సిడబ్ల్యూసి సభ్యుల రిజైన్? ప్రతిపక్ష నేతగా రాహుల్ నో
న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయానికి నైతిక బాధ్యత వహిస్తూ మూకుమ్మడి రాజీనామా చేసే యోచనలో కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీ సభ్యులు ఉన్నట్లుగా తెలుస్తోంది. సోమవారం సాయంత్రం నాలుగు గంటలకు సిడబ్ల్యూసి, ఏఐసిసి భేటీ కానుంది. ఈ భేటీలో సిడబ్ల్యూసి సభ్యులు తమ రాజీనామాలను సమర్పించే అవకాశం ఉందంటున్నారు.
ఈ సమావేశంలో ఎన్నికల ఫలితాలపై నేతలు సమీక్షించనున్నారు. ఎన్నికల్లో ఓటమికి సమిష్టి బాధ్యత వహించే దిశగా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ నిర్ణయం తీసుకోనున్నట్లుగా తెలుస్తోంది.
ఓటమికి గల కారణాల పైన వారు చర్చించనున్నారు. రాహుల్ గాంధీని తప్పుదోవ పట్టించిన వారందరి పైనా వేటు వేయనున్నారనే ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి. ఈ ఎన్నికల్లో కాంగ్రెసు పార్టీ కేవలం 44 స్థానాలను మాత్రమే గెలుచుకుంది. ప్రతిపక్ష హోదాను కూడా దక్కించుకోలేకపోయింది.
మరోవైపు కాంగ్రెస్ ఘోర వైఫల్యం, బిజెపి అనూహ్య విజయం నేపథ్యంలో లోకసభలో ప్రతిపక్ష నేతగా ఉండేందుకు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలు నిరాకరించినట్లుగా తెలుస్తోంది. ప్రతిపక్ష నేత రేసులో కమల్ నాథ్ ముందంజలో ఉన్నారని సమాచారం.