కేజ్రీ ఫైర్: అత్యాచార కేసుల్లో జువెనైల్ వయసు 15 ఏళ్లకు
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో అత్యాచారాల నివారణకు మొబైల్ ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేయనున్నట్లు సీఎం అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు. అంతేకాదు అత్యాచార కేసుల్లో జువెనైల్ వయస్సుని 15 ఏళ్లకు తగ్గించాలని సూచించారు. శుక్రవారం ఢిల్లీలో ఇద్దరు మైనర్ బాలికలపై అత్యాచారం జరిగిన సంగతి తెలిసిందే.
ఈ ఘటనకు సంబంధించి పోలీసులు ఇద్దరు టీనేజర్లను నిందితులుగా అదుపులోకి తీసుకున్నారు. దీనిపై సోమవారం
ఢిల్లీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ అత్యాచార ఘటనల్లో నిందితుల పట్ల కఠినంగా ఉండాలని అన్నారు.

ఇందులో భాగంగా నిందితుడిని జువెనైల్గా పరిగణించే వయస్సును 15ఏళ్లకు తగ్గించాలని కేజ్రీవాల్ కోరారు. అత్యాచారాలకు పాల్పడే వారికి తక్షణమే శిక్షలు అమలయ్యేలా చూడడం ద్వారా ఈ తరహా నేరాలు తగ్గే అవకాశం ఉందని అన్నారు. ఢిల్లీలో మహిళల భద్రత కోసం డిల్లీ న్యాయశాఖ మంత్రి మనీశ్ సిసోడియా నేతృత్వంలోని ఓ కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు.
ఈ కమిటీ మహిళల భద్రత అంశంపై కృషి చేయనున్నట్లు చెప్పారు. ఈ కమిటీ 15 రోజుల్లోగా ప్రభుత్వానికి నివేదిక అందజేస్తుందని చెప్పారు. దేశ రాజధానిలో మహిళలపై అత్యాచారాలు పెరగడానికి నేరగాళ్లు చట్టానికి భయపడకపోడవమేనని చెప్పుకొచ్చారు.
ఢిల్లీలో జరుగుతున్న అత్యాచార ఘటనలపట్ల కేజ్రీవాల్ తీవ్రంగా స్పందించారు. రేపిస్టులకు తెలుసు తమను ఏమీ చేయలేరని అన్నారు. చెడ్డవారంతా ఢిల్లీలోనే ఉన్నారని అనుకోవడం లేదన్నారు. అలాగే కోల్ కతా, న్యూయార్క్, లండన్, వారణాసీలలో నివసించే వారంతా సాధువులని తాను భావించడం లేదన్నారు.
ఫాస్ట్ ట్రాక్ కోర్టుల విషయంలో ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సలహాను తీసుకోనున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో మరిన్ని ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ఏర్పాటుకు కావలసిన నిధులను ఢిల్లీ ప్రభుత్వం మంజూరు చేస్తుందని తెలిపారు.
ఢిల్లీలో జరుగుతున్న అత్యాచారాలపై ప్రధాని నరేంద్ర మోడీ నైతిక బాధ్యత వహించాలంటూ ఆదివారం అరవింద్ కేజ్రీవాల్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తిన సంగతి తెలిసిందే. ఆదివారం ఆయన మాట్లాడుతూ పోలీసులు సరైన భద్రత కల్పించడం లేదని.. ప్రధాని, లెఫ్టినెంట్ గవర్నర్ ఏంచేస్తున్నారని ఆయన ప్రశ్నించారు.












Click it and Unblock the Notifications