ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఎంత ఆస్తిని కూడబెట్టారో తెలుసా?
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మనీ లాండరింగ్ కేసులో అరెస్ట్ అయి జ్యుడిషియల్ కస్టడీలో ఉన్న విషయం తెలిసిందే. ఆయన్ని తిహార్ జైలుకు తరలించారు. ఈ సమయంలో కేజ్రీవాల్ కు సంబంధించిన ప్రతి వార్త సోషల్ మీడియాలో వైరలవుతోంది. తిహార జైలులో ఆయనకు ఎటువంటి సదుపాయాలు కల్పిస్తున్నారు? అడిగిన పుస్తకాలు ఇచ్చారా? తదితర విషయాలపై నెటిజన్లు ఆరా తీస్తున్నారు. ఇదేకోవలో ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కు ఎంత ఆస్తి ఉందనే విషయం కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
2020 అసెంబ్లీ ఎన్నికల సమయంలో అఫిడవిట్ లో అరవింద్ తన ఆస్తుల వివరాలను పొందుపరిచారు. తనదగ్గర మొత్తం రూ. 3,44,42,870 ఆస్తులు ఉన్నట్లు ఆ సమయంలో అరవింద్ వెల్లడించారు. 1989లో ఐఐటీ ఖరగ్పూర్లో బీటెక్ (మెకానికల్ ఇంజినీరింగ్) చదివిన కేజ్రీవాల్ తన దగ్గర రూ.9,95,741 విలువైన చరాస్తులు ఉన్నట్లు తెలిపారు. భార్య సునీత కేజ్రీవాల్ పేరుమీద రూ.57,07,791 లక్షల విలువైన చరాస్తులు ఉన్నాయి.

ఎన్నికల అఫిడవిట్ ప్రకారం కేజ్రీవాల్ దగ్గర రూ. 1,77,00,000 కోట్ల స్థిరాస్తులు, సునీతకు రూ. 1,00,00,000 కోట్ల స్థిరాస్తులు ఉన్నాయి. ఘజియాబాద్లోని ఇందిరాపురంలో కేజ్రీవాల్ పేరుతో 2400 చదరపు అడుగుల భూమి, హర్యానాలో 6750 చదరపు అడుగుల భూమి ఉంది. గురుగ్రామ్ లో సునీత పేరుమీద 2244 చదరపు అడుగుల రెసిడెన్షియల్ ఆస్తి ఉంది.
కేజ్రీవాల్కు సొంతంగా కారు లేదు. సునీతకు మారుతి బాలెనో ఉంది. దీని ధర రూ.6,20,000. సునీతకు 320 గ్రాముల బంగారు ఆభరణాలు, కేజీ వెండి ఉన్నాయి. అత్యధిక జీతం తీసుకునే సీఎంలలో అరవింద్ ఒకరు. ఆయన నెలకు రూ.1.70 లక్షల జీతం తీసుకుంటారు. సంవత్సరాదాయం రూ.2.04 కోట్లు. అంతేకాకుండా అనేక సౌకర్యాలు, మినహాయింపులు ఉన్నాయి.












Click it and Unblock the Notifications