మోడీ ప్రభుత్వంపై మరోసారి మన్మోహన్ ఆగ్రహం
నోట్ల రద్దు విషయమై మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మరోసారి నరేంద్ర మోడీ ప్రభుత్వం పైన ఆగ్రహం వ్యక్తం చేశారు.
న్యూఢిల్లీ: నోట్ల రద్దు విషయమై మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మరోసారి నరేంద్ర మోడీ ప్రభుత్వం పైన ఆగ్రహం వ్యక్తం చేశారు. కొద్ది రోజుల క్రితం రాజ్యసభలో ఆయన నోట్ల రద్దుపై కేంద్రాన్ని నిలదీశారు. తాజాగా, సోమవారం పంజాబ్ కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదల సందర్భంగా ధ్వజమెత్తారు.
అదే కీలకం
నోట్ల రద్దు వల్ల దేశ స్థూల జాతీయ ఉత్పత్తి పైన తీవ్ర ప్రతికాల ప్రభావం పడనుందని, త్వరలో జరగనున్న అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లోను నోట్ల రద్దు అంశమే కీలకం కాబోతుందని మన్మోహన్ సింగ్ వ్యాఖ్యానించారు.
జీడీపీపై ప్రభావం
రూ.500, రూ.1000 నోట్ల రద్దు నిర్ణయంతో దేశ జీడీపీ గణనీయంగా వెనుకబాటు పట్టిందన్నారు. ఇదే విషయాన్ని తాను పార్లమెంటులోను చెప్పానని అన్నారు. ఎన్నికలు జరిగే పంజాబ్, ఇతర నాలుగు రాష్ట్రాలలోను నోట్ల రద్దు కీలక అంశం కానుందన్నారు.
పదేళ్లుగా అసమర్థ పాలన
పంజాబ్ రాష్ట్రం గత పదేళ్లుగా అకాలీదళ్ - బీజేపీ ప్రభుత్వ అసమర్థ పాలనతో అన్ని విధాలుగా నష్టపోయిందని విమర్శించారు. కాంగ్రెస్ ముఖ్యమంత్రి అభ్యర్థి అమరీందర్ సింగ్ దూరదృష్టి కలిగిన వారు అని చెప్పారు.
ఎన్నికల కమిషన్
కాగా, రాబోయే అయిదు రాష్ట్రాల ఎన్నికల్లో నల్లధనానికీ, ఇతరత్రా ప్రలోభాలకు అడ్డుకట్ట వేయాలని ఎన్నికల సంఘం(ఈసీ) 200 మంది వ్యయపరిశీలకులకు స్పష్టం చేసింది. ఇలాంటి వ్యవహారాలపై గట్టి నిఘా ఉంచాలని తెలిపింది. ప్రధాన ఎన్నికల కమిషనర్ నసీంజైదీ, కమిషనర్లు ఏకేజోతి, ఓపీరావత్లు పరిశీలకును ఉద్దేశించి మాట్లాడారు.