాటు చేసి సభలోనే సభా నాయకుడిని ఎన్నుకోమని సూచించడం..
శశికళ ప్రయాణం ఇలా మొదలైంది:
శశికళ తాత చంద్రశేఖరన్ పిళ్లై ఓ నాటు వైద్యుడు. తమిళనాడులోని రామనాథపురంలో నాటు వైద్యుడిగా మంచి పేరు తెచ్చుకున్నాడు. పరిస్థితుల రీత్యా తర్వాతి కాలంలో వారి కుటుంబం తంజావూరు వలస వెళ్లింది.నాటు వైద్యంతో వచ్చే డబ్బులతోనే కుటుంబ పోషణ కొనసాగేది. కాగా, చంద్రశేఖరన్ పిళ్లై కుమారుడు వివేకానందన్ ఇంగ్లిష్ మందుల దుకాణం నిర్వహించేవారు. దీంతో 'ఇంగ్లిష్ మందుల దుకాణం వాళ్లు' అని వీరి కుటుంబానికి పేరు పడిపోయింది. వివేకానందన్ కృష్ణవేణి దంపతులకు ఐదో సంతానంగా శశికళ జన్మించింది.
జయలలితతో స్నేహం ఇలా కుదిరింది:
చెన్నైలో ఓ వీడియో పార్లర్ నిర్వహించడంతో పాటు, ఐఏఎస్ చంద్రలేఖకు సహాయకురాలిగా ఉన్న సమయంలో శశికళకు జయలలితతో పరిచయం ఏర్పడింది. జయలలిత పొలిటికల్ యాక్టివిటీస్ కు సంబంధించిన కార్యక్రమాలను, స్పీచులను శశికళ రికార్డు చేసేవారు.
మేనల్లుడితో పోయెస్ గార్డెన్ లోకి శశికళ:
1987లొ ఎంజీఆర్ మరణం.. ఆ తర్వాత పార్టీలో జయలలిత అవమానాలు ఎదుర్కోవడం జరిగాయి. ఈ పరిణామాల నడుమ శశికళ జయకు అండగా నిలబడ్డారు. తర్వాతి కాలంలో పోయెస్ గార్డెన్ బాధ్యతలు చూసుకునేందుకు జయలలిత శశికళను తీసుకెళ్లారు. శశికళ వెంట ఆమె మేనల్లుడు సుధాకరణ్ కూడా పోయెస్ గార్డెన్ లో అడుగుపెట్టాడు. తర్వాతి రోజుల్లో జయలలిత సుధాకరణ్ ను దత్తత తీసుకున్నారు.
సుధాకరణ్ వివాహంతో వివాదం:
1996లో దత్త పుత్రుడు సుధాకరణ్ వివాహాన్ని జయలలిత అంగరంగ వైభవంగా జరిపించారు. అక్రమంగా కూడబెట్టిన డబ్బుతో ఈ పెళ్లిని ఘనంగా జరిపించారని ఆరోపణలు వెల్లువెత్తాయి. అనంతర పరిణామాలతో శశికళ అరెస్టవడం.. కొద్దిరోజులు ఆమెను జయలలిత దూరం పెట్టడం జరిగిపోయాయి.
గెంటేసి.. అక్కున చేర్చుకుని:
మన్నార్ గుడి మాఫియాతో కలిసి తెరవెనుక శశికళ కుట్ర చేశారని తెలుసుకున్న జయలలిత ఆమెను , ఆమె కుటుంబ సభ్యులను పోయెస్ గార్డెన్ నుంచి వెళ్లగొట్టారు. ఆ తర్వాత శశికళ ప్రాధేయపడుతూ జయలలితకు లేఖ రాయడంతో మళ్లీ ఆమెను అక్కున చేర్చుకున్నారు.ఇక అప్పటినుంచి అమ్మ మరణించేదాకా ఆమెతోనే ఉన్నారు శశికళ. అమ్మ మరణం తర్వాత తమిళ రాజకీయాలను శాసించాలని ఆశించిన శశికళ.. సుప్రీం తీర్పుతో భంగపడ్డారు. ఇక ఆమె జైలుకు వెళ్లడమే తరువాయి.