పాక్ వారసత్వ బలహీనత అదే! : ముషారఫ్ సంచలన కామెంట్స్
వాషింగ్టన్ : ప్రజాస్వామ్య ప్రభుత్వాల కన్నా మిలటరీనే పాక్ ప్రజలు ఎక్కువగా విశ్వసిస్తారని పాక్ మాజీ అధ్యక్షడు పర్వేజ్ ముషారఫ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అసలు పాక్ లో ఉన్న పరిస్థితుల రీత్యా అక్కడ ప్రజాస్వామ్య విధానాలు సరికావని, అందుకే దేశ వ్యవహారాల్లో ఆర్మీనే కీలక పాత్ర పోషిస్తోందని వ్యాఖ్యానించారు.
ప్రజాస్వామ్య ప్రభుత్వాల పేరుతో పాక్ ను ఏలినవారు సరిగా పనిచేయకపోయినందువల్లనే వారిపై పాక్ ప్రజలు విశ్వసనీయత కోల్పోయారని అన్నారు. ఈ కారణంగానే దేశ వ్యవహారాల్లోను ప్రజాస్వామ్య ప్రభుత్వాల పాత్ర కన్నా ఆర్మీ పాత్రనే కీలకంగా మారిందని చెప్పారు. దేశంలో నెలకొన్న పరిస్థితులకు అనుగుణంగా ప్రజాస్వామ్యం ఏర్పడకపోవడం పాక్ కు ఉన్న 'వారసత్వ బలహీనత'గా పేర్కొన్నారు ముషారఫ్.

సమస్యల పరిష్కారం విషయంలోను ప్రభుత్వాల కన్నా సైన్యంపైనే పాక్ ప్రజలకు నమ్మకముందన్నారు. కేవలం ప్రజాస్వామ్య ప్రభుత్వాల విఫలమే ఈ పరిస్థితికి దారితీసిందని తెలిపారు. సైనిక తిరుగుబాటు చర్యలను సమర్థిస్తూ.. పాక్ ప్రజలు ఆర్మీ నుంచి చాలా ఆశిస్తారని చెప్పుకొచ్చారు. పాక్ ఆర్మీతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ.. సుమారు 40ఏళ్ల పాటు పాక్ సైన్యంతో తన అనుబంధం కొనసాగిందని, పాక్ ఆర్మీ తనకు మద్దతునివ్వడం పట్ల తాను గర్వపడుతానని చెప్పారు.
దేశంలో రాజకీయ వ్యవస్థను మార్చాల్సిన అవసరముందని చెప్పుకొచ్చిన ముషారఫ్.. సైన్యమే రాజ్యాంగం అని తాను విశ్వసిస్తానని ఓ ప్రశ్నకు బదులుగా ముషారఫ్ సమాధానమివ్వడం గమనార్హం.












Click it and Unblock the Notifications