Delhi Elections 2020: వివాదాస్పద వ్యాఖ్యలే కమలం కొంప ముంచిందా..? హేవ్ ఎ లుక్..!
ఢిల్లీ ఎన్నికల ఫలితాలు వచ్చేశాయి. కేజ్రీవాల్ మూడోసారి ఢిల్లీ సీఎంగా బాధ్యతలు చేపట్టేందుకు సిద్దమవుతున్నారు. ఎగ్జిట్ పోల్స్ అంచనాలు నిజమయ్యాయి. కేంద్రంలో బీజేపీ రెండో సారి అధికారంలోకి వచ్చాక ఆయా రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి వరుస ఓటములు ఎదురవుతున్నాయి. గతేడాది జరిగిన ఎన్నికల ఫలితాలు ఒక ఎత్తు అయితే ఈ ఏడాది ఢిల్లీ ఎన్నికల ఫలితాలు మరో ఎత్తు. ఈ ఓటమిని బీజేపీ జీర్ణించుకోలేపోతోంది. కేజ్రీవాల్ను ఎలాగైనా దెబ్బకొట్టాలన్న ఉద్దేశంతో పావులు కదిపి భంగపాటుకు గురైంది. అయితే బీజేపీ ఓటమికి ప్రధాన కారణమేంటి విశ్లేషకులు చెబుతున్నదేమిటి..?
బీజేపీ నేతల విమర్శలే శాపంగా మారాయా..?
ఢిల్లీ ఎన్నికల్లో కేజ్రీవాల్ మరోసారి సత్తా చాటారు. దీంతో బీజేపీ మరోసారి అధికారానికి దూరమైంది. ఢిల్లీలో మొదటి నుంచి కేజ్రీవాల్పై యుద్ధమే అన్నట్లుగా బీజేపీ వ్యవహరించింది. కేజ్రీవాల్ కూడా తన పరిమితుల్లోనే ఆ యుద్ధాన్ని ఎదుర్కొన్నారు. ఇక తాజాగా జరిగిన ఎన్నికల్లో బీజేపీకి ప్రస్తుత పరిస్థితుల్లో ఇది షాక్ అనే చెప్పాలి. ఇక ఎన్నికల షెడ్యూల్ విడుదలైనప్పటి నుంచే బీజేపీ కేజ్రీవాల్ సర్కార్పై విమర్శలు ఎక్కు పెట్టింది. ఇక పచ్చిగా చెప్పాలంటే కమలనాథులు చేసిన విమర్శలే వారి ఓటమికి కారణమైందని పలువురు అనలిస్టులు అభిప్రాయపడుతున్నారు.
షాహీన్బాగ్, జామియా, జేఎన్యూ వివాదం
ప్రస్తుతం దేశవ్యాప్తంగా పౌరసత్వ సవరణ చట్టంకు వ్యతిరేకంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఇక దేశ రాజధానిలో సీఏఏకు వ్యతిరేకంగా షాహీన్బాగ్, జామియా మిలియా ఇస్లామియా యూనివర్శిటీ విద్యార్థులు నిరసనలతో హోరెత్తించారు. బీజేపీ ప్రచారం మొత్తం షాహీన్బాగ్ కేంద్రంగా జరిగింది. షాహీన్ బాగ్ మరియు జామియా ప్రాంతాలు ఓక్లా నియోజకవర్గంలో ఉన్నాయి . నిరసనకారులకు అర్థం అయ్యేలా చెప్పడం పోయి బీజేపీ నేతలు ఒక సామాజిక వర్గంను లక్ష్యంగా చేసుకుని ప్రచారం చేయడంతో సొంత సామాజిక వర్గంవారు కూడా బీజేపీకి దూరమై ఉంటారనే వాదన వినిపిస్తోంది. ఇక ఢిల్లీలో యువత ఆప్ వైపే మొగ్గు చూపిందనేది వాస్తవం. ఆప్ ఫర్ యూత్... యూత్ ఫర్ ఆప్ అనేది మరోసారి రుజువైంది.
పర్వేష్ వర్మ వ్యాఖ్యలు కొంపముంచాయా..?
ఢిల్లీలో అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వంపై ప్రజలు వ్యతిరేకతతో ఉన్నారంటూ కమలనాథులు చేసిన వ్యాఖ్యలు నిజం కాదని ఢిల్లీ ఫలితాలతో తేలిపోయింది. ఇక ప్రచార సమయంలో బీజేపీ ఎంపీ పర్వేష్ వర్మ చేసిన వ్యాఖ్యలు కమలనాథులకు తీరని నష్టాన్ని తీసుకొచ్చిందని అనలిస్టులు చెబుతున్నారు. ఆయన అరవింద్ కేజ్రీవాల్ను ఉగ్రవాదితో పోల్చడమే కాకుండా... షాహీన్బాగ్ నిరసనకారులపై కూడా నోరు జారారు. షాహీన్బాగ్ నిరసన కారులు ఇళ్లల్లోకి చొరబడి ఇంట్లో మహిళలు, కూతుళ్లపై అత్యాచారంకు పాల్పడి చంపేస్తారనే వ్యాఖ్యలు కమలం పార్టీకి నష్టం తీసుకొచ్చి ఉంటాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరోవైపు కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ చేసిన గోలీమార్ వ్యాఖ్యలు కూడా ఆ పార్టీకి నష్టం చేకూర్చాయి.
Recommended Video
యోగీ ఆదిత్యనాథ్ బిర్యానీ వ్యాఖ్యలు
ఇక జేఎన్యూలో బీజేపీ మద్దతు దారులుగా ఉన్న విద్యార్థులు దాడి చేసి భయాందోళనలు సృష్టించడం, సీఏఏకు వ్యతిరేకంగా నిరసనలు చేపడుతున్న జామియా మిలియా ఇస్లామియా విద్యార్థులపై దాడులు వంటివి కూడా ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీపై ప్రభావం చూపి ఉంటాయనే వాదన కూడా వినిపిస్తోంది. ఇక నిరసనలు జరుగుతున్న ప్రాంతాల్లో తుపాకులు హల్చల్ చేయడం వంటివి కూడా నెగిటివ్ ఇంపాక్ట్ క్రియేట్ చేసి ఉండొచ్చని అనలిస్టులు విశ్లేషిస్తున్నారు. ఇక ప్రచారం సందర్భంగా యూపీ సీఎం యోగీ ఆదిత్యనాథ్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు కూడా ఓటరు ఆమ్ ఆద్మీ వైపు మొగ్గు చూపేలా చేసి ఉంటాయనే భావన సైతం వ్యక్తం అవుతోంది. షాహీన్బాగ్ నిరసనకారులకు అరవింద్ కేజ్రీవాల్ బిర్యానీ తినిపిస్తున్నారనే వ్యాఖ్యలు దుమారం రేపాయి.
మొత్తానికి బీజేపీ ఢిల్లీ ఎన్నికల్లో ఓటమి పాలవడానికి కారణం సొంత నేతలు ప్రచారం సందర్భంగా చేసిన వ్యాఖ్యలే అని అనలిస్టులు విశ్లేషిస్తున్నారు. అంతేకాదు వారు సీఎం అభ్యర్థిని ముందే ప్రకటించకపోవడం కూడా మైనస్ అని ఇది జార్ఖండ్ ఎన్నికల్లో కూడా రుజువైందనే విషయాన్ని గుర్తుచేస్తున్నారు.