Cloud Seeding: ఢిల్లీలో రెండు రోజులు కృత్రిమవర్షం-ఐఐటీ కాన్పూర్ ప్రతిపాదన
దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం అంతకంతకూ పెరిగిపోతోంది. ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా కాలుష్యం తగ్గే పరిస్ధితులు కనిపించడం లేదు. ఇప్పటికే వాహనాల సరిబేసి విధానం, డీజిల్ వాహనాల నిషేధం, పొరుగు రాష్ట్రాల టాక్సీల నిషేధం వంటి చర్యలు చేపడుతున్నా ప్రయోజనం అంతంత మాత్రంగానే ఉంటోంది. దీంతో ఈసారి కాన్పూర్ ఐఐటీ సాయంతో మరో కొత్త ప్రయోగం చేపట్టేందుకు ఢిల్లీ సర్కార్ సిద్ధమవుతోంది.
ఢిల్లీ పర్యావరణ మంత్రి గోపాల్ రాయ్ ఇవాళ ఐఐటీ కాన్పూర్ బృందంతో సమావేశమయ్యారు. రాజధాని నగరంలో గాలి నాణ్యత సూచీ (ఏక్యూఐ)ని తగ్గించేందుకు క్లౌడ్ సీడింగ్ ద్వారా కృత్రిమ వర్షాలు కురిసే అవకాశాలపై చర్చించారు. ఈ సమావేశం అనంతరం మంత్రి గోపాల్ రాయ్ మాట్లాడుతూ.. నవంబర్ 20-21 తేదీల్లో ఢిల్లీలో వాతావరణం మేఘావృతమై ఉంటే కృత్రిమ వర్షం కురిపించవచ్చని తెలిపారు.

ఢిల్లీలో నెలకొన్న కాలుష్య పరిస్థితుల నేపథ్యంలో క్లౌడ్ సీడింగ్ అంటే కృత్రిమ వర్షం కురిపించే అవకాశం గురించి ఇవాళ కాన్పూర్ ఐఐటీ బృందంతో సమావేశం జరిగిందని, ఈ ప్రతిపాదనను ఐఐటీ కాన్పూర్ ఆ సమావేశంలో సమర్పించిందని మంత్రి తెలిపారు. ఈ రోజు సమావేశంలో వారు సమర్పించిన ప్రతిపాదనను ప్రభుత్వానికి రేపు వివరంగా ఇస్తారని, రేపు వారి ప్రతిపాదనను అందజేస్తే, తాము దీనిని సుప్రీంకోర్టు ముందు సమర్పిస్తామన్నారు.

ఢిల్లీలో కాలుష్య నియంత్రణకు ఎలాంటి చర్యలైనా తీసుకోవాలని సుప్రీంకోర్టు తాజాగా ఢిల్లీ, పంజాబ్, చుట్టుపక్కల రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించింది. దీంతో ఇప్పటికే రైతులు పంట వ్యర్ధాలు తగులబెట్టడాన్ని నియంత్రిస్తున్న ఆయా రాష్ట్రాలు ఇప్పుడు క్లౌడ్ సీడింగ్ పద్ధతిలో కృత్రిమ వర్షాలు కురిపిస్తే ప్రయోజనం ఉంటుందన్న ఐఐటీ కాన్పూర్ ప్రతిపాదనను సైతం సుప్రీంకోర్టుకు సమర్పించేందుకు సిద్ధమవుతున్నాయి.












Click it and Unblock the Notifications