మహారాష్ట్రలో కర్ఫ్యూ- స్వస్ధలాలకు వలస కార్మికుల క్యూ- మళ్లీ మొదలైన వెతలు
మహారాష్ట్రలో విచ్చలవిడిగా పెరుగుతున్న కరోనా కేసుల ప్రభావం నేపథ్యంలో అక్కడి ఉద్ధవ్ థాక్రే ప్రభుత్వం 15 రోజుల పాటు జనతా కర్ఫ్యూ విధించింది. మే 1 వరకూ కర్ప్యూ అమల్లో ఉంటుందని ప్రకటించింది. అయితే కర్ఫ్యూకు బదులుగా లాక్డౌన్ ప్రకటన రావొచ్చన్న పుకార్లు వ్యాపించడంతో మొన్నటి నుంచే వలస కార్మికులు స్వస్దలాల బాట పట్టారు. అయితే కర్ఫ్యూ ప్రకటన మాత్రమే వచ్చినా పనుల్లేకుండా పోవడంతో చేసేది లేక వరుసగా స్వస్దలాలకు క్యూ కడుతున్నారు. మరికొద్ది రోజులు ఆగితే రవాణా సదుపాయం కూడా ఉండదన్న భయంతో వీరు ఎక్కువగా వలస బాట పడుతున్నారు.
కర్ఫ్యూ ప్రకటన తర్వాత భారీ సంఖ్యలో స్వస్ధలాలకు వెళ్లేందుకు తరలివచ్చిన వలస కార్మికులతో ముంబైలోని ఛత్రపతి శివాజీ టెర్మినస్ కిటకిటలాడుతోంది. దీంతో టికెట్లు లేని వారిని గుర్తించి రైల్వే పోలీసులు వెనక్కి పంపాల్సి వస్తోంది. వలస కార్మికుల డిమాండ్ దృష్ట్యా సెంట్రల్ రైల్వే, పశ్చిమ రైల్వే కూడా రోజువారీ ట్రైన్ల సంఖ్య పెంచుతున్నాయి. అయినా ప్రతీ ట్రైన్కూ దాదాపు 2 వేల వెయిటింగ్ లిస్ట్ ఉంటోందని చెప్తున్నారు. గతేడాది లాక్డౌన్ పరిస్దితుల అనుభవాలతోనే ఎక్కువమంది తిరుగుముఖం పడుతున్నట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం ముంబై నుంచి ఉత్తరాది రాష్ట్రాలకు రోజుకు పది రైళ్లు వెళ్తున్నాయి. వీటిలో ప్రతీ దాంట్లోనూ వెయ్యి నుంచి 1500 వెయిటింగ్ లిస్ట్ పేర్లు ఉంటున్నట్లు అదికారులు చెప్తున్నారు. దీంతో అదనపు రైళ్లు నడిపేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. వలస కార్మికుల్లో చాలా మంది రోడ్డు మార్గాల ద్వారా స్వస్దలాలకు వెళ్లేందుకు మొగ్గు చూపుతున్నారు. అయితే రోడ్డు ప్రయాణానికి దాదాపు 5 వేల వరకూ ఖర్చవుతోంది. దీంతో రైళ్లలో 1500 రూపాయలు వెచ్చించి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు.