అరవింద్ కేజ్రీవాల్ ఇంట్లో సీసీ కెమెరాల పుటేజీ స్వాధీనం, పోలీసుల తీరుపై ఆప్ మండిపాటు
న్యూఢిల్లీ: ఆప్ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఇంటి నుండి సుమారు 21 సీసీ కెమెరాల పుటేజీని ఢిల్లీ పోలీసులు శుక్రవారం నాడు స్వాధీనం చేసుకొన్నారు. ఢిల్లీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అన్షు ప్రకాష్పై దాడికి సంబంధించిన విచారణలో భాగంగా పోలీసులు సీసీ కెమెరాల పుటేజీని స్వాథీనం చేసుకొన్నారు.
ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ నివాసంలో రెండు రోజుల క్రితం ఢిల్లీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అన్షు ప్రకాష్పై దాడి జరిగింది.ఈ దాడిపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఇందులో భాగంగానే పోలీసులు శుక్రవారం నాడు కేజ్రీవాల్ ఇంట్లోని సీసీ కెమెరాల పుటేజీని స్వాధీనం చేసుకొన్నారు.
తన ఇంట్లో సోదాలు చేయడం కాదని, బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ను లోయా కేసులో ప్రశ్నించాలని ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ పోలీసులను డిమాండ్ చేశారు.ఆమ్ ఆద్మీ పార్టీ సీనియర్ నేతలు అశుతోష్, సంజయ్ సింగ్ పోలీసుల తీరుపై మండిపడ్డారు.
తమ పార్టీ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు బిజెపి ప్రయత్నిస్తోందని ఆప్ ఆరోపణలు చేసింది. ఢిల్లీ పోలీసులు కావాలనే అరవింద్ కేజ్రీవాల్ సలహాదారుపై ఒత్తిడి తీసుకొచ్చి ఆ రోజు దాడి ఘటనకు సంబంధించి వారికి అనుకూలంగా మార్చి ప్రకటన చేయించుకుంటున్నారని మండిపడ్డారు.
మరో వైపు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిపై దాడిని నిరసిస్తూ కేంద్ర హోంమంత్రిత్వశాఖ, పిఎంఓ అధికారులను కలిసి ఆప్ ఎమ్మెల్యేపై చర్య తీసుకోవాలని డిమాండ్ చేయనున్నారు.మరో వైపు ఆప్ మంత్రులు ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ కలవాలని భావిస్తోంది.ఈ మేరకు లెఫ్టినెంట్ గవర్నర్ అపాయింట్ మెంట్ కోరింది.