ఢిల్లీ అల్లర్లు: పెరుగుతున్న మరణాలు, 53కు చేరిక, 654 కేసులు నమోదు, 1820 మంది అరెస్ట్
న్యూఢిల్లీ: దేశ రాజధానిలోని ఈశాన్యఢిల్లీలో గత వారం చోటు చేసుకున్న అల్లర్లలో మృతి చెందినవారి సంఖ్య పెరుగుతూనే ఉంది. అల్లర్లలో తీవ్రంగా గాయపడి ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నవారు ప్రాణాలు కోల్పోతుండటంతో మరణాల సంఖ్య తాజాగా 53కు చేరింది. 2013లో ముజఫర్నగర్లో జరిగిన అల్లర్లలో 63 మంది మృతి చెందగా.. ఆ తర్వాత ఢిల్లీలోని అల్లర్లలోనే అత్యధిక మరణాలు చోటు చేసుకున్నాయి.
తాజాగా వచ్చిన సమాచారం ప్రకారం.. తేగ్ బహదూర్(జీటీబీ) ఆస్పత్రిలో 44 మంది ప్రాణాలు కోల్పోగా, రామ్ మనోహర్ లోహియా ఆస్పత్రిలో ఐదుగురు, లోక్ నాయక్ ఆస్పత్రిలో ముగ్గురు, జగ్ ప్రవేశ్ చంద్ర ఆస్పత్రిలో ఒకరు ప్రాణాలు కోల్పోయారు. అయితే, అధికారులు మాత్రం ఇప్పటి వరకు 44 మంది చనిపోయారని అధికారికంగా ప్రకటించారు. తాజా మరణాలపై ప్రకటన చేయాల్సి ఉంది.

ఎల్ఎన్జేపీ ఆస్పత్రిలో ముగ్గురు, ఆర్ఎంఎల్ ఆస్పత్రిలో ఐదుగురి మృతదేహాలు లభ్యమయ్యాయని, అయితే, అవి ఢిల్లీ అల్లర్లకు సంబంధించినవో కాదో తెలియదని అధికారులు చెబుతున్నారు. ఇప్పటి వరకు 44 మంది మృతి చెందారని ప్రకటించాం.. ఢిల్లీ పోలీసుల నుంచి మరింత సమాచారం వచ్చిన తర్వాత ప్రకటిస్తామని ఢిల్లీ డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ శశి కౌశల్ తెలిపారు. ఢిల్లీ అల్లర్లలో 250 మందికిపైగా గాయాలపాలైన విషయం తెలిసిందే.
కాగా, అల్లర్లకు సంబంధించి ఇప్పటి వరకు 654 కేసులు నమోదయ్యాయని, 1,820 మందిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. 47 కేసులను ఆయుధాల చట్టం కింద వేర్వేరు పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయని వెల్లడించారు. ఢిల్లీ అల్లర్లలో ఓ పోలీసు కానిస్టేబుల్ తోపాటు ఓ ఐబి అధికారి కూడా హత్యకు గురైన విషయం తెలిసిందే.
తాజాగా, పోలీసులపై ఓ వర్గం సమూహంగా వచ్చి దాడికి పాల్పడిన వీడియోను కపిల్ మిశ్రా తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేశారు. బుధవారం కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పలువురు ఎంపీలు, నేతలతో కలిసి అల్లర్లు జరిగిన ప్రాంతంలో పర్యటించారు. ద్వేషం, హింస అభివృద్ధికి మేలు చేయవని ఆయన ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు.












Click it and Unblock the Notifications