మహిళల పథకం అమలుకు ముహూర్తం ఖరార్: ప్రతి నెలా అకౌంట్లో జమ
Rekha Gupta: ఢిల్లీ కొత్త ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారోత్సవానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ మధ్యాహ్నం 12:35 నిమిషాలకు రామ్లీలా మైదాన్లో కొత్త ప్రభుత్వం కొలువుదీరనుంది. ముఖ్యమంత్రి, మంత్రులూ ప్రమాణం స్వీకారం చేయనున్నారు. లెప్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా వారితో ప్రమాణ స్వీకారం చేయిస్తారు.
కొత్త ముఖ్యమంత్రిగా రేఖా గుప్తా ఎన్నికైన విషయం తెలిసిందే. బీజేపీ శాసనసభా పక్షం ఆమెను తమ అధినాయకురాలిగా ఎన్నుకుంది. కేంద్ర పరిశీలకులు రవిశంకర్ ప్రసాద్, ఓం ప్రకాష్ ధన్కర్ సమక్షంలో ఈ ఎన్నిక ప్రక్రియ పూర్తయింది. ఆ వెంటనే ఆమె లెప్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనాను కలిశారు.

తనకు మద్దతు ఇస్తోన్న శాసన సభ్యుల సంతకాలతో కూడిన లేఖను అందజేశారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఆహ్వానించాలంటూ విజ్ఞప్తి చేశారు. దీనితో కొత్త ముఖ్యమంత్రి, మంత్రుల ప్రమాణ స్వీకారోత్సవానికి సంబంధించిన గెజిట్ నోటిఫికేషన్ను ఢిల్లీ రాజ్ నివాస్ విడుదల చేసింది.
రేఖా గుప్తాతో పాటు మరో ఆరుమంది- మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. పర్వేష్ సాహిబ్ సింగ్ వర్మ, ఆతిష్ సూద్, మన్జీందర్ సింగ్ సిర్సా, రవీందర్ ఇంద్రజ్ సింగ్, కపిల్ మిశ్రా, పంకజ్ కుమార్ సింగ్.. మంత్రులుగా ప్రమాణం చేస్తారు. ఈ నేపథ్యంలో వాళ్లంతా ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తోన్నారు.

కొద్దిసేపటి కిందటే రేఖా గుప్తా విలేకరులతో మాట్లాడారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని మార్చి 8వ తేదీన ఢిల్లీలోని అర్హులైన ప్రతి మహిళకూ 2,500 రూపాయలను అందజేసే పథకాన్ని అమలు చేస్తామని ప్రకటించారు. ప్రమాణ స్వీకారం చేసిన తరువాత దీనికి సంబంధించిన తొలి ఫైలుపై సంతకం చేస్తానని అన్నారు.
ప్రతినెలా 2,500 రూపాయల మొత్తాన్ని అర్హులైన ప్రతి మహిళ బ్యాంక్ అకౌంట్లో జమ చేస్తామని రేఖా గుప్తా తెలిపారు. కొత్త మంత్రివర్గం తొలి సమావేశంలో దీనికి సంబంధించిన ప్రతిపాదనలను ఆమోదిస్తామని అన్నారు. అలాగే- ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తామని, వాటికే తొలి ప్రాధాన్యత ఉంటుందనీ స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications