కొత్త మంత్రులు వీళ్లే- పాపం ఫిరాయింపుదారుడు..
Chandrababu: ఢిల్లీ కొత్త ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారోత్సవానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ మధ్యాహ్నం 12:35 నిమిషాలకు రామ్లీలా మైదాన్లో కొత్త ప్రభుత్వం కొలువుదీరనుంది. ముఖ్యమంత్రి, మంత్రులూ ప్రమాణం స్వీకారం చేయనున్నారు. లెప్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా వారితో ప్రమాణ స్వీకారం చేయిస్తారు.
కొత్త ముఖ్యమంత్రిగా రేఖా గుప్తా ఎన్నికైన విషయం తెలిసిందే. బీజేపీ శాసనసభా పక్షం ఆమెను తమ అధినాయకురాలిగా ఎన్నుకుంది. కేంద్ర పరిశీలకులు రవిశంకర్ ప్రసాద్, ఓం ప్రకాష్ ధన్కర్ సమక్షంలో ఈ ఎన్నిక ప్రక్రియ పూర్తయింది. ఆ వెంటనే ఆమె లెప్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనాను కలిశారు. తనకు మద్దతు ఇస్తోన్న శాసన సభ్యుల సంతకాలతో కూడిన లేఖను అందజేశారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఆహ్వానించాలంటూ విజ్ఞప్తి చేశారు.

దీనితో కొత్త ముఖ్యమంత్రి, మంత్రుల ప్రమాణ స్వీకారోత్సవానికి సంబంధించిన గెజిట్ నోటిఫికేషన్ను ఢిల్లీ రాజ్ నివాస్ విడుదల చేసింది. రేఖా గుప్తాతో పాటు మరో ఆరుమంది- మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. పర్వేష్ సాహిబ్ సింగ్ వర్మ, ఆతిష్ సూద్, మన్జీందర్ సింగ్ సిర్సా, రవీందర్ ఇంద్రజ్ సింగ్, కపిల్ మిశ్రా, పంకజ్ కుమార్ సింగ్.. మంత్రులుగా ప్రమాణం చేస్తారు.
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు కొద్ది రోజుల ముందు పార్టీ ఫిరాయించిన ఆమ్ ఆద్మీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి కైలాష్ గెహ్లాట్కు భారతీయ జనతా పార్టీ అగ్రనాయకత్వం మొండిచెయ్యి చూపింది. ఆయనను కేబినెట్లో తీసుకుంటాంటూ మొదట్లో ప్రచారం జరిగినప్పటికీ- తుది జాబితాలో చోటు దక్కలేదు.
అధికారికంలోకి వస్తే కొత్త ప్రభుత్వ మంత్రివర్గంలోకి తీసుకుంటామనే హామీని బీజేపీ అగ్ర నాయకత్వం ఇవ్వడం వల్లే కైలాష్ గెహ్లాట్ పార్టీ ఫిరాయించారనే ప్రచారం జరుగుతోంది. తీరా తుది జాబితాలో పేరు లేకపోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఆయనకు కేబినెట్ హోదాలో మరో పోస్ట్ ఇవ్వొచ్చని అంటున్నారు.
ఈ కార్యక్రమానికి హాజరు కావాలంటూ బీజేపీ, ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఇదివరకే ఆహ్వానం అందింది. కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏలో భాగస్వామ్య పార్టీలు అయినందున తెలుగుదేశం, జనసేన పార్టీల అధ్యక్షులు, ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు, పవన్ కల్యాణ్ ఇందులో పాల్గొననున్నారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, పలువురు కేంద్రమంత్రులు, ఉత్తరప్రదేశ్, హర్యానా, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, బిహార్ ముఖ్యమంత్రులు దీనికి హాజరు కానున్నారు. బాలీవుడ్ సెలెబ్రిటీలు అక్షయ్ కుమార్, వివేక్ ఒబెరాయ్, ఎంపీ హేమామాలిని, కిరణ్ ఖేర్ దీనికి హాజరు కానున్నారు. ప్రమాణ స్వీకారోత్సవ ఏర్పాట్లు పూర్తయ్యాయి.












Click it and Unblock the Notifications