ఢిల్లీ లిక్కర్ స్కామ్లో సీబీఐ ఛార్జ్షీట్ - ఆ ఏడుమంది ఎవరు? తెలంగాణలో డొంక కదులుతోందా?
హైదరాబాద్: దేశవ్యాప్తంగా ప్రకంపనలను సృష్టిస్తోన్న ఢిల్లీ మద్యం కుంభకోణం మరో కీలక మలుపు తిరిగింది. ఈ కేసులో విచారణ కొనసాగిస్తోన్న కేంద్రీయ దర్యాప్తు సంస్థ సీబీఐ ఇవ్వాళ ఛార్జ్షీట్ను ఫైల్ చేసింది. ఈ ఛార్జ్షీట్లో మొత్తం ఏడుమంది పేర్లను నమోదు చేసింది. ఈ మేరకు దేశ రాజధానిలోని రోజ్ అవెన్యూ న్యాయస్థానానికి ఈ ఛార్జ్షీట్ను అందజేశారు సీబీఐ అధికారులు. దీన్ని విచారణకు స్వీకరించింది కోర్టు.
బోయిన్పల్లి అభిషేక్ రావు, విజయ్ నాయర్ సహా మరో అయిదుమంది పేర్లు ఇందులో ఉన్నాయి. ఆ అయిదు మంది ఎవరనేది ఇప్పుడు చర్చనీయాంశమౌతోంది. అభిషేక్ రావు, విజయ్ నాయర్లను ఇదివరకే సీబీఐ అధికారులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. కోట్ల రూపాయల మేర చేతులు మారినట్లు సమాచారం అందిన నేపథ్యంలో- ఈ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు కూడా జోక్యం చేసుకున్నారు.
ఆర్థిక నేరాలను నివారించడానికి ఏర్పాటైన ఈ దర్యాప్తు సంస్థ- తాజాగా బోయిన్పల్లి అభిషేక్ రావు, విజయ్ నాయర్ను అరెస్ట్ చేసింది. ఢిల్లీ మద్యం పాలసీ విధానం రూపకల్పనలో- హైదరాబాద్కు చెందిన బోయిన్పల్లి అభిషేక్ దక్షిణాదికి చెందిన లిక్కర్ బరూన్తో లాబీయింగ్ నిర్వహించారనే ఆరోపణలను ఎదుర్కొంటోన్నారు. ఈ విషయాన్ని సీబీఐ తన ఛార్జ్షీట్లో పొందుపరిచింది. సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం న్యాయమూర్తి జస్టిస్ ఎం కే నాగ్పాల్ సమక్షంలో ఛార్జ్షీట్ను రూపొందించింది.
ఇక విజయ్ నాయర్.. మాజీ ఈవెంట్ మేనేజర్. గతంలో ఆయన ఓ ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీకి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా పని చేశారు. అనంతరం ఢిల్లీలో అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీతో అసోసియేట్ అయ్యారు. ఆ పార్టీ కమ్యూనికేషన్ ఇన్ఛార్జ్గా ఉన్నారు. ఇదివరకు ఇదే కేసులో ప్రముఖ లిక్కర్ కంపెనీ ఇండోస్పిరిట్ ప్రమోటర్ సమీర్ మహంద్రు, జనరల్ మేనేజర్ పెర్నోడ్ రికర్డ్, బినోయ్ బాబు, అరబిందో ఫార్మా హోల్ టైమ్ డైరెక్టర్, ప్రమోటర్ పీ శరత్ చంద్రారెడ్డి అరెస్ట్ అయ్యారు.
సీబీఐ తాజాగా ఛార్జ్షీట్లో పొందుపరిచిన మిగిలిన అయిదుమంది పేర్లతో తెలంగాణలో రాజకీయ ప్రకంపనలకు కారణమౌతుందనే ప్రచారం సాగుతోంది. ఈ ఛార్జ్షీట్తో తెలంగాణలో డొంక కదులుతుందనే అభిప్రాయాలు వ్యక్తమౌతోన్నాయి. బోయిన్పల్లి అభిషేక్ రావు తెలంగాణకు చెందిన వ్యాపారవేత్తే కావడం వల్ల ఆయనతో కాంట్రాక్ట్స్ ఉన్న వారు ఇబ్బందులను ఎదుర్కొనవచ్చనే అంచనాలు ఉన్నాయి.