Delhi Assembly: ఢిల్లీలో మోగనున్న ఎన్నికల నగారా: కాస్సేపట్లో అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్..!
న్యూఢిల్లీ: దేశంలో మరోసారి ఎన్నికల నగారా మోగబోతోంది. గత ఏడాది చివరి నెలలో జార్ఖండ్ ఎన్నికలు మిగిల్చిన వేడి చల్లారక ముందే.. మరో రాష్ట్రం పోలింగ్ ముంగిట్లో నిలిచింది. అదే- ఢిల్లీ. దేశ రాజధానిలో అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ ను కేంద్ర ఎన్నికల కమిషన్ కాస్సేపట్లో ప్రకటించబోతోంది. సోమవారం ఈ మధ్యాహ్నం 3:30 గంటలకు కేంద్ర కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ కార్యాలయంలో విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు.
బీజేపీ వేలితో బీజేపీ కంటినే పొడిచే ప్రయత్నం: ఢిల్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ సరికొత్త వ్యూహం: !
బీజేపీని బండకేసి బాదిన కేజ్రీవాల్..
కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ సునీల్ అరోరా.. ఈ ఎన్నికల షెడ్యూల్ ను ప్రకటించబోతున్నారు. ప్రస్తుతం ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ అధికారంలో కొనసాగుతోంది. ఆ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. భారతీయ జనతా పార్టీకి కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేదు ఢిల్లీ అసెంబ్లీలో. 2015లో జరిగిన ఎన్నికల్లో బీజేపీ దారుణంగా పరాజయం పాలైంది. 70 స్థానాలు ఉన్న ఢిల్లీ అసెంబ్లీలో బీజేపీ కేవలం మూడంటే మూడు స్థానాలకు పరిమితమైంది.
చరిత్ర పునరావృతం కాకూడదనే పట్టుదల..
ఈ సారి చరిత్ర పునరావృతం కాకూడదనే పట్టుదలతో కనిపిస్తున్నారు కమలనాథులు. ఆమ్ ఆద్మీ పార్టీని కోలుకోలేని విధంగా దెబ్బ తీయడానికి పావులు కదుపుతోంది. గత ఏడాది జరిగిన లోక్ సభ ఎన్నికల్లో ఢిల్లీ పరిధిలోని ఏడు సీట్లనూ బీజేపీ కొల్లగొట్టింది. అదే తరహా ఫలితాలను అసెంబ్లీ ఎన్నికల్లోనూ పునరావృతం చేయడానికి బీజేపీ ఉవ్విళ్లూరుతోంది. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పెద్దలు ఢిల్లీ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటోంది.
ఆప్ లో ఊపు తెస్తోన్న జార్ఖండ్
మరోవంక- జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఆమ్ ఆద్మీ పార్టీలో ఉత్సాహాన్ని నింపుతున్నాయి. జార్ఖండ్ లో 14 లోక్ సభ స్థానాలకు 12 సీట్లను కైవసం చేసుకుని కూడా బీజేపీ దారుణంగా ఓడిపోయిందక్కడ. అదే తరహా ఫలితాలు ఢిల్లీలోనూ కనిపిస్తాయని అంచనా వేస్తోంది ఆమ్ ఆద్మీ పార్టీ. పైగా- పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఢిల్లీవాసులు గళమెత్తిన ప్రస్తుత పరిస్థితుల్లో.. ఎన్నికల వాతావరణం అంతా తమకు అనుకూలంగా ఉందనే ధీమాను వ్యక్తం చేస్తున్నారు ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు.
వరుసగా రెండోసారి.
ఢిల్లీలో వరుసగా రెండోసారి అధికారంలోకి వస్తామని ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల షెడ్యూల్ వెలువడుతుందనే విషయం తెలిసిన వెంటనే ఆయన స్పందించారు. దేశ రాజధానిలో ప్రస్తుతం నెలకొన్న రాజకీయ వాతావరణం తమ పార్టీకి అనుకూలంగా ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. `అచ్ఛే బీతే పాంచ్ సాల్.. లగేరహో కేజ్రీవాల్..` అనే నినాదంతో తాము ఎన్నికలకు వెళ్తున్నామని అన్నారు.